వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2022)

2022 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.

1వ వారం
నియాండర్తల్

నియాండర్తల్ యురేషియాలో సుమారు 40,000 సంవత్సరాల క్రితం వరకు నివసించి, అంతరించిపోయిన పురాతన మానవుల జాతి లేదా ఉపజాతి. దీని శాస్త్రీయ నామం హోమో నియాండర్తలెన్సిస్ లేదా హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్. వలస వచ్చిన ఆధునిక మానవులతో పోటీ పడి గాని, వాళ్ళతో స్పర్థ వలన గానీ, లేదా శీతోష్ణస్థితుల్లో వచ్చిన గొప్ప మార్పు వలన గానీ, వ్యాధుల వలన గానీ, లేదా పై కారణాల్లో కొన్నిటి వలన గానీ, లేదా అన్నింటి వలన గానీ అవి అంతరించిపోయాయి. ఆధునిక మానవుల నుండి నియాండర్తళ్ళు ఎప్పుడు వేరుపడ్డారో స్పష్టంగా లేదు. DNA అధ్యయనాల్లో ఈ కాలం 1,82,000 సంవత్సరాల క్రితం నుండి 80,000 సంవత్సరాల క్రితం వరకు ఉండొచ్చని తేలింది. నియాండర్తళ్ళు తమ పూర్వీకుడైన హెచ్. హైడెల్బెర్గెన్సిస్ నుండి ఎప్పుడు వేరుపడ్డారనేది కూడా అస్పష్టంగా ఉంది. నియాండర్తళ్ళకు చెందినవని భావిస్తున్న అత్యంత పురాతన ఎముకలు 4,30,000 సంవత్సరాల నాటివి. కానీ వాటి వర్గీకరణ అనిశ్చితంగా ఉంది. నియాండర్తల్‌కు చెందిన శిలాజాలు ముఖ్యంగా 1,30,000 సవత్సరాల క్రితం తరువాతి కాలానికి చెందినవి చాలా లభించాయి. నియాండర్తల్ 1 అనే టైప్ స్పెసిమెన్ను 1856 లో జర్మనీ లోని నియాండర్ లోయలో కనుగొన్నారు. నియాండర్తళ్ళను ఆదిమ జాతిగాను, తెలివితక్కువ వారిగాను, క్రూరులు గానూ 20 వ శతాబ్దం ప్రారంభంలో చిత్రీకరించారు. తదనంతర కాలంలో వారి గురించిన జ్ఞానం, అవగాహన శాస్త్ర ప్రపంచంలో బాగా మారినప్పటికీ, పరిణతి చెందని, గుహల్లో జీవించిన ఆదిమ మానవులుగా వారిని భావించడం ప్రముఖ సంస్కృతుల్లో ఇంకా ప్రబలంగానే ఉంది.
(ఇంకా…)

2వ వారం
ఓజోన్ క్షీణత

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. "ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది.
(ఇంకా…)

3వ వారం
దక్కన్ పీఠభూమి

దక్కన్ పీఠభూమి భారతదేశంలోని దక్షిణభాగాన్ని ఆవరించి ఉన్న పెద్ద పీఠభూమి. దీన్నే ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఎక్కువభాగం రాళ్ళతో కూడుకున్న ఈ పీఠభూమి ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు, సగటున సుమారు 600 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, భారత ఉపఖండంలోని దక్షిణ, మధ్య భాగాల్లో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. దీనికి పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగమే ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరాన గల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన భాగాలున్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగిన, అధిక విస్తీర్ణంగల, అనేక పెద్ద నదులు గల ప్రాంతం. ఈ పీఠభూముల్లో భారత చరిత్రలో పేర్కొన్న పల్లవులు, శాతవాహనలు, వాకాటక వంశం, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాదంబ వంశం, కాకతీయులు, ముసునూరి నాయకులు, విజయనగర రాజులు, మరాఠా సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, దక్కన్ సుల్తానులు, హైదరాబాదు నిజాములు రాజ్యాలు ఏర్పాటు చేసుకుని పరిపాలించారు.
(ఇంకా…)

4వ వారం
ఆజాద్ హింద్ ఫౌజ్

ఆజాద్ హింద్ ఫౌజ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో 1942 సెప్టెంబరు 1 న భారతీయ స్వాతంత్ర్య యోధులు, జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం దీని లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధపు ఆగ్నేయాసియా యుద్ధరంగంలో జరిగిన యుద్ధంలో ఇది జపాను సైనికులతో కలిసి పోరాడింది. ఈ సైన్యాన్ని మొదట 1942 లో రాస్‌ బిహారి బోస్‌ నేతృత్వంలో భారతీయ యుద్ధ ఖైదీలు స్థాపించారు. ఈ యుద్ధఖైదీలు, మలయా, సింగపూర్ యుద్ధాల్లో జపాను వారు పట్టుకున్న బ్రిటిషు భారతీయ సైన్యానికి చెందిన సైనికులు. ఆసియాలో జరిగిన యుద్ధంలో జపాను పాత్రపై ఫౌజు నాయకత్వానికి, జపాను మిలిటరీకీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ మొదటి ఫౌజు కూలిపోయింది. అదే సంవత్సరం డిసెంబరులో దాన్ని రద్దు చేసారు. రాష్ బిహారీ బోసు ఫౌజును సుభాష్ చంద్రబోసుకు అప్పగించాడు. 1943 లో ఆగ్నేయాసియాకు వచ్చిన సుభాష్ చంద్రబోసు, దీన్ని పునరుద్ధరించాడు. సైన్యం బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సైన్యంగా ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, తన పేరు మీదుగా INA బ్రిగేడ్‌లు/రెజిమెంట్‌లకు పేర్లు పెట్టాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద ఒక మహిళా రెజిమెంటును కూడా నెలకొల్పాడు. బోసు నాయకత్వంలో, మలయా (ప్రస్తుత మలేషియా), బర్మాలోని భారతీయ ప్రవాస జనాభా నుండి వేలాది మంది పౌర వాలంటీర్లు, మాజీ ఖైదీలూ ఫౌజులో చేరారు. ఈ రెండవ INA బ్రిటిషు, కామన్వెల్త్ దళాలకు వ్యతిరేకంగా ఇంపీరియల్ జపాను సైన్యంతో కలిసి బర్మాలో జరిగిన యుద్ధాల్లో పోరాడింది. తొలుత ఇంఫాల్, కోహిమాల్లోను, ఆ తరువాత మిత్రరాజ్యాలు బర్మాను తిరిగి స్వాధీనం చేసుకున్నపుడు వారికి వ్యతిరేకంగానూ పోరాడింది.
(ఇంకా…)

5వ వారం
హొయసల సామ్రాజ్యం

హొయసల సామ్రాజ్యం భారత ఉపఖండం నుండి ఉద్భవించిన కన్నడ రాచరిక సామ్రాజ్యం. ఇది 10-14 వ శతాబ్దాల మధ్య ఆధునిక కర్ణాటక లోని చాలా ప్రాంతాన్ని పరిపాలించింది. హొయసల రాజధాని మొదట్లో బేలూరు వద్ద ఉండేది. తరువాత హళేబీడుకు తరలించారు.

హొయసల పాలకులు మొదట పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతం మాలెనాడుకు చెందిన వారు. 12 వ శతాబ్దంలో, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, కల్యాణికి చెందిన కాలచుర్యుల మధ్య జరుగుతూండే పరస్పర వినాశకర యుద్ధాలను సద్వినియోగం చేసుకొని, వారు ప్రస్తుత కర్ణాటక ప్రాంతాలను, ప్రస్తుత తమిళనాడులోని కావేరి డెల్టాకు ఉత్తరాన ఉన్న సారవంతమైన ప్రాంతాలనూ స్వాధీనం చేసుకున్నారు. 13 వ శతాబ్దం నాటికి, వారు కర్ణాటకలో ఎక్కువ భాగం, తమిళనాడులోని చిన్న భాగాలు, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనూ పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో కళ, వాస్తుశిల్పం, మతం అభివృద్ధిలో హొయసల శకం ఒక ముఖ్యమైన కాలం. ఈ సామ్రాజ్యం ఈ రోజు ప్రధానంగా హొయసల వాస్తుశైలికి గుర్తుండిపోతుంది. ప్రస్తుతం వందకు పైగా హొయసల కాలానికి చెందిన దేవాలయాలు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నాయి.
(ఇంకా…)

6వ వారం
రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు

రాయల్ ఇండియన్ నేవీకి చెందిన భారత నావికులు 1946 ఫిబ్రవరి 18 న బొంబాయి నౌకాశ్రయంలోని స్థావరాల్లోను, నౌకలపైనా చేసిన తిరుగుబాటును రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అని పిలుస్తారు. దీన్ని బాంబే తిరుగుబాటు అని కూడా అంటారు. బొంబాయిలో రాజుకున్న తిరుగుబాటు, కరాచీ నుండి కలకత్తా వరకు బ్రిటిష్ ఇండియా అంతటా వ్యాపించింది. చివరికి 78 నౌకల్లోను, తీర స్థావరాలలోనూ ఉన్న 20,000 మంది నావికులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ దళాలు, రాయల్ నేవీ యుద్ధ నౌకలు బలవంతంగా అణచివేసాయి. మొత్తం 8 మంది మరణించారు, 33 మంది గాయపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే పోరాటంలో పాల్గొన్నవారికి మద్దతు ఇచ్చింది; ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ దీన్ని ఖండించాయి.
(ఇంకా…)

7వ వారం
బేరియం

బేరియం ఒక రసాయనిక మూలకం. ఈ మూలకం పరమాణు సంఖ్య 56. ఈ మూలకం యొక్క సంకేత నామాక్షరము Ba. మూలకాల ఆవర్తన పట్టిలలో రెండవ సముదాయానికి చెందిన 5 వ మూలకం. చూడటానికి వెండి వన్నె కలిగిన ఈ మూలకం ఒక క్షారమృత్తిక లోహము. బేరియం అధిక రసాయన ప్రతిచర్య కారణంగా, ప్రకృతిలో స్వచ్ఛమైన రూపంలో లభ్యం కాదు.

బేరైట్ (బేరియం సల్ఫేట్), విథరైట్ (బేరియం కార్బొనేట్) బేరియం ఎక్కువగా లభించే ఖనిజాలు. బేరియం అనే పదం భారమైనది అని అర్థం కలిగిన బేరిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీన్ని ఒక ప్రత్యేకమైన మూలకంగా 1774 లో గుర్తించారు. 1808 లో విద్యుద్విశ్లేషణ సహాయంతో దీన్ని ఒక లోహంగా గుర్తించారు.

పారిశ్రామికంగా బేరియం ను వాక్యూం ట్యూబుల్లో గెటరింగ్ చేయడానికి వాడతారు. టపాకాయలలో దీనిని కలపడం వల్ల వాటిని కాల్చినపుడు పచ్చరంగు కాంతి వెలువడుతుంది. బేరియం సల్ఫేట్ ను చమురు బావుల తవ్వకంలో కరగని ద్రావణంగా వాడతారు. దాని స్వచ్ఛమైన రూపంలో పేగు లోపలి భాగాలను చిత్రీకరించేందుకు రేడియో కాంట్రాస్ట్ ఏజెంటుగా ఉపయోగిస్తారు. అత్యధిక ఉష్టోగ్రత కలిగిన సూపర్ కండక్టర్లలో ఇది ఒక భాగం. ఎలక్ట్రోసిరామిక్స్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇనుము, ఉక్కు లోహాలను పోత పోసేటప్పుడు బేరియాన్ని కలపడం వలన లోహాలలోని కర్బన అణువుల కణపరిమాణం తగ్గుతుంది. నీటిలో కరిగే బేరియం సమ్మేళనాలు విషపూరితాలు. అందుచే వీటిని ఎలుకలమందుగా వాడతారు.
(ఇంకా…)

8వ వారం
మద్రాసు రాష్ట్రం

20 వ శతాబ్దం మధ్యలో మద్రాసు రాష్ట్రం భారతదేశ రాష్ట్రాల్లో ఒకటి. భారత స్వాతంత్ర్యానికి మునుపు బ్రిటిష్ ఏలుబడిలో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న ఇది తర్వాత మద్రాస్ ప్రావిన్సుగా మారింది. 1950 లో అది ఏర్పడిన సమయంలో, ప్రస్తుత తమిళనాడు మొత్తం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, దక్షిణ కెనరాలోని బళ్లారి ఇందులో భాగంగా ఉండేవి. తీరప్రాంత ఆంధ్ర, రాయలసీమలు విడిపోయి, 1953 లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడగా, దక్షిణ కెనరా, బళ్లారి జిల్లాలను మైసూర్ రాష్ట్రంతో, మలబార్ జిల్లాను ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంలో విలీనం చేసి 1956 లో కేరళను ఏర్పాటు చేశారు. 1969 జనవరి 14 న మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు.

ఒ.పి. రామస్వామి రెడ్డియార్ మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానిగా 1949 వరకు ఉన్నాడు. ఈయన నేతృత్వంలో ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించే చట్టం చేశాడు. దేవదాసి వ్యవస్థ రద్దుకు కూడా చట్టాన్ని అమలు చేశారు. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డ తర్వాత మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజా 1952 దాకా పనిచేశాడు. 1952 ఎన్నికల్లో సి. రాజగోపాలాచారి శాసనసభకు ఎన్నికవకపోయినా శాసనమండలికి నామినేట్ అయి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన హయాంలోనే పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను మొదట్లో వ్యతిరేకించిన జవహర్ లాల్ నెహ్రూ శ్రీరాములు మరణంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఒప్పుకున్నాడు కానీ మద్రాసును అందులో కలపడానికి ఒప్పుకోలేదు. 1953 అక్టోబరు 1 న మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడింది. 1954 లో కె. కామరాజ్ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన తర్వాత వచ్చిన భక్తవత్సలం మొదలియార్ మద్రాస్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి. 1969లో ఇది తమిళనాడు రాష్ట్రంగా మారింది.
(ఇంకా…)

9వ వారం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూనిమ్న కక్ష్యలో (Low Earth Orbit) పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా (నాసా), రష్యా (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రంపై హక్కులు, దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి. ఇది ఐఎస్‌ఎస్, మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికీ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. ఐఎస్‌ఎస్ సగటున 400 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. జ్వెజ్డా మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ కక్ష్య నిర్వహణ చేస్తుంది. ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ కేంద్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. రష్యా నిర్వహించే రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్ (ROS), అనేక దేశాలు పంచుకునే యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్ (USOS). ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను 2024 వరకూ పొడిగించే ప్రతిపాదనను రోస్‌కాస్మోస్ ఆమోదించింది. కానీ, రష్యన్ విభాగంలోని అంశాలను OPSEK అనే కొత్త రష్యన్ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి ఉపయోగించాలని రోస్‌కాస్మోస్ గతంలో ప్రతిపాదించింది. 2018 డిసెంబరు నాటి స్థితి ప్రకారం, ఈ కేంద్రం 2030 వరకు పనిచేస్తుంది.
(ఇంకా…)

10వ వారం
చాద్

చాద్ (ఆంగ్లం: Chad) మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. అధికారిక నామం చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్"). ఉత్తరాన లిబియా, తూర్పున సుడాన్, దక్షిణంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వాయువ్యంగా కామెరూన్, నైజీరియా, పశ్చిమంగా నైగర్ దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడి జనాభా సుమారు 1.60 కోట్లు. ఇందులో 16 లక్షలమందికి పైగా రాజధాని అంజమేనా నగరంలో నివసిస్తున్నారు. చాద్ ను పలు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన ఎడారి ప్రాంతం, మధ్యలో ఉష్ణమండల సహేలియన్ ప్రాంతం, దక్షిణాన సారవంతమైన సుడాన్ సవన్నా ప్రాంతం ఉన్నాయి. ఆఫ్రికాలోని రెండవ అతిపెద్ద సరస్సు అయిన చాద్ పేరు మీదుగా ఈ దేశానికా పేరు వచ్చింది. చాద్ సరస్సు ఆఫ్రికాలోనే అతిపెద్ద తడి ప్రాంతం. చాద్ అధికార భాషలు అరబిక్, ఫ్రెంచి. ఇక్కడ సుమారు 200కి పైగా జాతుల, భాషల వారు నివసిస్తున్నారు. ఇస్లాం (51.8%), క్రైస్తవం (44.1%) ఇక్కడ ప్రధానంగా ఆచరించే మతాలు. సా.పూ 7వ సహస్రాబ్ది మొదట్లో ఇక్కడ మానవులు నివసించారు. సా.పూ 1వ సహస్రాబ్దిలో సహేలియన్ భూభాగంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడి కొంతకాలానికి అంతరించి పోయాయి. వీరంతా ఈ ప్రాంతం గుండా వెళ్ళే సహారా రవాణా మార్గాలను నియంత్రించడానికి ప్రయత్నించారు. 1920 లో దీనిని ఫ్రాన్స్ ఆక్రమించి తమ ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా వలస ప్రాంతంలో భాగం చేసుకున్నది. 1960 లో ఫ్రాంకోయిస్ టొంబల్‌బయె నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఉత్తర భాగంలో ముస్లింలలో ఇతని విధానాల పట్ల వచ్చిన వ్యతిరేకత వల్ల 1965 లో అంతర్యుద్ధం ఏర్పడింది. 1979 లో విప్లవకారులు అప్పటి పాలనను అంతం చేశారు కానీ అధికారం కోసం అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి. హిసేనీ హబ్రి వచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్ది అధికారంలోకి వచ్చాడు. 1978 లో చాద్ లిబియా మధ్య యుద్ధం వచ్చింది. అప్పుడు ఫ్రాన్స్ కలుగ జేసుకుని 1987 సంవత్సరంలో ఈ యుద్ధాన్ని అణిచివేసింది. 1990 హబ్రిని అతని కింద పనిచేసే సైనికాధికారి ఇద్రిస్ దెబీ పడగొట్టి అధికారంలోకి వచ్చాడు. 1991 లో సరికొత్తగా చాద్ నేషనల్ ఆర్మీ ఏర్పాటయింది. 2003 నుంచి సుడాన్ తో ఏర్పడ్డ సరిహద్దు విబేధాల వల్ల ఆ దేశం నుంచి వలస వచ్చిన వారితో ఈ దేశం మరిన్ని కష్టాల్లో పడింది. చాద్ రాజ్యాంగంలో అనేక పార్టీలకు అవకాశం ఉన్నా దెబీ విధానాలతో ప్రతిపక్షాలకు సరైన అవకాశం లేకుండా పోయింది. 2021 ఏప్రిల్ లో దెబీని కొంతమంది విప్లవ కారులు చంపేయడంతో అతని కుమారుడు మహమత్ దెబీ, సైన్యాధికారులతో కలిసి మధ్యంతర సంఘం ఏర్పాటు చేసి నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. చాద్ దీర్ఘకాలంగా అనేక రాజకీయ పోరాటాల మధ్య హింసను ఎదుర్కొన్నది. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉన్నది. 2003 నుంచి ఈ దేశంలో ముడి చమురు నిక్షేపాలు కనుగొని వాటి వ్యాపారం ప్రారంభించారు. అంతకుమునుపు వీరు ఎక్కువగా పత్తి ఎగుమతి చేసేవారు. మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఈ దేశంలో ఎక్కువగా ఉన్నది.
(ఇంకా…)

11వ వారం
రమణ మహర్షి

రమణ మహర్షి (తమిళం: ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879ఏప్రిల్ 14, 1950), ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు. ఈయన అసలు పేరు వేంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు. ఈయన తమిళనాడులోని తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895 లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్లు పట్ల భక్తి భావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది. 1896 లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు. ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930వ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది.

రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను, మార్గాలను ఆమోదించాడు. కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మ చింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచు చెప్పేవాడు. ఆయన బోధనలలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. ఇతని బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు.
(ఇంకా…)

12వ వారం
జెట్ ఎయిర్వేస్

జెట్ ఎయిర్‌వేస్ ఒక భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీ లో ఉండగా ముంబయిలో శిక్షణ అభివృద్ధి కేంద్రం ఉంది. ఇది భారతదేశంలో ఇండిగో ఎయిర్ లైన్స్ తర్వాత రెండో అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపించింది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో ఉండేవి.

1992 ఏప్రిల్ లో పరిమిత బాధ్యత గల వ్యాపారసంస్థ(LLC) గా ఈ సంస్థ ప్రారంభమైంది. 1993 లో తన ఎయిర్ టాక్సీ కార్యకలాపాలు ప్రారంభించింది. 1995 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. 2004 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభించింది. 2005 లో పబ్లిక్ మార్కెట్ లో ప్రవేశించింది. 2007 లో ఎయిర్ సహారాను స్వంతం చేసుకుంది. దీని ప్రధాన పోటీదారులైన స్పైస్ జెట్, ఇండిగో విమానయాన సంస్థలు టికెట్ల ధరలు తగ్గించడంతో ఇది కూడా ధరలు తగ్గించవలసి వచ్చింది. దాంతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొన్నది. 2017 అక్టోబరు నాటికి ఇది ఇండిగో కంటే వెనకబడి 17.8% మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పతనం దిశగా సాగి 2019లో దివాలా తీసింది. విస్తారా విమానయాన సంస్థ స్థాపనకు ముందుగా ఎయిర్ ఇండియాతో పాటు ఇది ఒక్కటే భారతదేశం కేంద్రంగా నడిచిన విమానయాన సంస్థ. 2019 ఏప్రిల్ నాటికి దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే 2022 లో మళ్ళీ ప్రారంభం కావచ్చునని వార్తలు వచ్చాయి.
(ఇంకా…)

13వ వారం
మ్యూనిక్ ఒప్పందం

మ్యూనిక్ ఒప్పందం జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రెంచి థర్డ్ రిపబ్లిక్, ఇటలీ రాజ్యాల మధ్య 1938 సెప్టెంబరు 30 న మ్యూనిక్‌లో ముగిసిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం చెకోస్లోవేకియా లోని సుడేటన్‌ల్యాండ్ భూభాగం జర్మనీకి ధారాదత్తమైంది. ఫ్రాన్స్, చెకోస్లోవాక్ రిపబ్లిక్ ల మధ్య 1924 నాటి కూటమి ఒప్పందం, 1925 నాటి సైనిక ఒప్పందాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో చెక్‌ ప్రజలు దీన్ని మ్యూనిక్ ద్రోహం అని అన్నారు. మ్యూనిక్ ఒప్పందం కుదరడంతో ఐరోపాలో చాలా భాగం సంబరాలు జరుపుకుంది. ఈ ఒప్పందం, ఖండంలో ఒక పెద్ద యుద్ధాన్ని నివారించిందని భావించారు. చెకొస్లవేకియా సరిహద్దు ప్రాంతంలో, 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు - ముఖ్యంగా జర్మన్లు - నివసించే సుడేటన్‌ల్యాండ్‌ను జర్మనీ ఆక్రమించేందుకు నాలుగు దేశాలూ అంగీకరించాయి. ఐరోపాలో భూభాగాల గురించి ఇదే తన చివరి దావా అని హిట్లర్ ప్రకటించాడు.

1938 సెప్టెంబరు 17 న చెకోస్లోవేకియాపై జర్మనీ స్వల్ప స్థాయి అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రతిస్పందనగా, సెప్టెంబరు 20 న యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లు చెకోస్లోవేకియాను తన భూభాగాన్ని జర్మనీకి అప్పగించమని అధికారికంగా కోరాయి. దీని తరువాత, సెప్టెంబరు 21 న పోలండు, సెప్టెంబరు 22 న హంగరీలూ చెక్‌ భూభాగంపై తమతమ డిమాండ్లను లేవనెత్తాయి. ఇంతలో, జర్మన్ దళాలు చెబ్ జిల్లా, జెసెనక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలనూ జయించాయి. కాని డజన్ల కొద్దీ ఇతర సరిహద్దు కౌంటీల నుండి వారికి ప్రతిఘటన ఎదురై, వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పోలాండ్ తన సైనిక విభాగాలను చెకోస్లోవేకియాతో సరిహద్దుకు సమీపంలో సమూహపరిచింది. సెప్టెంబరు 23 న ఒక విఫల కుట్రకు ప్రేరేపించింది. హంగరీ కూడా తన సైనికులను చెకోస్లోవేకియా సరిహద్దు వైపు తరలించింది కానీ దాడి చెయ్యలేదు.

1938 సెప్టెంబరు 29-30 న జర్మనీలోని మ్యూనిక్‌లో ప్రధాన యూరోపియన్ శక్తుల అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంలో చెకోస్లోవేకియా ప్రతినిధులు పట్టణం లోనే ఉన్నప్పటికీ వాళ్ళు ఆ సమావేశంలో లేరు. ఫ్రాన్స్, చెకోస్లోవేకియాల మిత్రదేశమైన సోవియట్ యూనియన్ కూడా ఆ సమావేశంలో లేదు. హిట్లర్ కోరుకున్న విధంగా తయారైన ఒక ఒప్పంద పత్రంపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ నాయకులు ఆ సమావేశంలో సంతకాలు చేసారు. జర్మనీని ప్రసన్నం చేసుకోవడానికి గాను దానికి ధారాదత్తం చేసిన చెకోస్లోవాక్ పర్వత సరిహద్దు భూభాగం మధ్యయుగ కాలం నుండి చెక్, జర్మనీల మధ్య సహజమైన సరిహద్దుగా ఉంది. అంతేకాదు, చెక్‌పై జర్మనీ దాడి చేస్తే, ఇది దానికి సహజమైన అడ్డుగోడగా ఉంది. సరిహద్దు దుర్గాలను నిర్మించి గణనీయంగా బలోపేతం చేసుకున్న సుడటన్లాండ్ ప్రాంతం చెకోస్లోవేకియాకు వ్యూహాత్మకంగా చాలా ప్రముఖమైనది.

జర్మనీ, పోలాండ్, హంగేరీల సైనిక ఒత్తిడికి, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్సుల దౌత్యపరమైన ఒత్తిడికీ చెకోస్లోవేకియా లొంగిపోయి, మ్యూనిక్ నిబంధనల ప్రకారం జర్మనీకి తన భూభాగాన్ని వదులుకోవడానికి సెప్టెంబరు 30 న, అంగీకరించింది. అప్పుడు, అక్టోబరు 1 న, పోలండు చేసిన భూభాగ డిమాండ్లను కూడా చెకోస్లోవేకియా అంగీకరించింది.
(ఇంకా…)

14వ వారం
గూగుల్

గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మరియు తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1998 సెప్టెంబర్ 4 న లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థులుగా ఉన్నప్పుడు గూగుల్ని స్థాపించారు. వీరు ఇద్దరూ కలిసి బహిరంగంగా నమోదయిన గూగుల్ వాటాలలో 14 శాతాన్ని కలిగి ఉన్నారు. సూపర్-ఓటింగ్ వాటాల ద్వారా 56% పెట్టుబడిదారుల ఓటింగ్ శక్తిని నియంత్రిస్తారు. కంపెనీ 2004 లో IPO ద్వారా బహిరంగ సంస్థ అయ్యింది. 2015 లో, ఆల్ఫాబెట్ ఇంక్ కు పూర్తి యాజమాన్యంగల అనుబంధ సంస్థగా గూగుల్ పునర్వ్యవస్థీకరించబడింది. ఆల్ఫాబెట్ సీఈఓ అయిన లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచై 2015 అక్టోబర్ 24 న గూగుల్ కు సీఈఓగా నియమితులయ్యారు. 2019 డిసెంబర్ 3 నుంచి సుందర్ పిచై ఆల్ఫాబెట్ కు కూడా సీఈఓ అయ్యారు. 2021 లో, ప్రధానంగా గూగుల్ ఉద్యోగులతో కూడిన, ఆల్ఫాబెట్ వర్కర్ల యూనియన్ స్థాపించబడింది.

విలీనం తర్వాత నుండి గూగుల్ కేంద్ర శోధన యంత్రానికి (గూగుల్ శోధన) మించిన ఉత్పత్తులు, సముపార్జనలు మరియు భాగస్వామ్యాలతో కంపెనీ వేగంగా విస్తరించింది. గూగుల్ పని మరియు ఉత్పాదకతకు (గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు మరియు గూగుల్ స్లయిడ్లు), ఇమెయిల్లకు (జీమెయిల్), షెడ్యూలింగ్ మరియు సమయ నిర్వహణకు (గూగుల్ క్యాలెండర్ ), క్లౌడ్ నిల్వలకు (గూగుల్ డ్రైవ్ ), తక్షణ సందేశం, వీడియో చాట్ కు (గూగుల్ డ్యుయో, గూగుల్ చాట్, మరియు గూగుల్ మీట్), భాష అనువాదానికి (గూగుల్ అనువాదం), మ్యాపింగ్ మరియు నావిగేషన్ కు (గూగుల్ మ్యాప్స్, వేజ్, గూగుల్ ఎర్త్ మరియు స్ట్రీట్ వ్యూ), పోడ్‌కాస్ట్‌లను పంచుకోడానికి (గూగుల్ పాడ్‌కాస్ట్‌లు), వీడియోలు పంచుకోడానికి (యూట్యూబ్), బ్లాగ్ ప్రచురణకు (బ్లాగర్), నోట్స్ రాసుకోడానికి (గూగుల్ కీప్, జాంబోర్డ్), చిత్రాలు ఏర్పరుచుకోడానికి మరియు ఎడిట్ చేయడానికి (గూగుల్ ఫోటోలు) అవసరమైన సేవలను అందిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, క్రోమ్ ఓఎస్ (ఇది ఉచిత, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమైన క్రోమియం ఓఎస్ ఆధారితమైన తేలికైన ఆపరేటింగ్ సిస్టమ్) మరియు గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ల అభివృద్ధికి ఈ కంపెనీ నాయకత్వం వహిస్తుంది. అలాగే గూగుల్ హార్డ్‌వేర్‌లోకి కూడా ప్రవేశించింది; 2010 నుండి 2015 వరకు, గూగుల్ నెక్సస్ పరికరాల ఉత్పత్తుకై ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులతో భాగస్వామ్యమైంది, 2016 లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్, గూగుల్ వైఫై మెష్ వైర్‌లెస్ రౌటర్‌తో సహా పలు హార్డ్‌వేర్ ఉత్పత్తులను విడుదల చేసింది. అలాగే అంతర్జాల క్యారియర్‌గా అవతరించడానికి ప్రయోగాలు (గూగుల్ ఫైబర్ మరియు గూగుల్ ఫై) చేసింది.
(ఇంకా…)

15వ వారం
రాఖీగఢీ

రాఖీగఢీ హర్యానా రాష్ట్రపు హిసార్ జిల్లాలోని గ్రామం. ఢిల్లీకి వాయవ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సింధు లోయ నాగరికతకు పూర్వపు కాలానికి (సా.శ.పూ 6500) చెందిన మానవ ఆవాస స్థలం ఉంది. ఇక్కడే ప్రౌఢ సింధు లోయ నాగరికతకు (సా.శ.పూ. 2600-1900) చెందిన ఆవాస స్థలం కూడా ఉంది. ఇది ఘగ్గర్-హక్రా నది పరీవాహక ప్రాంతంలో, ఘగ్గర్ నది నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.

రాఖీగఢీలో 7 దిబ్బల సముదాయం ఉంది. దాని చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి కావు. ఏయే కాలాలకు చెందిన దిబ్బలను కలిపి చూడాలన్నదాన్ని బట్టి రాఖీగఢీ విస్తీర్ణం 80 నుండి 550 హెక్టార్ల వరకూ ఉంటుంది. 2014 జనవరిలో కనుగొన్న కొత్త దిబ్బల తరువాత ఇది సింధులోయ నాగరికత స్థలాలలోకెల్లా అతి పెద్దదిగా అయింది. 350 హెక్టార్లతో ఇది మొహెంజోదారో కంటే దాదాపు 50 హెక్టార్లు పెద్దది. పరిమాణము, విశిష్టతల కారణంగా రాఖీగఢీ ప్రపంచవ్యాప్తంగా పురాతత్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. మిగతా స్థలాల కంటే ఇది ఢిల్లీకి దగ్గరగా ఉండి, ఉత్తర భారతదేశంలో సింధు లోయ నాగరికత వ్యాప్తిని సూచిస్తోంది. ఈ స్థలంలో చాలా వరకూ ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉంది, విశేషాలను ప్రచురించాల్సీ ఉంది. ఈ ప్రాంతంలోని మరో స్థలం మిటాహాలి లో తవ్వకాలు మొదలు పెట్టాల్సి ఉంది.

