మల్లాది విశ్వనాథ శర్మ

(విశ్వనాథ కవిరాజు నుండి దారిమార్పు చెందింది)

మల్లాది విశ్వనాథ శర్మ (1900 - 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.

మల్లాది విశ్వనాథ శర్మ
మల్లాది విశ్వనాథ శర్మ
జననం1900
శ్రీకాకుల గ్రామం, బొబ్బిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా
మరణం1947
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర పండితులు, రచయిత

జీవిత విశేషాలు మార్చు

వీరు విశాఖపట్నం జిల్లా, బొబ్బిలి తాలూకా శ్రీకాకుల గ్రామానికి చెందినవారు. పర్లాకిమిడి రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. 1921 నుండి జీవితాంతం వరకు విజయనగరంలోని మహారాజా కళాశాల లో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. కంచి కామకోటి పీఠాధిపతి వీరి కవితా ప్రావీణ్యానికి మెచ్చి "కవిరాజు" గౌరవం ఇచ్చారు. అప్పటి నుండి వీరు విశ్వనాథ కవిరాజు గా ప్రసిద్ధులయ్యారు. వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. పరమానందయ్య శిష్యులు, పంతులమ్మ (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.

నాటకరంగం మార్చు

 
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929

విశ్వనాథ కవిరాజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటక సంస్థ సురభి నాటక కళాసమితికి నాటకాలు రచించేవారు. అనేక సంస్కృత నాటకాలను కూడా తెలుగులోకి అనువదించి వారికి అందించేవారు. ఈ క్రమంలో సురభి నాటక సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థితిని పొందారు. కుటుంబ నాటక సమాజంగా పేరొందిన ఈ సంస్థలో అతికొద్ది మంది మాత్రమే బయటివారు సన్నిహితులుగా ఉండేవారు. అటువంటి కొద్దిమందిలో విశ్వనాథ కవిరాజు కూడా ఉండేవారు. 1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.[1]

రచనలు మార్చు

అనువదించిన సంస్కృత నాటకాలు మార్చు

  • అనర్ఘ రాఘవము
  • ఆశ్చర్య చూడామణి (శక్తిభద్రుని నాటకానికి అనువాదం
  • మృచ్ఛ కటికము
  • మాళవికాగ్ని మిత్రము
  • విక్రమోర్వశీయము
  • శివపురాణము

ఆధునిక నాటకాలు మార్చు

  • కిఱ్ఱుగానుగ
  • దొంగాటకము
  • ప్రహ్లాద
  • వారసులు

మూలాలు మార్చు

  1. సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక (1 ed.). హైదరాబాద్: సురభి నాటక కళాసంఘము. 1960. Retrieved 11 December 2014.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 648-9.