శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం

శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం కృష్ణా జిల్లా లోని శ్రీకాకుళం గ్రామంలో ఉన్న దేవాలయం. ఈ ఆలయ ప్రధానదైవం "శ్రీమహావిష్ణువు". ఈ స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. కృష్ణాజిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది.

శ్రీకాకుళేశ్వరస్వామి
శ్రీకాకుళేశ్వరస్వామి is located in Andhra Pradesh
శ్రీకాకుళేశ్వరస్వామి
శ్రీకాకుళేశ్వరస్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :16°0′0″N 80°16′0″E / 16.00000°N 80.26667°E / 16.00000; 80.26667
పేరు
ప్రధాన పేరు :శ్రీకాకుళేశ్వరస్వామి
ప్రదేశం
దేశం:భారతదేశము
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
ప్రదేశం:శ్రీకాకుళం, ఘంటశాల మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీకాకుళేశ్వరస్వామి
ఆంధ్రమహావిష్ణువు
ఆంధ్రనాయకుడు
ఆంధ్రవల్లభుడు
తెలుగువల్లభుడు
సిరికాకుళని నాథుడు
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 5 వ శతాబ్దం
సృష్టికర్త:త్రిలోచనాపల్లవుడు

స్థలపురాణం మార్చు

శ్రీకాకుళేశ్వరస్వామి కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం.

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా... ‘భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని’ వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీమహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందనీ శ్రీహరి ఆచోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడిగా కీర్తినొందాడని పురాణ కథనం.[1]

చరిత్ర మార్చు

కీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో ఆంధ్రులు తొలిగా శ్రీకాకుళాన్ని రాజ్యస్థాపన చేసుకుని ఆంధ్రమహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక రచనల వల్ల తెలుస్తోంది. క్రీస్తుపూర్వం మూడో శతబ్ధానికి ముందుగానే ఆంధ్రులు శ్రీకాకుళంలో రాజ్యస్థాపన చేసినట్లు స్మిత్‌ రచనల వల్ల తెలుస్తోంది. శ్రీకాకుళేశ్వరస్వామి, ఆంధ్రమహావిష్ణువు, ఆంధ్రనాయకుడు, ఆంధ్రవల్లభుడు, తెలుగువల్లభుడు, సిరికాకుళని నాథుడు అనుపేర్లతో ప్రసిద్ధిచెందారు. 108 పుణ్యక్షేత్రాలలో 57వ క్షేత్రంగా పురాణాలలో పేర్కొన్న శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పూర్వగాధలహరి అనుగ్రంథం ద్వారా తెలుస్తుంది. క్రీస్తుశకం 5వ శతాబ్దమున ధరణికోట ప్రభువు అయిన త్రిలోచనాపల్లవుడు శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ రాజగోపురాన్ని సా.శ. 1081లో చోళరాజైన అనంత దండపాలుడు నిర్మించినట్లు చరిత్ర విశదపరుస్తోంది. విజయనగర సామ్రాజ్య అధిపతి శ్రీకృష్ణదేవరాయులు సా.శ. 1519లో శ్రీకాకుళం వచ్చి కళింగదేశంపై దండెత్తడానికి ముందుగా శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆరాధించాడని వల్లభ్యుదయ గ్రంథం ద్వారా తెలుస్తుంది.[2]

కొన్నాళ్లు అదృశ్యం మార్చు

ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్రభాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువుదీరాడనీ పురాణోక్తి. ప్రాచీనకాలంలో ఇక్కడికి సమీపంలోనున్న నదీమార్గాన వ్యాపారాలు జరుగుతుండేవి. దారినపోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారట. వాళ్లంతా ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికికొలను అని పిలిచేవారట. అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెబుతారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట. ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడట. దాదాపు వెయ్యేళ్లపాటు ఎవ్వరికీ కనిపించలేదట. ఆ తరువాత కొన్నాళ్లకి... ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఓసారి కాంచీపురానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కృష్ణాతీరానున్న శ్రీకాకుళానికి వచ్చాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని, అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడట. దానికోసం ఎన్నో గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. ఓరోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించినట్లు చెబుతారు.