2012 మే లో గ్లోబల్ హెరిటేజ్ ఫండ్, ఆసియాలో ప్రమాదపు అంచున ఉన్న తొలి 10 ప్రాచీన వారసత్వ స్థలాల్లో ఒకటిగా రాఖీగఢ్ ను గుర్తించింది.
(ఇంకా…)

16వ వారం
పాంగోంగ్ సరస్సు

పాంగోంగ్ త్సో లేదా పాంగోంగ్ సరస్సు తూర్పు లడఖ్ లోను, పశ్చిమ టిబెట్ లోనూ విస్తరించి ఉన్న భాష్పీభవన సరస్సు. త్సో అంటే టిబెటన్ భాషలో సరస్సు అని అర్థం. ఇది సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. ఇది, పాంగోంగ్ త్సో, త్సో న్యాక్, రమ్ త్సో (జంట సరస్సులు), న్యాక్ త్సో అనే ఐదు ఉప సరస్సు‌లుగా విభజించబడి ఉంటుంది. మొత్తం సరస్సు పొడవులో సుమారు 50% టిబెట్ పరిధిలోను, 40% లడఖ్‌లోనూ ఉంది. మిగతాది భారత చైనాల మధ్య వివాదంలో ఉంది ఈ భాగం చైనా నియంత్రణలో ఉంది. ఈ సరస్సు అత్యధిక వెడల్పు 5 కిలోమీటర్లు. మొత్తమ్మీద దీని వైశాల్యం 604 చ.కి.మీ. ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకడుతుంది. చిన్న శిఖరం దీన్ని సింధు నదీ పరీవాహక ప్రాంతం నుండి వేరు చేస్తుంది. దీని పరీవాహక ప్రాంతం భూ పరివేష్టితమై ఉంటుంది. చరిత్రపూర్వ కాలంలో ఇది సింధు నది పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. రామ్‌సార్ కన్వెన్షన్ కింద ఈ సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి నేలగా గుర్తించే పని జరుగుతోంది. అది పూర్తైతే, ఈ కన్వెన్షన్ కింద దక్షిణ ఆసియాలో సరిహద్దులకు ఇరువైపులా విస్తరించి ఉన్న తడి నేలలో ఇదే మొదటిది అవుతుంది.
(ఇంకా…)

17వ వారం
చౌరీ చౌరా సంఘటన

సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారు. ప్రజాగ్రహాన్ని చూసి భయపడిన గాంధీ ఐదు రోజులు నిరాహార దీక్ష చేపట్టాడు. తాను ఎంచుకున్న అహింసా సిద్ధాంతాన్ని ప్రజలకు పూర్తిగా నేర్పించలేకపోయానని ఆయన అభిప్రాయపడ్డాడు. గాంధీజీ ఉద్యమం నిలిపివేసినపుడు జవహర్ లాల్ నెహ్రూతో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశం ఏకమై బలం పుంజుకుంటున్న సమయంలో అది మంచిది కాదేమోనని అభిప్రాయపడ్డారు. గాంధీజీని కూడా అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ ఆయన అనారోగ్యం దృష్ట్యా 1924 లో విడుదలయ్యాడు.

దీని పర్యవసానంగా బ్రిటిష్ అధికారులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సైనిక శాసనాన్ని ప్రకటించారు. అనేక దాడులు చేసి సుమారు 228 మందిని అరెస్టు చేశారు. వీరిలో 6 మంది పోలీసు కస్టడీలోనే మరణించగా, దోషులుగా నిర్ధారించబడిన 172 మందికి ఉరిశిక్ష విధించారు. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారత కమ్యూనిస్టు నాయకుడు ఈ తీర్పును చట్టబద్ధమైన హత్యగా అభివర్ణించాడు. ఆయన భారత కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చాడు. 1923 ఏప్రిల్ 20 న, అలహాబాద్ హైకోర్టు మరణ తీర్పులను సమీక్షించింది. 19 మందికి మరణశిక్షలను నిర్ధారించింది. 110 మందికి జీవిత ఖైదు విధించింది. మిగిలిన వారికి దీర్ఘకాలిక జైలు శిక్ష విధించింది. ఈ సంఘటనకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం చనిపోయిన పోలీసులకు 1923 లో స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఉరి తీసిన వారిని గౌరవించటానికి భారత ప్రభుత్వం తరువాత మరొక షాహీద్ స్మారక్ను నిర్మించింది. ఈ పొడవైన స్మారక చిహ్నంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. స్మారక చిహ్నం సమీపంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేయబడింది. భారత రైల్వేలు ఒక రైలుకు చౌరి చౌరా ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు, ఇది గోరఖ్‌పూర్ నుండి కాన్పూర్ వరకు నడుస్తుంది.


(ఇంకా…)

18వ వారం
డెహ్రాడూన్

డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది డెహ్రాడూన్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ నగరం గఢ్వాల్ ప్రాంతంలో భాగం. గఢ్వాల్ డివిజనల్ కమీషనర్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది ఢిల్లీకి ఉత్తరాన 248 km (154 mi) దూరాన ఏడవ జాతీయ రహదారిపై ఉంది. రైలు మార్గం (డెహ్రాడూన్ రైల్వే స్టేషన్), విమానాశ్రయం (జాలీ గ్రాంట్ విమానాశ్రయం) తోనూ బాగా అనుసంధానించబడి ఉంది. నగర పరిపాలనను డెహ్రాడూన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నగరంలో నిర్వహిస్తారు. డెహ్రాడూన్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) చుట్టూ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాల్లో ఒకటి. ఇది ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం లోకి వలసలను తగ్గించి అక్కడ జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికీ, హిమాలయాల్లో ఒక స్మార్ట్ సిటీ గానూ ఇది అభివృద్ధి చెందుతోంది. డెహ్రాడూన్ హిమాలయాలకు దిగువన ఉన్న డూన్ వ్యాలీలో ఉంది. తూర్పున గంగానదికి ఉపనది అయిన సోంగ్ నది, పశ్చిమాన యమునా ఉపనది అయిన అసన్ నది ప్రవహిస్తున్నాయి. ఈ నగరం, దాని సుందరమైన ప్రకృతి అందాలకూ, కొద్దిగా తేలికపాటి వాతావరణానికీ ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతానికి ఇది ప్రవేశ ద్వారంగా ఉంది. ఇది ముస్సోరీ, ధనౌల్తి, చక్రతా, న్యూ టెహ్రీ, ఉత్తర‌కాశి, హర్సిల్, చోప్తా - తుంగనాథ్, ఔలి వంటి హిమాలయ పర్యాటక ప్రాంతాలకూ దోడితల్, దయారా బుగిలియాల్‌లోని పూల లోయ వంటి ప్రసిద్ధ వేసవి, శీతాకాల హైకింగ్ గమ్యస్థానాలకూ, కేదార్‌కాంత, హర్ కీ దున్, హేమకుంట్ సాహిబ్ వంటి క్యాంపింగ్ స్థలాలకూ సమీపంలో ఉంది. హిందూ పవిత్ర నగరాలైన హరిద్వార్, రిషికేశ్ , చోటా చార్ ధామ్ హిమాలయ తీర్థయాత్ర సర్క్యూట్‌తో పాటు, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కూడా డెహ్రాడూన్ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ బాస్మతి బియ్యానికి, బేకరీ ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది.
(ఇంకా…)

19వ వారం
డౌన్ సిండ్రోమ్

డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ (Down syndrome) ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులలో క్రోమోజోము 21 (chromosome 21) లో రెండు ఉండాల్సిన పోగులు మూడు వుంటాయి. అందువలన దీనిని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారు. దీనిమూలంగా పిల్లలలో భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. వీరి ముఖంలోని మార్పుల ఆధారంగా గుర్తించవచ్చును. వీరికి తెలివితేటలు చాలా తక్కువగా వుంటాయి. వీరి IQ సుమారు 50 మాత్రమే వుంటుంది (సగటు IQ 100). చాలా మంది పిల్లలు సామాన్యంగా పాఠశాలలో చదువుకోగలిగినా, కొంతమందికి ప్రత్యేకమైన విద్యా సౌకర్యాలు అవసరమౌతాయి. కొద్దిమంది పట్టభద్రులుగా కూడా చదువుకున్నారు. సరైన విద్య, వీరి ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహిస్తే వీరి జీవితంలో క్వాలిటీ బాగుంటుంది.

డౌన్ సిండ్రోం మానవులలో సంభవించే క్రోమోజోము లోపాలన్నింటిలోకి ప్రధానమైనది. అమెరికాలో పుట్టిన ప్రతి 1000 పిల్లలలో 1.4 మందిలో ఈ లోపాన్ని గుర్తించారు. డౌన్ సిండ్రోమ్ మానవులలో చాలా సాధారణ క్రోమోజోమ్ అసాధారణలలో ఒకటి. ఇది సంవత్సరానికి 1,000 మంది పిల్లలు పుట్టుకొస్తుంది. డౌన్ సిండ్రోమ్ 5.4 మిలియన్ల వ్యక్తులలో ఉంది, 1990 లో 43,000 మరణాల నుండి 27,000 మంది మరణించారు. ఇది 1866 లో పూర్తిగా సిండ్రోమ్ను వర్ణించిన ఒక బ్రిటీష్ వైద్యుడు అయిన జాన్ లాంగ్డన్ డౌన్ తర్వాత పెట్టబడింది. 1838 లో జీన్-ఎటిఎన్నే డొమినిక్ ఎస్క్విరోల్, 1844 లో ఎడౌర్డ్ సెగిన్ ఈ పరిస్థితిని కొన్ని విషయాలు వివరించారు. 1959 లో, డౌన్ సిండ్రోమ్ యొక్క జన్యుపరమైన కారణం, క్రోమోజోమ్ 21 అదనపు కాపీని కనుగొనబడింది. ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం జరుపబడుతోంది.
(ఇంకా…)

20వ వారం
అబ్బూరి రామకృష్ణారావు

అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి. ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురింతం అయ్యాయి. అబ్బూరి జీవితంలో ప్రతి అడుగు మిత్రుల సాంగత్యం, సాహిత్యం తోటే ముడిపడి ఉంది. రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు. వారిది పండిత వంశం. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. అబ్బూరి కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణంగా చదివినవారు. 15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణితో వివాహం అయింది. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు స్వర్గీయ అబ్బూరి వరదరాజేశ్వరరావు రచయత, విమర్శకుడు, అధికార భాషా సంఘానికి అధ్యక్ష్యులుగా పనిచేశారు.
(ఇంకా…)

21వ వారం
శ్రీకాకుళం ఉద్యమం

శ్రీకాకుళం ఉద్యమం 1958లో ప్రారంభమైనది. ఈ శ్రీకాకుళం గిరిజన సంఘం అనేక పోరాటాల్లో రాటుదేలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. పాలకొండ ఏజెన్సీ, సీతంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ అనే గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పల్లె రాములు మాస్టారు ఆ కాలంలో గిరిజన గ్రామాల్లో ప్రజలపై భూస్వాములు చేస్తున్న దోపిడీని చూసి చలించిపోయాడు. గిరిజనులను చైతన్యపర్చడం ప్రారంభించాడు. అప్పటికే పాలకొండలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న హయగ్రీవరావు, పత్తిరాజుతో కలిసి ఊరూరా గిరిజన సంఘాలు ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టు పార్టీని గిరిజన ప్రాంతానికి విస్తరింప చేశాడు. గిరిజనులను తొలుత సంఘాల్లో చేర్పించేందుకు నీళ్లదార ప్రమాణం చేయించేవారు. గ్రామంలో ఆడ, మగ పిల్లలందరీతో సమావేశపర్చి నీళ్లధార వదిలి, గడ్డిపూచ తుంచి వారిచే ప్రమాణం చేయించేవారు. అప్పటినుండి వాళ్లు సంఘంలో సభ్యులైనట్లే. అలా ప్రారంభమైన గిరిజన సంఘాలు గ్రామగ్రామాన విస్తరించాయి. 1960నాటికి అంటే కేవలం రెండేళ్లకే జిల్లాలోని గిరిజన ప్రాంతమంతా ఎర్రజెండాపై గిరిజన సంఘం అని రాసి ఎగురవేయబడ్డాయి. సుందరయ్య డైరెక్షన్‌, నండూరి ప్రసాదరావు ప్రత్యక్ష సహకరాంతో ఉద్యమం నడిచింది. 1961లో మొట్టమొదటి గిరిజన సంఘం మహాసభను మొందెంఖల్లు లో అత్యంత జయప్రదంగా నిర్వహించారు. 4 వేలమందితో భారీ బహిరంగసభ జరిపారు. ఈ సభకు పార్టీ తరపున నండూరి ప్రసాదరావు హాజరైనాడు.
(ఇంకా…)

