వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 06వ వారం
ట్రావన్కోర్ |
---|
ట్రావన్కోర్ రాజ్యం సుమారు 1729 నుండి 1949 వరకు విలసిల్లిన రాజ్యం. తొలుత పద్మనాభపురం, ఆ తరువాత తిరువనంతపురం రాజధానిగా ట్రావన్కోర్ రాజకుటుంబం ఈ రాజ్యాన్ని పాలించింది. ట్రావన్కోర్ అత్యున్నత దశలో ఉన్నపుడు, ఆధునిక కేరళలోని దక్షిణ భాగం లోని ఇడుక్కి, కొట్టాయం, అలప్పుళా, పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు, ఎర్నాకులం జిల్లాలోని ప్రధాన భాగాలు, త్రిసూర్ జిల్లాలోని పుతేన్చిర గ్రామం, ఆధునిక దక్షిణ తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లా, తెన్కాశి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పొరుగున ఉన్న కొచ్చిన్ రాజ్యంలోని ఇరింజలకుడ కూడల్మాణిక్యం దేవాలయానికి చెందిన తాచుడయ కైమల్ ఎన్క్లేవ్లు ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే కొల్లాం నగరంలోని తంగస్సేరి ప్రాంతం, తిరువనంతపురంలోని అట్టింగల్ సమీపంలోని అంచుతెంగు బ్రిటిషు భారతదేశంలో భాగం. ఉత్తరాన మద్రాసు ప్రెసిడెన్సీ మలబార్ జిల్లా, తూర్పున మద్రాసు ప్రెసిడెన్సీలో పాండ్య నాడు ప్రాంతానికి చెందిన మదురై, తిరునల్వేలి జిల్లాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఈ రాజ్యానికి సరిహద్దులుగా ఉండేవి. ట్రావన్కోర్ రాజ్యాన్ని పద్మనాభపురం, త్రివేండ్రం, క్విలాన్, కొట్టాయం, దేవికులం అనే ఐదు విభాగాలుగా విభజించారు. వీటిలో పద్మనాభపురం, దేవికులం ప్రధానంగా తమిళం మాట్లాడే ప్రాంతం. మలయాళం మాట్లాడే ప్రజలు కొద్దిసంఖ్యలో ఉండేవారు. త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం విభాగాలు ప్రధానంగా మలయాళం మాట్లాడే ప్రాంతాలు. తమిళం మాట్లాడే వారు కొద్ది సంఖ్యలో ఉండేవారు
|