చారిత్రక ప్రాశస్త్యం మార్చు

ఆముక్తమాల్యద రచన మార్చు

రాజ్యవిస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి ఓరోజు వచ్చారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ఆ రాత్రికి వూళ్లొనే బసచేశారు. రాయలుకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించాడట. దాంతో ‘ఆముక్తమాల్యద’ రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెబుతారు. ఆలయ ఆవరణలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనను రాయలు ప్రారంభించారు. దాంతో ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది. మంటపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా ఇప్పుడుంది.

పరిపాలన మార్చు

ఈ దేవాలయం గోడలపై 12, 13వ శతాబ్దాల నాటి శాసనాలు 30కిపైగా ఉన్నాయి. స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో బృగుమళ్ల అనంతభోగయ్య చేయించి ఇచ్చినట్లు విగ్రహంపైనున్న శాసనం ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్లింది. ఆ తరువాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమిందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణతీర్థులవారు ‘శ్రీకృష్ణలీలా తరంగిణి’లో ఆంధ్రమహావిష్ణువుని కీర్తించారు. శ్రీనాథుడు కూడా క్రీడాభిరామంలో ఈక్షేత్ర మహిమనూ తిరునాళ్ల వైభవాన్నీ కొనియాడాడు.

ఉత్సవాలు మార్చు

ఆలయానికి సమీపంలోనున్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాపపరిహారమౌతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశినాడు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందనీ చెబుతారు. ప్రతీయేటా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు

ఆంథ్రనాయక శతకం మార్చు

ప్రధాన వ్యాసం : ఆంధ్ర నాయక శతకము

జీర్ణ స్థితిలో ఉన్న శ్రీకాకుళాంథ్రదేవుని గుడిని చూసి కలత చెందిన కాసుల పురుషోత్తమ కవి అనన్య భక్తిభావంతో నిందాస్తుతి అలంకారంలో రాసిన శతకమిది. ఒక వైపు స్వామిని కీర్తిస్తునే, నీగుడినే రక్షించుకోలేనివాడివంటూ ఆర్థ్రతతో నిందిస్తాడు.. ఈ శతకం తెలుగు శతకాలన్నిటిలో ఒక అనర్ఘరత్నం.. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినుత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగాలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు.

ఉదాహరణలు మార్చు

ఈ శతకంలోని పద్యాలు మచ్చుకు:

సీ. ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె
సర్వచరాచరజంతువులను
కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె
మిథ్యాప్రపంచంబు తథ్యముగను
వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ
బహువిధదేవతాభద్రకళలఁ
దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ
బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి
 
తే.యిట్టివే కద నీవిద్య లెన్ని యైన-
నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

సీ.పరపురుషాకృత గురుతుగాఁ జూడక
త్రిపుర పతివ్రతాతిలకములను
విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి
తత్సతీపతుల దుర్దాంతబలుల
హతము సేయించితి వల మహానటునిచే
రథారధాంగాశ్వసారథిశరాన
గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే
సమకూర్చి యసురుల సంహరించి

తే. సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు
త్రిపురసంహరుఁ డను నాఖ్యఁ దెచ్చుకొనియె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

ప్రయాణ మార్గం మార్చు

విజయవాడ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులో రావొచ్చు. విజయవాడ నుంచి నేరుగా బస్సులున్నాయి. కొడాలి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోల్లోనూ వెళ్లొచ్చు.

మూలాలు మార్చు

  1. "శ్రీకాకుళేశ్వర స్వామి: తెలుగువారి మహావిష్ణువు". EENADU. Retrieved 2021-08-31.
  2. "ప్రధాన దేవాలయాలు, ఈనాడు - కృష్ణాజిల్లా ఎడిషన్". Archived from the original on 2016-10-06. Retrieved 2016-10-05.