22వ వారం
విల్లార్డ్ విగన్

విల్లార్డ్ విగన్ (జ.1957) ఇంగ్లాండుకు చెందిన శిల్పకారుడు. ఈయన సూక్ష్మ శిల్పాలు తయారు చేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్తు ఉంటుంది. జూలై 2007 లో విల్లార్డ్ విగన్ తన కళా నైపుణ్యానికి, కళారంగానికి చేసిన సేవకు గానూ హె.ఆర్.హెచ్ ఛార్లెస్ వేల్స్ చే "ఎం.బి.ఇ" అవార్డు తో గౌరవించబడ్డాడు. అతను చేసిన శిల్పాలలో సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు, అంతే స్థలంలో ఒబామా కుటుంబం, ఇసుక రేణువుపై రథం మొదలైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి. తన బాల్యంలో పాఠశాలలో పాఠ్యాంశాలను ధారాళంగా చదవలేకపోయేవాడు. ఈ కారణంగా తన తరగతిలో సహచరులు అతన్ని ఎగతాళి చేసేవారు. ప్రాథమిక పాఠశాలలో గురువులు కూడా తన మందబుద్ధి కారణంగా అపహాస్యం చేసేవారు. విగన్ తన ఐదవ సంవత్సరం నుండి శిల్పకళ పట్ల ఆకర్షితుడయ్యాడు. తన పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎగతాళిని తప్పించుకొనుటకు పాఠశాలకు వెళ్ళకుండా శిల్పాలు తయారుచేయుట ప్రారంభించాడు. అతడు ప్రపంచంలో ఏదీ సాధ్యం కానిది లేదని, ప్రజలు తన పనిని చూడలేనంత చిన్నగా ఉండాలని తన శిల్పాలపై విమర్శలు చేయకుండా ఉండాలని అతిచిన్న శిల్పాలను చేయడం ప్రారంభించాడు. శిల్పాలు ఎంత చిన్నవంటే వాటిని సూక్ష్మ దర్శిని ద్వారానే చూడగలము.
(ఇంకా…)

23వ వారం
అశ్వఘోషుడు

ఆశ్వఘోషుడు క్రీ. శ. 80–150 కాలానికి చెందిన బౌద్ధ దార్శనికుడు. సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. ఇతనిని సంస్కృత వాఙ్మయమున తొలి నాటకకర్తగా భావిస్తారు. అశ్వఘోషుడు కాళిదాసు కన్నా పూర్వుడని, కాళిదాసుని కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం వుందని పాశ్చాత్య సంస్కృత సాహిత్యకారులందరూ తేల్చి చెప్పారు. బౌద్ధ దార్శనికుడైన ఆశ్వఘోషుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి తన కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకొన్నాడు. అయితే దార్శనికుడుగా కంటే మహాకవిగా ఎక్కువ గుర్తింపు పొందాడు. సమకాలీన రామాయణానికి పోటీగా కావ్యాలను రచించిన బౌద్ధ కవులలో అత్యంత ప్రాచుర్యం పొందాడు. ఇతను రచించిన సంస్కృత గ్రంథాలలో బుద్ధచరితం, సౌందరనందం అనే రెండు మహా కావ్యాలు, సారిపుత్ర ప్రకరణం అనే నాటకం, వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబందమైన గ్రంథం ముఖ్యమైనవి. క్రీ. శ. 1, 2 శతాబ్దాలకు చెందిన మహాకవి అశ్వఘోషుని జీవిత విశేషాలు కొద్దిగా మాత్రమే తెలుస్తున్నాయి. ఇతని సౌందరనందం కావ్యం చివర 18 వ సర్గలో "ఆర్య సువర్ణాక్షీపుత్రస్య సాకేతకస్య భిక్షోరాచార్యస్య భదంతాశ్వఘోషస్య మహాకవేర్మహా వాదినః కృతిరియమ్" అన్న వాక్యాన్ని బట్టి ఇతను సాకేత (అయోధ్య) పురవాసి. తల్లి సువర్ణాక్షి. బౌద్ధ ఆచార్యుడు. మహాకవి అని తెలుస్తుంది. శుద్ధ శ్రోత్రియ వైదిక బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అశ్వఘోషుడు వేద ధర్మ శాస్త్రాలను అధ్యయనం చేసాడు. తరువాత బ్రాహ్మణమతం నుండి బౌద్ధంలోకి మారాడు. చైనీయుల సంప్రదాయం ప్రకారం అశ్వఘోషుడు తొలుత బౌద్ధంలోని సర్వాస్తి వాద శాఖకు చెందినవాడుగా ఉన్నాడు. తరువాత తన జీవితంలో వివిధ దశల్లో బౌద్ధంలోని వివిధ శాఖలను అభిమానించి చివరకు అశ్వఘోషుడు మహాసాంఘికానికి సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తుంది.
(ఇంకా…)

24వ వారం
లిథియం

లిథియం ఒక క్షార లోహం. మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపు S బ్లాకుకు చెందిన మూలకం. ఇది సాధారణ పరిస్థితిలో ఘన రూపంలో ఉంటుంది. ఈ మూలకం పేరు లిథోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. లిథోస్ అనగా రాయి అని అర్థం. ఈ మూలకం పరమాణు సంఖ్య 3. అందువలన ఈ మూలకం పరమాణువులో మూడు ఎలక్ట్రాన్లు ఉంటాయి. విశ్వంలో బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) జరిగినప్పుడు ఏర్పడిన మొదటి మూడు మూలకాలలో మూడో మూలకం లిథియం. మిగతా రెండు హీలియం, హైడ్రోజన్. కాని విశ్వంలో బెరీలియం, బోరాన్, లిథియంల ఉనికి తక్కువ. కారణం లిథియం తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నశించు లక్షణాన్ని కలిగి వుంది. లిథియం విశ్వంలో చల్లగా ఉండే బ్రౌన్ మరుగుజ్జు నక్షత్రాలలో, ఆరెంజి నక్షత్రాలలో ఉన్నది. ఘనస్థితిలో లభ్యమయ్యే మూలకాలలో ఎక్కువ విశిష్టోష్ణం కలిగిన మూలకం లిథియం. ఆయనీకరణ శక్తి 5.392 eV. లిథియం మెత్తటి వెండిలా రంగుఉన్న లోహం. ఇది క్షారలోహముల సముదాయానికి చెందినది. అతితక్కువ బరువున్న తెలికపాటి లోహం. మిగతా క్షార లోహలవలె లిథియం రసాయనికంగా అత్యంత చురుకైన చర్యాశీలత కలిగిన, మండే స్వభావము ఉన్న లోహం. అందువలన దీనిని ఏదైనా ఒక హైడ్రోకార్బను ద్రవంలో, సాధారణంగా పెట్రోలియం జెల్లిలో వుంచి భద్రపరుస్తారు. లిథియం ఒంటరి వేలన్సీ ఎలక్ట్రానును కలిగి ఉన్నది. ఈ కారణంచే ఇది ఉత్తమవిద్యుత్తు, ఉష్ణవాహకం. లిథియం చాలా మెత్తటి లోహం.
(ఇంకా…)

25వ వారం
వాస్తవాధీన రేఖ

వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్), చైనీయుల-నియంత్రణలో ఉన్న భూభాగాన్ని, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాస్తవ నియంత్రణ రేఖ అని కూడా అంటారు. పేరులో బాగా దగ్గరి పోలిక ఉండి, దీనితో సంబంధం లేని మరొక రేఖ నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్). ఇది భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రేఖ. ఈ రెండు రేఖలూ అవిభక్త జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లేదా ఒకప్పటి జమ్మూ కాశ్మీరు సంస్థానం గుండానే పోతాయి. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే మాటను 1959 లో జౌఎన్‌లై, జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో ఉపయోగించాడని చెబుతారు. 1962 భారత చైనా యుద్ధం తరువాత ఏర్పాటు చేసుకున్న రేఖకు ఈ పేరు పెట్టారు. ఇది భారత చైనా సరిహద్దు వివాదంలో భాగం. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు. సంకుచితార్థ్గంలో చూస్తే, ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు, చైనీయుల టిబెట్ స్వాధికార ప్రాంతానికీ మధ్య సరిహద్దుగా మాత్రమే సూచిస్తుంది. ఆ అర్థంలో, ఈ వాస్తవాధీన రేఖ, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న వివాదాస్పద మెక్‌మహాన్ రేఖ, మధ్యలో ఏ వివాదమూ లేని ఒక చిన్న విభాగం -ఈ మూడూ కలిసి రెండు దేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. విస్తృతార్థంలో చూస్తే దీన్ని, పశ్చిమ నియంత్రణ రేఖ, తూర్పు నియంత్రణ రేఖ - రెండింటినీ సూచించడానికి ఉపయోగించవచ్చు. ఈ అర్థంలో దీన్ని భారతదేశం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల మధ్య సరిహద్దు అని చెప్పుకోవచ్చు.
(ఇంకా…)

26వ వారం
అగ్నిపర్వతం

అగ్నిపర్వతం అంటే, గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో (పై పొర -క్రస్టు) ఏర్పడే చీలిక. ఉపరితలం క్రింద, శిలాద్రవం ఉండే గది నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద, వాయువులూ వత్తిడితో బయటికి చిమ్ముతాయి. భూమిపై అగ్నిపర్వతాలు ఎందుకు ఉంటాయంటే దాని పెంకు 17 ప్రధాన, దృఢమైన టెక్టోనిక్ పలకలుగా విభజించబడి ఉంది. ఈ పలకలు దాని మాంటిల్‌లోని వేడి, మృదువైన పొరపై తేలుతూంటాయి. అందువల్ల, టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఒకదాన్నుండొకటి దూరంగా జరుగుతూ, ఒకదానికొకటి దగ్గరౌతూ ఉన్నచోట్ల అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. చాలావరకు ఇవి సముద్రాల లోపల ఉంటాయి. ఉదాహరణకు, మిడ్-అట్లాంటిక్ రిడ్జ్ (అట్లాంటిక్ సముద్రం లోపల ఉన్న శిఖరాలు) వద్ద విడిపోతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల సంభవించే అగ్నిపర్వతాలున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో దగ్గరౌతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు ఉన్నాయి. పెంకు లోని పలకలు సాగుతూ, సన్నబడుతూ ఉన్న చోట్ల కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఉదా., తూర్పు ఆఫ్రికా రిఫ్ట్, వెల్స్ గ్రే-క్లియర్‌వాటర్ అగ్నిపర్వత క్షేత్రం, ఉత్తర అమెరికా లోని రియో గ్రాండే రిఫ్ట్. ఈ రకమైన అగ్నిపర్వతం "ప్లేట్ హైపోథీసిస్" అగ్నిపర్వతం అనే నిర్వచనం కిందకు వస్తుంది. పలకల సరిహద్దులకు దూరంగా ఉన్న అగ్నిపర్వతాలను మాంటిల్ ప్లూమ్స్ అని అంటారు. "హాట్‌స్పాట్‌" అనే ఇలాంటి అగ్నిపర్వతాలకు ఉదాహరణలు హవాయిలో ఉన్నాయి. భూమిలో 3,000 కి.మీ. లోతున ఉన్న కోర్-మాంటిల్ సరిహద్దు నుండి పైకి ఉబికి వచ్చే శిలాద్రవంతో ఇవి ఏర్పడతాయి.
(ఇంకా…)

