బయ్యా సూర్యనారాయణ మూర్తి

స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, కేంద్ర మంత్రి
(బయ్యా సూర్యనారాయణమూర్తి నుండి దారిమార్పు చెందింది)

బి. ఎస్. మూర్తి గా ప్రసిద్ధులైన బయ్యా సూర్యనారాయణ మూర్తి (1909 - 1979) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, హరిజన నాయకులు, కేంద్ర మంత్రి.

ఇతను తూర్పు గోదావరి జిల్లా లోని రాజోలు తాలూకా నగరం గ్రామంలో నాగయ్య దంపతులకు 1909లో జన్మించాడు. రాజమహేంద్రవరం, చెన్నైలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యాడు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1937-1939 మరలా 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేసాడు. దేశ స్వాతంత్ర్యసమరంలో వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించాడు. ఇతను 'నవజీవన' పత్రికకు సంపాదకులుగా పనిచేసాడు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసాడు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా కొంతకాలం వ్యవహరించాడు.

1952, 1957, 1962, 1967, 1971 లలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా ప్రజాసేవ చేసాడు. భారత ప్రభుత్వ సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ సెక్రటరీగాను, అదే శాఖకు డిప్యూటీ మంత్రిగాను పనిచేసాడు.ఇతను 1947 సంవత్సరంలో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలోనికి అంటరానివారిని అనుమతించాలని సత్యాగ్రహం నిర్వహించి, దాన్ని సాధించారు.ఇతను రచయితగా Revolt of Six Crores, Depressed and oppressed: forever in agony (1972) and The Glimmer in darkness అనే ఆంగ్ల పుస్తకాలు ప్రచురించాడు.ఇతను 1979లో పరమపదించారు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

మూలాలు మార్చు

  • 20 వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • Bayya Suryanarayana Murthy, Dalit movement in India and its leaders : 1857-1956, Ramacandra Kshirasagara, 1994.

బయటి లింకులు మార్చు