విజయేంద్ర సరస్వతి

విజయేంద్ర సరస్వతి (జ. మార్చి 13, 1969) కాంచీపురం లోని కంచి కామకోటి పీఠానికి 70వ జగద్గురువు.[1] కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యంతో ఆయన తర్వాతి స్థానాన్ని 49 ఏళ్ల వయస్సులో ఆయన భర్తీ చేయనున్నారు. మఠం నియమాల ప్రకారం బాలసన్యాసిగా ఉన్నప్పుడే అప్పటి పీఠాధిపతి తన తర్వాతి పీఠాధిపతిని ప్రకటిస్తారు. 1983లో మే 29న కంచి కామకోటి 70వ పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతిని ప్రకటించారు.[2]

శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిగళ్
Vijayendra saraswathi.jpg
శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిగళ్
జననంశంకరనారాయణ
(1969-03-13) 1969 మార్చి 13 (వయసు 55)
తిరువళ్లూరు, తమిళనాడు
జాతీయతభారతీయుడు
విజయేంద్ర సరస్వతి


జీవిత విశేషాలు మార్చు

విజయేంద్ర సరస్వతి 1969 మార్చి 13న తిరువళ్లూరులో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను స్వగ్రామమైన తండలంలో పూర్తిచేసారు. సంస్కృత భాషను అభ్యసించారు. ఆయన తండ్రి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి పోలూర్ లోని శ్రీ శంకర కైంకర్య సభా పాఠశాలలో ఋగ్వేదాన్ని బోధించే వేద పండితుడు. విజయేంద్ర సరస్వతి (శ్రీ శంకరనారాయణ) ఆరవ తరగతి పూర్తిచేసిన తరువాత తన తండ్రి బోధించే పాఠశాలలో విద్యార్థిగా చేరి వేదవిద్యను అభ్యసించారు. ఆయన వివిధ శాస్త్రాలలో నిష్ణాతుడైనాడు. ఆయనకు తన ఎనిమిదవ యేట మొట్టమొదటి సారి కంచి కామకోటి పీఠం యొక్క 69వ జగద్గురువైన జయేంద్ర సరస్వతి దర్శనం లభించింది. తరువాత కంచి పీఠానికి తరచుగా నవరాత్రి పూజలకు హాజరయ్యేవారు. తన 11వ యేట పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యొక్క విశేష దర్శనం లభించింది. ఒక సంవత్సరం అనంతరం పరమాచార్య చాలా సేపు ఆయనతో సంభాషించారు.

ఆయనకు వేదం, శాస్త్ర్రాలలో విశేష ప్రతిభను శ్రీ జయేంద్ర సరస్వతి గుర్తించి తన తరువాత జగద్గురువుగా నిర్ణయించారు.[3]

జయేంద్ర సరస్వతి బాలుడైన శంకరనారాయణన్ (విజయేంద్ర సరస్వతి) కి సన్యాస దీక్షను 1983 మే 29 ప్రసాదించారు. ఆయన సన్యాస నామము శంకర విజయేంద్ర సరస్వతి. తమిళనాడులో ఆయన అనుచరులు ఆయనను "బాల పెరియవాళ్"గా పిలుస్తారు.

ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శించారు. ఆయాన్ పంజాబ్, హిమాచలప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, యితర దక్షిణ భారత ప్రాంతాలను సందర్శించారు. ఆయన 1998లో నేపాల్ దేశాన్ని తన గురువు జయేంద్ర సరస్వతితో పాటు సందర్శించారు.

ఆయన ప్రత్యేకంగా భారతీత సనాతన ధర్మం, సంస్కృతి పరిరక్షణకు తన గురువు జయేంద్ర సరస్వతితో పాటు కృషిచేసారు. ఈ లక్ష్యాలను సాధించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన దేవాలయాల నిర్మాశైలి కొరకు అనేక శిల్ప కేంద్రాలను నిర్వహించారు. ఆయన కాంచీపురంలోని ఎనతూర్ వద్ద శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అంతర్జాతీయ గ్రంథాలయం, పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ఇచట అనేక వివిధ విషయాలకు సంబంధించి అనేక భాషలలో పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ భారతీయ సంస్కృతి, తత్వ శాస్త్రాలకు సంబంధించిన పుస్తకలు ఉంటాయి. ఈ గ్రంథాలయంలో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు కూడా భద్రపరచబడినాయి.[3]

మూలాలు మార్చు

  1. "Sri Vijayendra Saraswathi brilliance made him the pontiff of Kanchi Mutt". The New Indian Express. Retrieved 2018-04-05.
  2. "కంచి మఠం తర్వాతి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి -". www.andhrajyothy.com. Archived from the original on 2018-03-03. Retrieved 2018-02-28.
  3. 3.0 3.1 "Vijayendra Saraswati Swamigal (70th Pontiff Of Sri Kanchi Kamakoti Peetam)". www.arunachala-ramana.org. Retrieved 2018-02-28.[permanent dead link]

ఇతర లింకులు మార్చు

  • The Sacred and the Profane-[1]