27వ వారం
కూరెళ్ల విఠలాచార్య

డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. ప్రధానమంత్రి మోడీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో కూరెల్ల విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్‌ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని ప్రశంసించాడు. ఆబాల్యకవియైన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అతని మాతామహుల గ్రామమైన నీర్నేములలో కూరెళ్ల వెంకటరాజయ్య - లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆ కాలంలో ఇతని తండ్రి కూరెళ్ల వేంకటరాజయ్య గొప్ప స్వర్ణకారుడని ప్రతీతి. అంతేకాకుండా మంచి చిత్రకారుడు కూడా.అతను చేసిన అపురూపమైన చక్కని చొక్కపు ఆభరణాలు ఊళ్ళో వాళ్ళు విఠలాచార్యులకు చూపించి పొంగి పోతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ తండ్రి వెంకటరాజయ్య అనారోగ్యానికి గురైనాడు.
(ఇంకా…)

28వ వారం
భారత విభజన

1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలు - భారతదేశం, పాకిస్థాన్‌లు - గా విభజించడాన్ని భారత విభజన అంటారు. భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గా, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ లుగా ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్ అనే రెండు రాష్ట్రాలను ఆ రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్ సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్టం 1947లో వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపోయింది. భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధరాత్రి చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి. ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రాతిపదికన కాందిశీకులయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశాల్లో పెద్దయెత్తున శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. విభజన సమయం లోను, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం రెండు లక్షల నుండి ఇరవై లక్షల దాకా ఉండవచ్చని వివిధ అంచనాలు ఉన్నాయి. విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తాన్ల మధ్య శత్రుత్వానికి, అనుమానాల వాతావరణానికీ కారణమైంది. ఇప్పటికీ వాటి సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంది.
(ఇంకా…)

29వ వారం
భారత స్వాతంత్ర్య చట్టం 1947

భారత స్వాతంత్ర్య చట్టం 1947 అన్నది బ్రిటిషు ఇండియాను భారతదేశం, పాకిస్తాన్ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించేందుకు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంటు చేసిన చట్టం. జూలై 18, 1947న ఈ చట్టం రాజసమ్మతి పొందింది, భారత స్వాతంత్ర్యం, పాకిస్తాన్ ఏర్పాటు ఆగస్టు 15 తేదీన జరిగాయి. ఐతే వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీన అధికార బదిలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో, పాకిస్తాన్ 14 ఆగస్టు 1947న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. సంప్రదింపుల అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్‌బాటన్ ఒప్పందానికి వచ్చాక, యు.కె. ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం, భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు. అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన క్యాబినెట్ మిషన్ సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన (మే 16 ప్రతిపాదన) కు కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించాడు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దినానికి పిలుపునిచ్చారు.
(ఇంకా…)

30వ వారం
మాలతీదేవి చౌదరి

మాలతీదేవి చౌదరి (సేన్) (1904 జూలై 26 – 1998 మార్చి 15) భారతీయ పౌర హక్కుల, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, గాంధేయవాది. ఆమె 1904లో ఉన్నత మధ్యతరగతి బ్రహ్మో కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కుముద్ నాథ్ సేన్, న్యాయవాది. రెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె తండ్రిని కోల్పోయింది. ఆమెను తల్లి స్నేహలతా సేన్ పెంచింది. మాలతీ దేవి కుటుంబం వాస్తవానికి ఢాకాలోని బిక్రంపూర్‌లోని కమరఖండకు చెందింది (ప్రస్తుతం అది బంగ్లాదేశ్‌లో ఉంది). కానీ ఆమె కుటుంబ సభ్యులు బీహార్‌లోని సిముల్తాలాలో స్థిరపడ్డారు.ఆమె తల్లి తాత బెహారీ లాల్ గుప్తా, ఐసిఎస్, బరోడా దివాన్ అయ్యాడు. ఆమె తల్లి తరపున కుటుంబంలో మొదటి బంధువులు రణజిత్ గుప్తా, పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐసిఎస్, ప్రముఖ లోకసభ సభ్యుడు, భారతదేశ మాజీహోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా, అన్నయ్య పికె సేన్ గుప్తా, మాజీ ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారి, భారతీయ ప్రభుత్వ ఆదాయ శాఖలో పనిచేసాడు.మరొక సోదరుడు కెపి సేన్ మాజీ పోస్ట్‌మాస్టర్ జనరల్. తల్లిదండ్రులకు మాలతీదేవీ చిన్నబిడ్డ కావడం వలన, ఆమె తనసోదరులుకు ప్రియమైంది.ఆమె తల్లి స్నేహలత స్వతాగా రచయిత్రి, ఆమె జుగలాంజలి పుస్తకంనుండి ఠాగూర్ కొన్నిరచనలను అనువదించాడు.
(ఇంకా…)

31వ వారం
ఆర్టికల్ 370 రద్దు

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం, 2019 ఆగస్టు 5 న రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (డిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ మార్గాలను కత్తిరించింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా పలువురు ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. భారతదేశం లోని రాజకీయ పార్టీలలో, అధికార భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎఐఎడిఎంకె, తెలుగు దేశం, శివసేనలు ఉపసంహరణకు మద్దతు ఇచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), డిఎంకెలు వ్యతిరేకించాయి. లడఖ్‌ లోని కార్గిల్ ప్రాంతంలోని షియా ముస్లిం ప్రజలు దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు; లడఖ్‌ బౌద్ధ సమాజం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చింది.
(ఇంకా…)

32వ వారం
క్విట్ ఇండియా ఉద్యమం

క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీనిని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. క్రిప్స్ మిషన్ విఫలమైంది, 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి పిలుపునిచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి "క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ" కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, దీనిపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్ళలో చాలా మంది యుద్ధం ముగిసేదాకా జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు) లు బ్రిటిషు వారికి మద్దతుగా నిలిచాయి. యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది, క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. చాలామంది విద్యార్థులు అక్ష రాజ్యాలకు మద్దతు ఇస్తూ బహిష్కరణలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. ఈ ఉద్యమానికి బయటి మద్దతు అమెరికన్ల నుండి మాత్రమే వచ్చింది.
(ఇంకా…)

33వ వారం
భారతదేశ ఏకీకరణ

1947 లో భారత స్వాతంత్ర్య సమయంలో, భారతదేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. ప్రత్యక్షంగా బ్రిటిషు పాలనలో ఉండే భూభాగం మొదటిది కాగా, బ్రిటను రాచరికానికి లోబడి ఉంటూ, అంతర్గత వ్యవహారాలను ఆయా వారసత్వ పాలకులు నియంత్రించుకునే సంస్థానాలు రెండోది. ఈ సంస్థానాలు మొత్తం 562 ఉన్నాయి. ఈ సంస్థానాలకు బ్రిటిషు వారితో వివిధ రకాలైన ఆదాయ భాగస్వామ్య ఏర్పాట్లు ఉండేవి. వాటి పరిమాణం, జనాభా, స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఆదాయ పంపకాల ఏర్పాటు ఉండేది. అదనంగా, ఫ్రాన్స్, పోర్చుగల్‌ల నియంత్రణలో ఉండే అనేక వలసవాద ప్రాంతాలు కూడా ఉండేవి. ఈ భూభాగాలను భారతదేశంలో రాజకీయంగా ఏకీకృతం చేయడం భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యం. తరువాతి దశాబ్దంలో భారత ప్రభుత్వం దీనిని అమలు పరచింది. వివిధ పద్ధతుల ద్వారా, సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్లు వివిధ సంస్థాన పాలకులను భారతదేశంలో విలీనమయ్యేందుకు ఒప్పించారు. 1956 నాటికి, ఈ సంస్థానాలపై కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని భద్రపరచడానికి, విస్తరించడానికి, వారి పరిపాలనా వ్యవస్థను మార్చడానికీ ప్రభుత్వం దశల వారీగా ముందుకు సాగింది. 1956 నాటికి, భాగమైన భూభాగాల మధ్య స్వల్ప తేడా ఉంది. బ్రిటిషు ఇండియా, సంస్థానాలు. అదే సమయంలో, భారత ప్రభుత్వం, సైనిక, దౌత్య మార్గాలు రెండింటి ద్వారా, మిగిలిన వలసరాజ్యాల ఎన్‌క్లేవ్‌లపై వాస్తవ, న్యాయ నియంత్రణను పొందింది, ఇవి కూడా భారతదేశంలో కలిసిపోయాయి.
(ఇంకా…)

34వ వారం
మహాడ్ సత్యాగ్రహం

మహాడ్ సత్యాగ్రహం ఊరి చెరువు నుండి మంచినీరు తాగడానికి బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో దళితులు చేసిన శాంతియుత విప్లవం. ఇది ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాడ్ ప్రాంతంలో 1927లో మార్చి 21వ తేదీన జరిగింది. దీనినే చవదార్ చెరువు సత్యాగ్రహం అనీ, మహాడ్ ముక్తిసంగ్రామం అనీ పిలుస్తారు. ఈ సంఘటనని తలుచుకుంటూ ఈరోజుని భారతదేశంలో సామాజిక సాధికారికత దినోత్సవంగా జరుపుకుంటారు. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాద్‌లో నివాసాలు ఏర్పరచుకున్నారు. మహాద్‌లో బాబా సాహెబ్‌ మూడు సూత్రాలను సూచించాడు. అవి -1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఆలోచన మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. భారతీయ కుల వ్యవస్థలో దళితులు ఎన్నో విధాల వివక్షకు గురయ్యారు. ఇందులో ఒకటి జనం నీళ్ళు తాగడం కోసం ఉన్న చెరువులను వాళ్ళని వాడుకోనివ్వకపోవడం. దీనికి వ్యతిరేకంగా బాంబే రాష్ట్ర శాసనమండలి 1923 ఆగస్టులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో ఎవరైనా నీళ్ళు తాగవచ్చని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. `మహాద్‌ చెరువు సార్వజనికమైనది, దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు' అని ఈ తీర్మానం సారాంశం. అయితే, సవర్ణ హిందువుల నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ తీర్మానం ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు. మహాద్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలనే లక్ష్యంతో బాబాసాహెబ్‌ ముందు నడవగా ఐదువేల మందితో దళిత సమాజం చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకుంది.
(ఇంకా…)

35వ వారం
సహాయ నిరాకరణోద్యమం

సహాయ నిరాకరణోద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో ముగిసింది. 1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి, 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతకూ నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ (INC) బ్రిటిషు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది. ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనులనుంచీ భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటీష్ పరిశ్రమలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి, ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు. 1919 మార్చిలో రౌలట్ చట్టం, దేశద్రోహ విచారణలలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది. భారతీయులు దాన్ని "రాజకీయ మేల్కొలుపు" గాను బ్రిటిషు వారు "ముప్పు" గానూ భావించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13వ జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతీసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు.
(ఇంకా…)

