బోయి విజయభారతి
బోయి విజయభారతి తెలుగులో ప్రముఖ రచయిత్రి . ప్రముఖ కవి బోయి భీమన్న కూతురు.[1]
జీవిత విశేషాలుసవరించు
బాల్యంసవరించు
విజయ భారతి తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో 1941 లో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ రచయిత బోయి భీమన్న, తల్లి నాగరత్నమ్మ. ఈమె మాతామహుడు అంబేద్కర్, గాంధీలచే ప్రభావితుడైన క్రైస్తవ మిషనరీ పాఠశాలల స్థాయిలో పాఠశాలలను స్థాపించాడు. ఈమె చిన్నతనం నుండే కుసుమ ధర్మన్న వంటి ప్రముఖ దళితోద్యమ నాయకులతో పరిచయమున్న కుటుంబ వాతావరణంలో పెరిగింది.[2]
విద్య, ఉద్యోగంసవరించు
విజయభారతి కోఠీలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసింది. ఈమె ' దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం - సాంఘిక పరిస్థితులు ' అను అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.[3]. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేటు పొందిన ద్వితీయ మహిళ విజయభారతే. తెలుగు అకాడమీలో డిప్యూటి డైరెక్టర్ గా పనిచేసింది. ‘ప్రాచీన సాహిత్యకోశం’, ‘ఆధునిక సాహిత్యకోశం’ ఆమె సంపాదకత్వంలోనే వెలువడినవి. ఈమె 1968లో ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంను వివాహం చేసుకుంది.
సాహిత్యకృషిసవరించు
విజయభారతి అంబేద్కర్ను, జ్యోతిబా ఫూలేను బాగా అధ్యయనం చేసింది. ఆ ప్రభావాలతో భారతీయ కుల వ్యవస్థ స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతి హాసాలు ఆధారంగా విశ్లేషణలు చేస్తూ రచనలు చేసింది. వాటిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. వాటిలో మొదటిది పురాణాలు-కులవ్యవస్థ, సత్యహరిశ్చంద్రుడు (2002) దీని తొలి రూపం. జ్యోతిబా ఫూలేని ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమాలకు, తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన రచయిత్రి విజయభారతి. ఆమె రాసిన ‘షట్చక్రవర్తులు’ అనే పుస్తక శృంకలానికి 2003వ సంవత్సరంలో కెనడాలోని ‘డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషనరీస్’, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్వ అవార్డులు వచ్చినవి.
బోయి విజయభారతి 1990ల నుండి విశేషంగా దళిత సాహిత్య విమర్శపై కృషిని కొనసాగించింది. విజయభారతి వ్యాసాలలో రెండు రకాల ధోరణులు కనిపిస్తాయి. ఆధునిక దళిత సాహిత్యాన్ని విశ్లేషించటం ఒక ధోరణి కాగా, ప్రాచీన సాహిత్యాన్ని దళిత, స్త్రీవాద కోణాల నుండి విశ్లేషించటం మరొక ధోరణి. 1990లో నలుపు పత్రికలో దళిత సాహిత్యంపై వచ్చిన ఈమె వ్యాసంలో సాంఘిక సమానత్వం, ఆర్థిక ప్రగతి, మానవ స్వేచ్ఛ వంటి రంగాలలో సమాజం నుంచి వేరుగా చేయబడిన వారు దళితులని నిర్వచించి, కుల, మతపరమైన నిషేధాలవల్ల, ఆర్థిక వ్యత్యాసాల వల్ల వేరుగా చూడబడ్తూ, సామాజిక దౌష్ట్యానికి గురి అవుతూ, నిస్సహాయంగా జీవితాలు వెళ్ళదీస్తున్న వారికోసం ఆవేదన చెందటం, సమస్యలు చిత్రించటం, మెరుగు పర్చటానికి పరిష్కార మార్గాలు సూచించటం దళిత సాహిత్య ముఖ్య లక్షణంగా పేర్కొన్నది.
రచనలుసవరించు
- రాముని కృష్ణుని రహస్యాలు
- మహాత్మ జ్యోతి బాపూలే
- బాబాసాహెబ్ అంబేద్కర్
- సంపాదకత్వం
- అంబేద్కర్ రచనలు
- అంబేద్కర్ ప్రసంగాలు
- సాహిత్య కోశం (1,2 సంపుటాలు)
మూలాలుసవరించు
- ↑ హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం - సాక్షి, జనవరి 04, 2014
- ↑ A History of Telugu Dalit Literature By Thummapudi Bharathi
- ↑ 10 వ తరగతి తెలుగు వాచకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ ,2012, పుట-116