వజ్జా సాంబశివరావు

శ్రీ వఝ్ఝా సాంబశివరావు (వీ.ఎస్.రావు) మార్చు

ప్రపంచస్థాయి బిట్స్ పిలానీ, డీం డ్ విశ్వవిద్యాలయం ఇన్-ఛార్జ్ ఉపకులపతి.

వీరి స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్ళూరు. నాన్న వెంకటపతిరావు, అమ్మ అనసూయమ్మ. సాధారణ రైతు కుటుంబం. వీరు ఐదవ తరగతి వరకు తుళ్ళూరు గ్రామంలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలలోనే చదివినారు. తరువాత కె.వి.ఆర్.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 11వ తరగతి (ఎస్.ఎస్.ఎల్.సి) వరకు చదివినారు. తరువాత బి.ఎస్.సి., చదివి బిట్స్, పిలానీలో చేరినారు. అక్కడే ఎం.ఎస్.సి., పి.హెచ్.డి.లను చదివినారు. తరువాత అదే సంస్థలో అధ్యాపకునిగా చేరి, నాలుగు దశాబ్దాలపాటు వివిధ హోదాలలో బిట్స్ విస్తరణకు సహాయపడినారు. 2005 లో నాటి బిట్స్ ఛాన్సలర్ శ్రీ కె.బి.బిర్లా, హైదరాబాదులోని శామీర్ పేటలో బిట్స్ ప్రాంగణం కొరకు 200 ఎకరాల భూమి సమకూర్చడంలో కీలకపాత్ర వహించడమేగాక, రాళ్ళు, గుట్టలతో ఉన్న ఆ ప్రాంతములో కేవలం 8 నెలలో రు. 250కోట్ల వ్యయంతో ఆధునిక విద్యాసౌధాన్ని నిర్మించారు. 2006 లో ప్రారంభమైన ఈ ప్రాంగణం, ప్రస్తుతం, 13 విభాగాలతో, 200 మంది అధ్యాపక నిపుణులు, 3,500 మంది విద్యార్థులతో దేశంలోనే అగ్రగామిసంస్థగా మారినది. 2020 నాటికి బిట్స్, హైదరాబాదు విద్యాసంస్థను రు. 350 కోట్లతో వీరు విస్తరించనున్నారు. తుళ్ళూరులోని తమ పదెకరాల పొలాన్నీ వీరు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కొరకు అప్పగించారు. [2]

వీరి భావాలు,అనుభవాలు మార్చు

  • ఊళ్లో పెళ్లో ఇతర శుభాశుభకార్యాలో జరిగితే ఇప్పట్లాగా గదిలోకి పోయి తలుపులు బిడాయించుకుని చదువుకోమని చెప్పేవారు కాదు పెద్దవాళ్లు. ఆ కార్యక్రమాల్లో ఎవరి వయసుకు తగినట్టు వాళ్లకు ఏదో ఒక పని చెప్పేవారు. అందువల్ల ఆ వయసు నుంచే కార్యభారాన్ని శక్తి కొద్దీ పంచుకోవడం, నిర్వహించడం కూడా వచ్చేది పిల్లలకు. ఇప్పుడు ఆలోచిస్తే 'యూ కెన్ డూ ఇట్' అన్న స్ఫూర్తిని అంత చిన్నతనంలోనే నింపడం అన్నమాట అది. ఇదీ పల్లెటూరు చేసే మేలు.
  • చిన్నప్పుడు భక్తిభావమంటూ ఏముంటుంది, ప్రసాదాల మీద ధ్యాస తప్ప? ధనుర్మాసంలో దేవుళ్లకు పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి అంటూ రకరకాల పదార్థాలు నైవేద్యం పెట్టేవారు, తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టేవారు. ఆ ప్రసాదాల కోసం గుళ్ల చుట్టూ తిరిగేవాళ్లం. వాటి రుచి ఇప్పుడు తల్చుకున్నా నోట్లో నీళ్లూరుతాయి.
  • మా ఊళ్లో ఐదు వేల జనాభా ఉండేది. అన్ని కులాలవాళ్లూ ఉండేవారు. అందరూ వరసలు పెట్టి పిలుచుకునేవారు.
  • మా అక్క, బావగార్లతో పాటు మా అమ్మ ఊళ్లోనే ఉంటోంది. అన్ని రకాలుగా బాగున్న మా ఊరు విద్యా రంగంలో కాస్త వెనుకబడిందన్న బాధ నాలో ఉంది. ఆ లోటు లేకుండా నా తరపు నుంచి ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలతో మొదటి అడుగు వేద్దామనుకుంటున్నాను.
  • నేను రైతుబిడ్డనే అయినా నాకు సీరియస్ వ్యవసాయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా పొలానికి వెళ్లివచ్చేవాణ్ని తప్ప, అవసరం కొద్దీ కాదు. అందువల్ల నాకు దున్నడం, నాట్లు వంటి పనులు రావు. వేరుశెనగకాయలు పీకడం, ఎండబెట్టిన కాయలను బస్తాలకెత్తడం చూడడం మాత్రం భలే సంతోషంగా ఉండేది.

మూలాలు మార్చు

[1] ఆంధ్రజ్యోతి 24.11.2013 http://www.andhrajyothy.com/node/32599[permanent dead link] [2] ఈనాడు మెయిన్; 2015, జూలై-31; 14వపేజీ.