36వ వారం
ఎస్. శ్రీనివాస అయ్యంగార్

శేషాద్రి శ్రీనివాస అయ్యంగార్ భారత భారతీయ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడు గుర్తింపు పొందాడు. అయ్యంగార్ 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్వకేట్ జనరలుగా పనిచేసాడు.1912 నుండి 1920 వరకు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ న్యాయ సభ్యుడిగా, స్వరాజ్య పార్టీ వర్గానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1923 నుండి 1930 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసు సభ్యుడుగా పనిచేసాడు. శ్రీనివాస అయ్యంగార్ ప్రఖ్యాత న్యాయవాది, మద్రాసు మొదటి భారత అడ్వకేట్ జనరల్ అయిన సర్ వి. భాష్యం అయ్యంగార్ అల్లుడు. అయ్యంగార్ అనుచరులు అయనను " లయన్ ఆఫ్ ది సౌత్ " అని పిలిచారు. శ్రీనివాస అయ్యంగార్ మద్రాస్ ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లాలో జన్మించాడు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడై మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి 1916 లో అడ్వకేట్ జనరల్ అయ్యాడు. తరువాత ఆయన బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ న్యాయ సభ్యుడిగా ప్రతిపాదించబడ్డాడు. 1920 లో జల్లియన్‌వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో తన తన అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసి తన సి.ఐ.ఇ.ను తిరిగి ఇచ్చి భారత జాతీయ కాంగ్రెసులో చేరారి సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ 1923 లో ఎన్నికలలో పాల్గొనడం గురించి మహాత్మా గాంధీతో విభేదాల కారణంగా మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటి ఇతర నాయకుల నుండి విడిపోయాడు. విడిపోయిన తరువాత స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేసాడు.
(ఇంకా…)

37వ వారం
ఫిరోజ్ గాంధీ

ఫిరోజ్ గాంధీ (జన్మనామం: ఫిరోజ్ జహంగీర్ ఘండి) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను ది నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. తరువాత లోక్‌సభ సభ్యునిగా, పార్లమెంటులో దిగువ సభలో సభ్యునిగా పనిచేసాడు. అతని భార్య ఇందిరా నెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరూ భారత దేశానికి ప్రధానులుగా పనిచేసారు. అతని జన్మనామం ఫిరోజ్ జహంగీర్ ఘండీ. అతను పార్శీ కుటుంబంలో జహంగీర్ ఫెరెడూన్ ఘండీ, రతిమయి దంపతులకు జన్మించాడు. వారు బొంబాయిలోని ఖేట్వాడీ మొహల్లా లోని నౌరోజీ నాటక్‌వాలా భవన్ లో నివసించేవారు. అతని తండ్రి జహంగీర్ కిల్లిక్ నిక్సాన్ లో మెరైన్ ఇంజనీరుగా పనిచేసేవాడు. తరువాత వారెంటు ఇంజనీరుగా పదోన్నతి పొందాడు. ఫిరోజ్ ఐదుగురు సహోదరులలో చివరివాడు. అతనికి జొరాబ్, ఫరీదున్ జహంగీర్ అనే ఇద్దరు అన్నయ్యలున్నారు. తెహ్మినా కేర్షష్ప్, ఆలూ దస్తూర్ అనే అక్కలున్నారు. ఈ కుటుంబం భరుచ్ (ప్రస్తుతం దక్షిణ గుజరాత్) నుండి బొంబాయిలోని కోట్పరివాడ్ లోని తాతగారింటికి వలస వెళ్లారు. 1920 ల ప్రారంభంలో తన తండ్రి మరణం తరువాత, ఫిరోజ్, అతని తల్లి అలహాబాదులోని మాతృసంబంధిత అత్త గారింటికి జీవించడానికి వెళ్లాడు. అతని అత్త అవివాహిత, నగరంలోని లేడీ డఫెరిన్ హాస్పిటల్‌లోని సర్జన్ గా పనిచేసేది.
(ఇంకా…)

38వ వారం
భారత అమెరికా సంబంధాలు

భారత అమెరికా సంబంధాలు భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుంది. స్వాతంత్ర్యానంతరం అధికారికంగా మొదలైన భారత అమెరికా సంబంధాల్లో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. రిచర్డ్ నిక్సన్, ఇందిరా గాంధీల కాలంలో అత్యంత క్షీణ దశను, జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ ల కాలంలో ఎంతో స్నేహపూర్వక దశను చవి చూసాయి. కేవల ద్వైపాక్షిక విషయాలకే పరిమితంగా ఉండే ఈ సంబంధాలు, ద్వైపాక్షిక చర్చల్లో వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి ఎదిగాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలోని ప్రముఖ నాయకులకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా ఇవి కొనసాగాయి. 1954 లో, అమెరికా పాకిస్తాన్‌ను సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంటో) ఒప్పందంలో మిత్రదేశంగా చేర్చుకుంది. పాకిస్తాన్-అమెరికా సంబంధాలను ఎదుర్కోవటానికి భారతదేశం, సోవియట్ యూనియన్‌తో వ్యూహాత్మక సైనిక సంబంధాలను పెంపొందించుకుంది. అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరకుండా ఉండటానికి 1961 లో, భారతదేశం అలీనోద్యమంలో వ్యవస్థాపక సభ్యుడయింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిక్సన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో, భారత అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి. 1990 లలో, భారత్ తన విదేశాంగ విధానాన్ని ఏకధ్రువ ప్రపంచానికి అనుగుణంగా మలచుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది.
(ఇంకా…)

39వ వారం
లతా మంగేష్కర్

లతా మంగేష్కర్ హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోంస్లే. లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లత 1929 సెప్టెంబరు 28 తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ కు పెద్ద కుమార్తెగా (ఐదుగురు సహోదరులలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె. ఎల్. సైగల్ ను పేర్కొంది.
(ఇంకా…)

40వ వారం
కల్పనా చావ్లా

కల్పనా చావ్లా ఒక ఇండో-అమెరికన్ వ్యోమగామి, మెకానికల్ ఇంజనీర్. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997 లో మొదటి సరిగా కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003 లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్ లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి. 2003 ఫిబ్రవరి 1 న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది.
(ఇంకా…)

41వ వారం
ఎస్. ఎస్. రాజమౌళి

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం 10 అక్టోబర్ 1973) వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు, భారతీయ సినిమా దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ది చెందాడు. బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా ₹ 1,810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్‌గా నిలిచింది. అతన్ని భారతీయ చలనచిత్రరంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా పరిగణిస్తారు. అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై, విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం నుండి 37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛత్రపతి వంటి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో పాటు వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి. రాజమౌళి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్ర నంది పురస్కారలు, ఐఫా అవార్డు (IIFA), రెండు సైమా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా, 2012లో "ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్", 2015లో " సిఎనెన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్" సహా పలు గౌరవాలు అందుకున్నాడు.
(ఇంకా…)

42వ వారం
డైనోసార్

డైనోసారియా క్లాడ్‌లోని వివిధ సరీసృపాల సమూహమే డైనోసార్లు. అవి భూమిపై మొదటగా 24.3 - 23.323 కోట్ల సంవత్సరాల క్రితం (కోసంక్రి), ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది, ఖచ్చితమైన సమయం ఏది అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. 20.13 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ట్రయాసిక్-జురాసిక్ విలుప్తి ఘటన తర్వాత అవి, నేలపై జీవించే సకశేరుకాలుగా మారాయి. నేలపై వాటి ఆధిపత్యం జురాసిక్, క్రెటేషియస్ పీరియడ్లలో కొనసాగింది. పక్షులు, ఆధునిక కాలపు రెక్కల డైనోసార్‌లే అని శిలాజ రికార్డును బట్టి తెలుస్తోంది. చివరి జురాసిక్ యుగంలో, అంతకు మునుపు ఉనికిలో ఉన్న థెరోపోడ్‌ల నుండి ఇవి ఉద్భవించాయి. దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్తి ఘటనలో డైనోసార్ వంశానికి చెందిన జీవుల్లో ఇవి మాత్రమే వినాశనం నుండి తప్పించుకున్నాయి. కాబట్టి డైనోసార్‌లను ఎగిరే డైనోసార్‌లు లేదా పక్షులుగాను, అంతరించిపోయిన ఎగరని డైనోసార్‌లు (పక్షులు కాకుండా ఇతర డైనోసార్‌లు) గానూ విభజించవచ్చు.
(ఇంకా…)

43వ వారం
రాడార్

రాడార్ (రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్) అనేది రేడియో తరంగాలను ఉపయోగించి ఒక స్థలం నుండి వస్తువుల దూరం (పరిధి), కోణం, రేడియల్ వేగం మొదలైనవాటిని తెలుసుకునే పద్ధతి. ఇది విమానం, నౌకలు, అంతరిక్ష నౌకలు, గైడెడ్ క్షిపణులు, మోటారు వాహనాలు, వాతావరణ ఆకృతులు, భూభాగాలు మొదలైనవాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రాడార్ వ్యవస్థలో, రేడియో లేదా మైక్రోవేవ్ తరంగ దైర్ఘ్యాలలో విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే ట్రాన్స్‌మిటరు, ట్రాన్స్‌మిటింగ్ యాంటెన్నా, రిసీవింగ్ యాంటెన్నా (ఒకే యాంటెన్నాను ప్రసారం చేయడానికి, స్వీకరించడానికీ ఉపయోగిస్తారు), వస్తువుల లక్షణాలను గుర్తించే రిసీవరు, ప్రాసెసరు ఉంటాయి. ట్రాన్స్‌మిటర్ నుండి బయల్దేరిన రేడియో తరంగాలు (పల్సుల రూపంలో గానీ, నిరంతరాయంగా గానీ) వస్తువులపై పది ప్రతిబింబించి, తిరిగి రిసీవరుకి తిరిగి చేరుతాయి. దాంతో వస్తువుల స్థానాలు, వేగం గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
(ఇంకా…)

44వ వారం
తూర్పు కనుమలు

తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట ఉండే విచ్ఛిన్నంగా విస్తరించిన కొండల వరుస. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణాలో 965 మీ ఎత్తు కలిగిన దోలి గుట్ట ఎత్తైన శిఖరం. తమిళనాడులో ఒడైక్కన్ బెట్ట ఎత్తైన శిఖరం. ఒడిషాలో 1672 మీ ఎత్తు కలిగిన దియోమాలి ఎత్తైన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో 1680 ఎత్తు కలిగిన ఆర్మకొండ అత్యంత ఎత్తైన ప్రాంతం. కర్ణాటక లో తూర్పు కనుమల్లో భాగమైన బిఆర్ పర్వతశ్రేణులు అక్కడక్కడా 1800 మీ పైగా ఎత్తు కలిగి ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ఎత్తైన కట్టాహి బెట్ట 1822 మీ ఎత్తు కలిగి ఉంది. ఈ పర్వతశ్రేణిలో తమిళనాడులో తలమలై పర్వశ్రేణులు ఎత్తైనవి. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కొండలు ఎత్తులో మూడవ స్థానంలో ఉన్నాయి.

ఈ పర్వత శ్రేణులు బంగాళాఖాతపు తీరరేఖకు సమాంతరంగా నడుస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమాన, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటారు. కోరమాండల్ తీరప్రాంతంతో సహా తీర మైదానాలు తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికీ మధ్య విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు పడమటి కనుమలంత ఎత్తు లేవు.
(ఇంకా…)

45వ వారం
జిబ్రాల్టర్ జలసంధి

జిబ్రాల్టర్ జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలిపే ఒక సన్నని జలసంధి. ఐరోపా లోని ఐబీరియన్ ద్వీపకల్పాన్ని ఆఫ్రికాలోని మొరాకో నుండి ఇది వేరు చేస్తుంది. స్పెయిన్‌ లోని పాయింట్ మారోక్వి, మొరాకోలోని పాయింట్ సైర్స్ మధ్య, 13 కి.మీ. వెడల్పున్న ఈ జలసంధి రెండు ఖండాలనూ వేరు చేస్తోంది. పడవలు ఈ జలసంధిని దాటడానికి 35 నిమిషాలు పడుతుంది. జలసంధి లోతు 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి చారిత్రకంగా కూడా మంది ప్రాధాన్యత ఉంది. అనేక సంస్కృతులు, నాగరికతలు ఈ మార్గం గుండా వ్యాప్తి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన సైనిక పడవలు ప్రవాహ వేగాన్ని ఊతంగా చేసుకుని ఇంజన్లు ఆపేసి శత్రువులకు తెలియకుండా నిశ్శబ్దంగా ప్రయాణించేవి.

