భాగవత మేళా అనేది మేలత్తూరు గ్రామంలో ఏటా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రదర్శితమవుతున్న తేటతెలుగు నృత్యనాటకాలు. సుమారు 75 సంవత్సరాలుగా మేలత్తూరు భాగవత మేళా వారు ఇక్కడ అనేక నాటకాలను ప్రదర్శిస్తున్నారు.[1] భాగవత మేళా కళాకారులు మాత్రం 500 ఏళ్లుగా చిత్తశుద్ధితో తెలుగు భాష ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ‘భాగవతమేళా’ పేరుతో ఏటా మే నెలలో ఇక్కడ నిర్వహించే నాట్య నాటకోత్సవాలను చూస్తే మనమున్నది తమిళనాడులో కాదు అచ్చు తెలుగు ప్రాంతమని ఎవరైనా అనుకోవాల్సిందే.[2]

విశేషాలు మార్చు

ఈ మేలత్తూరు గ్రామం తమిళనాడులోని తంజావూరుకి 18 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ భాగవత మేళాను మేనెలలో జరుపుతారు. ఈ మేళాకు దేశం నలుమూలల నుండి కళాభిమానులు ఇక్కడ జరిగే భాగవతమేళా వారి నాట్యోత్సవాలు హాజరవుతారు. మే నెలలో స్థానికంగా ఉన్న నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నృసింహ జయంతి సందర్భంగా ఈ నాట్యోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నాట్యోత్సవాలను సుమారు 75 సంవత్సరాలనాటి నుండి ప్రదర్శిస్తున్నారు. భారతదేశం నలు మూలల నుంచి నటులు, కళాకారులు, నాట్యకారులు... అందరూ వారి వారి సొంత ఖర్చులతో మేలత్తూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఈ నాటక రూపకర్త వెంకటరామశాస్త్రి. సుమారు 500 సంవత్సరాలుగా భాగవత మేళావారి ఈ ప్రదర్శనలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. మేలత్తూరు, సాలియమంగఠం, తంజావూరు ప్రాంతాలలో ఈ ప్రదర్శనలు విస్తృతంగా జరుగుతాయి. వీరి ప్రదర్శనలలో స్త్రీ పాత్రలను సైతం పురుషులే పోషించడం ఓ ప్రత్యేకత.[1]

భాగవత మేళా మార్చు

ఈ భాగవత మేళా లో అనేక నాట్య సంప్రదాయాన్ని వెంకటరామశాస్త్రి తన తండ్రి నుండి వారసత్వంగా నేర్చుకున్నారు. శాస్త్రిగారికి కావ్యాలు, నాటకాలు, అలంకారాలలో ఈయనకు ఆపారమైన పాండిత్యం ఉంది. వీరు కూర్చిన నాటకాలలో ప్రహ్లాద చరితం, మార్కండేయ చరిత్ర, హరిశ్చంద్ర, ఉషా పరిణయం, రుక్మాంగద, హరిహరలీలా విలాసం, కంస వధ, సీతా పరిణయం, రుక్మిణీ కల్యాణం, ధృవచరిత్ర, సతీ సావిత్రి నాటకాలు ప్రసిద్ధాలు. శాస్త్రిగారు తన రచనలన్నింటినీ మేలత్తూరు గ్రామ దైవమైన వరదరాజుకి అంకితం చేశారు. వీరి ప్రదర్శనలలో ప్రధాన లక్షణం భక్తి. స్త్రీ పాత్రలను సైతం పురుషులే పోషించడం వీరి ప్రత్యేకత. భగవంతుడైన నరసింహుని ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తారు. విష్ణుమూర్తి ఆరాధనగా భావిస్తారు. అందువల్ల నాటక ప్రదర్శనలో అసభ్యతకు తావుండదు.[3] చక్కటి తెలుగు సీస, ఉత్పలమాల, చంపకమాల, తేటగీతి, ఆటవెలది పద్యాలు వీనులవిందు చేస్తాయి. విశేషమేంటంటే.. తంజావూరు భాగవతమేళాలో నేటికీ ప్రదర్శితమవుతున్న ఈ నృత్యనాటకాలన్నీ త్యాగరాజస్వామికి సమకాలీనుడైన సంగీత విద్వాంసుడు మేలటూరు వెంకట రామశాస్త్రి రచించినవే. [2]

చరిత్ర మార్చు

విజయనగర సామ్రాజ్యంలోని చెవ్వప్ప నాయకుని పాలనలో ఇక్కడి భాగవతమేళాలో కీలకపాత్ర పోషించే భాగవతుల కుటుంబాలు వచ్చాయి. తంజావూరు సాహిత్య, సంగీత, నాట్య కళలకు పట్టుగొమ్మ. ఆంధ్ర దేశాన ప్రసిద్ధి చెందిన భాగవతుల నాట్యకళ తమిళదేశపు నాట్య సంప్రదాయాలతో సంగమమైంది. రఘునాథ నాయకుని తండ్రి అచ్యుతప్ప నాయకుడు 500 తెలుగు బ్రాహ్మణ కుటుంబాలకు తంజావూరుకు 20 కి.మీ. దూరంలో ఉన్న మేలటూరులో నివాసమేర్పరచి భూములు దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అలా వలస వచ్చిన వారి వంశీకుడే వెంకట రామశాస్త్రి.

ఆయన చేసిన వివిధ రచనల వల్ల భాగవతమేళా సంప్రదాయం పునఃప్రతిష్ఠితమై నేటికీ సజీవంగా నిలబడింది. 18వశతాబ్దానికి చెందిన వెంకట రామశాస్త్రి 11 నృత్య నాటకాలు రచించారు. అవి.. ప్రహ్లాద చరిత్రము, రుక్మిణీ కల్యాణము, మార్కండేయ చరిత్రము, సీతా కల్యాణము తదితరాలు. ఇవి తెలుగుజాతి గర్వించదగిన సాహిత్య సంపదగా నిలిచాయి. ఈ సంప్రదాయ కళను, సాహిత్యాన్నీ ఈనాటి వరకూ తమిళులే కాపాడుతూ రావడం విశేషం. పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వంగా 65 ఏళ్ల ఆర్‌.మహాలింగం(మాలి) భాగవతమేళా నాట్య నాటక విద్యా సంఘం ద్వారా ఏటా లక్ష్మీ నరసింహ జయంతి ఉత్సవాలను, నాట్యనాటకాలను ప్రదర్శిస్తున్నారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు