సంకుసాల నృసింహకవి
సంకుసాల నృసింహకవి సా.శ.14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. అతను రచించిన కవి కర్ణ రసాయనము అనే ప్రౌఢ ప్రబంధ కావ్యము ప్రసిద్ధమైన రచన.
సంకుసాల నృసింహకవి | |
---|---|
జననం | సా.శ.14వ శతాబ్దం. |
మరణ కారణం | సహజ మరణం |
నివాస ప్రాంతం | కడప జిల్లా. |
ఇతర పేర్లు | సంకుసాల నరసింహకవి |
వృత్తి | కవి |
ప్రసిద్ధి | కవికర్ణరసాయనము. |
జీతం | జీతం |
పదవి పేరు | కవికర్ణరసాయనము కర్త |
మతం | హిందూ |
జీవిత విశేషాలు సవరించు
స్వగ్రామ వివాదం సవరించు
అతని ఇంటిపేరు "సంకేసుల" అనే ఊరి పేరు ఆధారంగా వచ్చినదని భావిస్తారు. కానీ రాయలసీమలో ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాలలో ఆ పేరుతో గ్రామాలు అనేకం ఉన్నాయి. కనుక అతను ఏ గ్రామానికి చెందినవాడో నిర్థారించలేదు. అతని జన్మస్థలం కడప జిల్లాలోని పులివెందుల గ్రామంలోని సుంకేసాల అని వేటూరి ప్రభాకర శాస్త్రి నిర్థారించారు. దీనికి కారణం ఆ గ్రామంలోని నృసింహాలయ గోడపై ఉన్న శాసనంలో అతను "కవి కర్ణరసాయన" గ్రంథం దానంగా యిచ్చినట్లు ఉంది. ఇతనిని సంకుసాల నరసింహ కవి అని కొందరు పేర్కొంటారు.
కవి కాలం వివాదం సవరించు
అతను తాళ్లపాక అన్నమాచార్యుని కుమారుడని ఒక నమ్మకం ప్రజల్లో ఉండేది. దీనిని వేటూరి వారి అన్నమాచార్య చరిత్ర లో రెండు ఆధారాలు చూపించారు. ఒకటి తెనాలి రామకృష్ణకవి చాటువు రెండవది తాళ్ళపాక చిన్నన్న కృత అష్టమహిషీ కల్యాణం అనేపీఠిక. అతను శ్రీ కృష్ణదేవరాయలకు సమకాలికుడని చాలామంది విమర్సకులు అంగీకరిస్తే రాళ్ళపల్లి అనంతకృష్ణశాస్త్రిగారు ఈయన సా.శ.14వ శతాబ్దమునకు చెందినవారని ఈయను తాళ్ళపాక అన్నమాచార్యకు సంబంధములేదని ఈయని పలు నిరూపణలు చేసారు.
అతను రాసిన ప్రౌఢ ప్రబంధ రచన కవి కర్ణరసాయనము. ఇది అల్లసాని పెద్దన వ్రాసిన మను చరిత్రము వలె ఒక ప్రబంధ రచన. నృసింహకవి తానే శాఖాబ్రాహ్మణు డైనదిగానీ లేక బ్రాహ్మణు డైనది గానీ ఎక్కడా పేర్కొనలేదు. అందువలన నృసింహకవి ఏ కులస్థుడైనదీ చెప్పుటకు వీలులేదు. ఇతను తన రచలలలో ఇష్టదేవతా స్తోత్ర పాఠముల ఆధారంగా నియోగి బ్రాహ్మణుడని నమ్మవలసి ఉంది. ఎందుకనగా తన రచనలలో మొదట విష్ణుని, పిమ్మట బ్రహ్మను, శంకరుని, వినాయకుని, సరస్వతిం బ్రార్థించెను. ఇది స్మార్తులుగా నుండు బ్రహ్మ క్షత్రియులు చేయు స్తోత్ర ప్రక్రియయై యున్నది. కాని భట్టు పరాశర శిష్యుండ నని చెప్పుకొనుటచే యితఁడు అల్లసాని పెద్దనవలె స్మార్తుడై వుండ వచ్చును. వైష్ణవేష్టి చేసికొని రామానుజ సిద్ధాంత ప్రధానుడై యుండిన నియోగి యని అని మరికొందరి అభిప్రాయము.
రచనలు సవరించు
ఈకవి కర్ణరసాయనము కావ్యానికి ఇప్పటివరకు మూడు ముద్రిత ప్రతులు ఉన్నాయి. అవి:
- పువ్వాడ వేంకటరావు పంతులు వర్తమాన తరంగిణీ ముద్రాక్షరశాలలో ముద్రించిన మొదటి ప్రతి (1885).
- ఉత్పల వేంకటనరసింహాచార్యులచే పరిష్కరించబడిన వావిళ్ళ వారి రెండవప్రతి (1916).
- మోచర్ల రామకృష్ణయ్య సంపాదకవిత్వంలో వెలువడిన సాహిత్య అకాడమీ ప్రతి మూడవది (1967).
మొదటి ప్రతిలో సంకుసాల అనిలేదు. రెండు మూడు ప్రతుల్లో సంకుసాల నరసింహకవి అనే ఉంది. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అన్నమాచార్య చరిత్రకు వ్రాసిన పీఠికలో లక్షణకర్తలు తమ లక్షణ గ్రంథాల్లో కవి కర్ణరసాయన పద్యాలను లక్ష్యాలుగా వాడుకున్న సందర్భాలలో ఇతనిని సుంకసాల నరసింగన్న అని పేర్కొన్నట్లు వ్రాసారు. ఈ కావ్య మొదటి ముద్రిత ప్రతికి రెండవ ముద్రిత ప్రతికి మధ్యకాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు కవుల చరిత్ర అనే ద్వితీయ సంపుటం (1887) లో ఈ కవిని సంకుసాల నరసింహకవి గానే పేర్కొన్నాడు. అంతే కాక ఈ కావ్యానికి జూలూరి అప్పయ్య పండితుడు వ్రాసిన వ్యాఖ్యానము మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారములో (D 453, 454) లో ఉంది.
మూలాలు సవరించు
- 1981 భారతి మాసపత్రిక. వ్యాసము:సంకుసాల నరసింహకవి కొన్ని చారిత్రక సత్యములు. వ్యాసకర్త:డా.జి.చలపతి.
- కవి కర్ణరసాయనము.