ఈ జలసంధి మొరాకో, స్పెయిన్, బ్రిటిష్ విదేశీ భూభాగమైన జిబ్రాల్టర్ ల ప్రాదేశిక జలాలలో ఉంది. అక్కడక్కడ స్పెయిన్, మొరాకో, బ్రిటన్ దేశాల సార్వభౌమాధికారం కొంత వివాదాస్పదం అయినప్పటికీ సముద్ర చట్టంపై ఐరాస ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ) ప్రకారం, విదేశీ నౌకలు, విమానాలు ఈ జిబ్రాల్టర్ జలసంధిని స్వేచ్ఛగా దాటవచ్చు. 1980 నుండి ఈ జలసంధి కింద సముద్ర గర్భంలో స్పెయిన్, మొరాకోల మధ్య రైల్వే లైను గురించి చర్చలు మొదలయ్యాయి కానీ అవి నేటికీ రూపు దాల్చలేదు.
(ఇంకా…)

46వ వారం
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఉన్న నాటకరంగ శిక్షణా సంస్థ. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్త సంస్థ ఇది. 1959లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ, 1975లో స్వతంత్ర సంస్థగా మార్చబడింది. 2005లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించగా, 2011లో అది రద్దు చేయబడింది. ప్రస్తుతం, నటుడు పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇది కేవలం ఒక శిక్షణా సంస్థగానే కాకుండా 1964 నుంచి అనుబంధ విభాగం ద్వారా వివిధ దేశాల్లోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఎంపిక చేసిన నాటకాలను కూడా ప్రదర్శిస్తూ వస్తోంది. 1989 నుంచి పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో నాటకరంగం గురించి అవగాహన కల్పించడం కోసం సంస్కార్ రంగ్ టోలీ అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది 8 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు నటనలో శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ ప్రాంగణంలో కూడా మూడు ప్రదర్శన శాలలు ఉన్నాయి. తన కార్యకలాపాలను విస్తరించేందుకు గాను ఇది 1994 లో బెంగళూరులో ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించింది. తర్వాత వారణాసి, సిక్కిం, త్రిపుర లో కూడా ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ తరపున దేశంలో పలు ప్రాంతాల్లో నాటకాలకు సంబంధించిన వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఉంటుంది. 1999 నుంచి ప్రతి యేటా ఢిల్లీలో భారత రంగ్ మహోత్సవ్ పేరుతో నాటక వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఇది కేవలం నాటక రంగానికి సంబంధించి ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉత్సవంగా పేరు గాంచింది. 2008 లో ఈ సంస్థకు బీజం పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఓం పురి, నసీరుద్దీన్ షా, రోహిణి హట్టంగడి, అనుపమ్ ఖేర్, సీమా బిశ్వాస్, అతుల్ కులకర్ణి లాంటి నటులు ఈ సంస్థ విద్యార్థులు.
(ఇంకా…)

47వ వారం
పడమటి సంధ్యారాగం

పడమటి సంధ్యారాగం జంధ్యాల పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన సినిమా. విజయశాంతి, గుమ్మలూరి శాస్త్రి, థామస్ జేన్, శివమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1987లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా కలిసి ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై నిర్మించాడు. చిత్ర దర్శకుడు జంధ్యాల, గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు నిర్మాతలకు వీరికి మధ్య జరిగిన సంభాషణ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ కథా రచయితగా జంధ్యాలకు నంది పురస్కారం లభించాయి.
(ఇంకా…)

48వ వారం
రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి.

ఎలిచ్‌పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సా.శ. 753 లో దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఈ వంశం మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులుగా పేరుబడింది. అదే సమయంలో బెంగాల్ పాల వంశం, మాళ్వాకు చెందిన ప్రతీహార రాజవంశాలు తూర్పు, వాయవ్య భారతదేశంలో బలపడుతున్నాయి. అరబిక్ గ్రంథం, సిల్సిలాత్ అల్-తవారిఖ్ (851), రాష్ట్రకూటులను ప్రపంచంలోని నాలుగు ప్రధాన సామ్రాజ్యాలలో ఒకటిగా పేర్కొంది.
(ఇంకా…)

49వ వారం
బాకు నగరం

బాకు నగరం అజర్‌బైజాన్ దేశ రాజధాని. కాస్పియన్ సముద్ర తీరంలో వున్న ఈ పారిశ్రామిక నగరం, సముద్ర మట్టానికి  28 మీటర్లు దిగువన ఉంది. దేశంలోనే  అతి పెద్ద ఓడరేవు, ఏకైక మెట్రోపోలిటిన్ సిటీ అయిన బాకు, అటు కాస్పియన్ సముద్ర తీరప్రాంతం లోను, ఇటు కాకసస్ పర్వత ప్రాంతంలోను విస్తరించిన నగరాలన్నిటిలో కూడా అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. 2021 అంచనాల ప్రకారం ఈ నగర జనాభా 23,71,000. ఈ నగరం, అజర్‌బైజాన్ శాస్త్రీయ, సాంస్కృతిక, ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా వుంది. ఇక్కడ నెలకొనివున్న కఠిన వాతావరణం, సంవత్సరం పొడుగునా వీచే ఉధృతమైన గాలుల కారణంగా ఈ నగరానికి "విండ్స్ నగరం" అనే పేరు స్థిరపడింది. ఈ నగరాన్ని బాకీ లేదా బాకే అని కూడా పిలుస్తారు.

బాకు ఆర్థిక వ్యవస్థకు మూలాధారం పెట్రోలియం. చమురు ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ నగరం, ప్రపంచంలోని అతి పురాతన చమురు ఉత్పత్తి ప్రాంతంగా కూడా పేరుపొందింది. 20 వ శతాబ్దం ప్రారంభం నాటికి బాకు చమురు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది, ఒక విధంగా చెప్పాలంటే ఈ నగర చరిత్ర పెట్రోలియం అదృష్టంతో ముడిపడివుంది. ఇక్కడ జరిగిన చమురు విజృంభణ, ఈ నగరాభివృద్ధికి దోహదపడటమే కాక యావత్ దేశ రూపు రేఖలను సైతం మార్చివేసింది. చమురు ప్రాసెసింగ్‌తో పాటు, చమురు పరిశ్రమ కు సంబంధించిన పరికరాల ఉత్పత్తికి ఈ నగరం ఒక పెద్ద కేంద్రం.
(ఇంకా…)

50వ వారం
రజినీకాంత్

రజినీకాంత్ సినిమా నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ సినీ రంగంలో పనిచేస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. సినిమాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన స్టైలు దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి సుమారు 160 కి పైగా సినిమాల్లో నటించాడు.

1975 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన శివాజీ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

సినిమా రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారంతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నాడు.
(ఇంకా…)

51వ వారం
నక్షత్రాల పుట్టుక

బాహ్య అంతరిక్షంలో ఉండే అణు మేఘాలలో సాంద్రంగా ఉండే ప్రాంతాలు పతనమై, నక్షత్రాలు ఏర్పడటమే నక్షత్రాల పుట్టుక. వీటిని "నక్షత్ర నర్సరీలు" అనీ "నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాలు" అనీ అంటారు. నక్షత్రాల నిర్మాణానికి ఆధారమైన ఇంటర్ సెల్లార్ మీడియం, మహా అణు మేఘాల (జెయింట్ మాలిక్యులర్ క్లౌడ్స్) అధ్యయనం, వాటినుండి ఉత్పత్తయ్యే ఆదిమ నక్షత్రాలు, యువ నక్షత్ర వస్తువుల అధ్యయనం ఖగోళ శాస్త్రంలో ఒక శాఖయైన నక్షత్రాల నిర్మాణంలో భాగం. ఖగోళ శాస్త్రం లోనే మరొక శాఖ అయిన గ్రహ నిర్మాణంతో దీనికి దగ్గరి సంబంధం ఉంటుంది. నక్షత్రాలపుట్టుక సిద్ధాంతం, ఏక నక్షత్రం ఎలా ఏర్పడుతుందో చెప్పినట్లే, జమిలి (బైనరీ) నక్షత్రాల గురించి, ప్రారంభ ద్రవ్యరాశి ధర్మాల గురించి కూడా వివరించాలి. నక్షత్రాలు చాలావరకు ఒంటరిగా ఏర్పడవు; సమూహాలుగా ఏర్పడతాయి. వాటిని నక్షత్ర సమూహాలని అంటారు. పాలపుంత లాంటి స్పైరల్ గాలక్సీల్లో నక్షత్రాలు, నక్షత్ర అవశేషాలు, వాయువుతోటీ, ధూళితోటీ కూడుకున్న ఇంటర్ సెల్లార్ మీడియం ఉంటాయి. ఇంటర్ సెల్లార్ మాధ్యమంలో ఒక ఘన సెంటీ మీటరుకు 104 నుండి 106 కణాలుంటాయి. ఇందులో ద్రవ్యరాశి పరంగా దాదాపు 70% హైడ్రోజన్‌ ఉంటుంది. మిగిలిన వాయువులో ఎక్కువ భాగం హీలియం ఉంటుంది. ఈ మాధ్యమంలో చాలా కొద్ది మొత్తాల్లో భారయుత మూలకాలు కూడా చేరి ఉంటాయి.
(ఇంకా…)

52వ వారం
సిల్క్ రోడ్డు

సిల్క్ రోడ్డు తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వాణిజ్య మార్గాల అల్లిక. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి సా.శ. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన పరస్పర సంపర్కాలకు ఈ సిల్క్ మార్గం అనుసంధాన కర్తగా ఉంది. సిల్క్ రోడ్డు ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలను దక్షిణ ఆసియా, పర్షియా, అరేబియా ద్వీపకల్పం, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపాతో కలిపే భూ మార్గాలను సూచిస్తుంది. చైనాలోని హాన్ రాజవంశం కాలం నుండి ప్రారంభించి, ఈ దారి పొడవునా జరిగిన లాభదాయకమైన పట్టు వ్యాపారం కారణంగా దీనికి సిల్క్ రోడ్డు దాని పేరు వచ్చింది. చైనా సామ్రాజ్య రాయబారి జాంగ్ కియాన్ చేసిన యాత్రలు, అన్వేషణల ద్వారా, అనేక సైనిక విజయాల ద్వారానూ హాన్ రాజవంశం క్రీ.పూ. 114 ప్రాంతంలో మధ్య ఆసియా విభాగాన్ని విస్తరించింది. చైనీయులు తమ వాణిజ్య ఉత్పత్తుల భద్రత పట్ల ఎంతో ఆసక్తి చూపారు. వాణిజ్య మార్గపు రక్షణ కోసం మహా కుడ్యాన్ని విస్తరించారు. చైనా, కొరియా, జపాన్, భారత ఉపఖండం, ఇరాన్, ఐరోపా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా నాగరికతల అభివృద్ధిలో సిల్క్ రోడ్డు వాణిజ్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. వివిధ నాగరికతల మధ్య సుదూరమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెరిచింది.
(ఇంకా…)

ఇవి కూడా చూడండి మార్చు