క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ (Prof.Christoph von Fürer-Haimendorf) (1909-1995) [1] లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన మానవశాస్త్ర ఆచార్యుడు. 1940లో కొమరం భీం అనే గోండు విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై, దోపిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరంభీంని, అదిలాబాదులోని "జోడేఘాట్" వద్ద కాల్చి చంపినా, గోండులలో చెలరేగిన అలజడిని, అశాంతిని అణచలేకపోయారు. ఈ అశాంతి కారణాలను విశ్లేషించి, తగు సూచనల నివ్వవలసిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం, లండన్ విశ్వవిద్యాలయంలో మానవశాస్త్ర (Anthropology) విభాగాధ్యక్షుడైన హైమండాఫ్ ను కోరింది. పరిశీలన కోసం వచ్చిన మనిషి, గోండుల దైన్యాన్ని చూసి, కరిగిపోయి, ఆ సమస్యల పరిష్కారాన్ని అన్వేషిస్తూ, మార్లవాయి గ్రామంలో ఏళ్ళతరబడి ఉండిపోయాడు. ఆయన పుణ్యమా అని, గోండులకు భూమిపై హక్కు, పట్టాలూ లభించాయి. వారి అభివృద్ధికై ప్రప్రథమంగా చట్టాలు చేయబడ్డాయి. ఈ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధం అయింది. వారికి సేవ చేయడమే కాక, వారి ఆచారవ్యవహారాల గురించీ, సమస్యల గురించీ రెండు పుస్తకాలను వ్రాశాడు హైమండాఫ్. గోండుల గురించి పుస్తక పరిజ్ఞానం సంపాదించాలంటే, యీ రోజు వరకు, యీ పుస్తకాలు తప్ప వేరే లేవు.

హైమండాఫ్

ఆయన సతీమణి ఎలిజిబెత్ బర్నార్డో (బెట్టీ), లండన్ లో పుట్టిపెరిగినా, తన భర్తతో పాటు 1940 నుండి ఏళ్ళ తరబడి ఆదిలాబాద్ అడవుల్లో గుర్రం మీద, కాలినడకన తిరుగుతూ, హైమండాఫ్ కు పరిశోధనలో తోడ్పడటమే కాకుండా, ఆదివాసుల సమస్యలను మాతృదృష్టితో అవగాహన చేసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి పై అధికారులకు వ్రాసి, సేవ చేసిన వనిత. ఆమె 1987లో హైదరాబాదులో చనిపోయినప్పుడు, హైమండాఫ్ "నాకూ, ఆవిడకూ అర్థవంతమైన జీవితం గడిచింది గోండుల మధ్యనే. మేము కలిసి నివసించిన మార్లవాయి గ్రామంలో గోండుల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరగాలి" అన్నాడట.

గోండులలో మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబ దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. ప్రతి యేటా యీ నాగోబా జాతర జరుగుతుంది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో "దర్బార్‌" ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ హైమండాఫ్ అనుకొని, మొదట

1946 లో దర్బార్‌ను నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ప్రొఫెసర్ హైమండాఫ్ మొత్తం మూడు పుస్తకాలను వ్రాశాడు.

అవి:

1. ది గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: ట్రెడిషన్ అండ్ ఛేంజ్ ఇన్ యాన్ ఇండియన్ ట్రైబ్ (1979;ఢిల్లీ, లండన్)

2. ఎ హిమాలయన్ ట్రైబ్ ఫ్రమ్ క్యాటిల్ టు క్యాష్ (1980;ఢిల్లీ, బెర్కెలీ)

3. ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ (2000).

ఆదిలాబాద్ జిల్లా

మూలాలు మార్చు

  • ఫణికుమార్ రచించిన" గోదావరి గాథలు"
  • మనుగడ కోసం పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు - అనంత్. (అనువాదం)
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-08. Retrieved 2009-03-19.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హైమండాఫ్&oldid=3692394" నుండి వెలికితీశారు