సోమరాజు రామానుజరావు

తెలుగు రచయిత

సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. రచయిత, ఉద్యమకారుడు అతను చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు అతను తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. కొవ్వలి, జంపన వంటివారి కోవలో సోమరాజు రమాపతిరావు తెలుగునాట నవలలకు ప్రాచుర్యం కల్పించిన రచయితగా నిలుస్తున్నాడు.

సోమరాజు రామానుజరావు
జననంజూన్ 18, 1896
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం
మరణంనవంబర్ 14, 1934
ప్రసిద్ధిబహునాటక రచయిత, స్వాతంత్ర సమరయోధుడు
మతంహిందు
తండ్రికోదండ రామయ్య
తల్లిఅచ్చమాంబ

జీవిత విశేషాలు మార్చు

రామానుజరావు 1896 జూన్18న జన్మించాడు. అచ్చమాంబ, కోదండరామయ్యలు ఇతని తల్లిదండ్రులు[1]. భద్రాచలం,దుమ్ముగూడెం లలో విద్యాభ్యాసం జరిగింది.బాలగంగాధర్ తిలక్,గోపాల కృష్ణ గోఖలే వంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకున్నాడు. దుమ్ముగూడెంలో శ్రీ వేంకటేశ్వర గ్రంథమండలి పేరుతో ఒక ప్రెస్‌ను నెలకొల్పి 1921 నాటికి 21 పుస్తకాలు ప్రచురించారు. దేశభక్తి వస్తువుగా తిలకు రాయబారం, ప్రచంఢ బొబ్బిలి, స్వారాజ్య రథము నాటకాలను వెలువరించారు. 1922 జూన్ 26వ తేదీన జీవో నెంబర్ 466 ద్వారా బ్రిటీష్ ప్రభు త్వం స్వరాజ్య రథమును నిషేధించింది. రామానుజరావు మీద నిర్బంధం ప్రయోగించింది. అప్పటికి అతనుకు ప్ళ్ళై రెండేళ్లే. భార్యను ఆమె తల్లి గారి ఇల్లు పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఉంచి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిన రామానుజరావు రంగూన్ చేరుకొని అక్కడి నుంచి తెలుగు పత్రిక నడిపారు. అక్కడే 1934 నవంబర్ 14న మరణించారు. అతను స్థాపించి న దుమ్ముగూడెంలోని గ్రంథాలయం 1953 వరదల్లో కొట్టుకుపోయింది. అతను స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన తోలుబొమ్మలు 1970లో లంకపల్లిలో అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అతను మనుమడు ఇందుర్తి రామానుజరావు ఇంట్లో సోమరాజు రామానుజరావు ఫోటో లభించింది.

దుమ్ముగూడెంలో స్వాతంత్ర్యోద్యమ కార్యకలాపాలు మహాత్మాగాంధీ కంటే ముందే ప్రారంభమయ్యాయి. 1917లో కోట్ల సన్యాసి నాయుడు అక్కడ పరమార్థ ప్రదాయని గ్రంథ నిలయం స్థాపించాడు. సుజన వినోదిని నాట్యమండలి, బాల వినోదిని నాట్యమండలి, మనోరంజని నాట్యమండలి, రాఘవకళాసమితి అనే నాటక సమాజాలు రామానుజరావు స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యమ నాటకాలు ప్రదర్శించేవి. దుమ్ముగూడెంకు చెందిన కట్టా గంగయ్య, అంకాల శేషగిరిరావు, బైరెడ్డి పాపరావు, జాక అప్ప న్న, భద్రి రాములు, శివరెడ్డి సీతయ్య, పోలాసు భద్రగిరి, మాటూరి సాంబశివరావు, కురుచేటి శ్రీరామమూర్తి, జలుమూరి అప్పలరాజు, మద్దినేని కామేశ్వరరావు, దువ్వి సూర్యానారాయణ వంటి కళాకారులు రామానుజరావు అడుగుజాడల్లో నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో బాలుని పాత్రలు వేసే బైరెడ్డి ముసలి నాయుడు 2002లో వ్యాసరచయితతో ఈ విషయాలన్నీ చెప్పాడు.

స్వరాజ్య రథము నాటక రచన, ప్రచురణ 1921 మార్చి డిసెంబరుల మధ్య జరిగి ఉండాలి. ఈ నాటకానికి ముందు ఇదే రచయిత రాసిన తిలకు రాయబారము నాటకము 1921 మార్చిలో వెలువడింది. 1921 డిసెంబరు 6తేదీన స్వరాజ్య రథము పుస్తక ప్రతి పరిశీలన కోసం గుంటూరు కలెక్టరు కార్యాలయానికి అందింది. కాబట్టి ఈ మధ్యకాలంలోనే స్వరాజ్యరథము వెలుగులోనికి వచ్చిందని భావించవచ్చు. తిలకు రాయబారము నాటకాన్ని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన ఎస్. వెంకటేశ్వర అండ్ కంపెనీ ప్రచురించింది. తిలకు రాయబారము నాటకము బహుళ ప్రజాదరణ పొంది ప్రతులన్నీ అయిపోవడంతో వెంటనే తిలకు రాయబారమునకు మరో నాలుగు అంకాలు ప్రతిజ్ఞాశౌకతాలీయము, పాంచాల పరాభవము, రామరాజ్యస్థాపనము, రథయాత్ర అనే అంకాలు జోడించి ఐదు అంకాలతో సమగ్రమైన స్వరాజ్య రథము నాటకాన్ని రూపొందించాడు రచయిత.

తిలకు రాయబారము నాటకాన్ని ప్రచురించిన దుమ్ముగూడెం వెంకటేశ్వర అండ్ కంపెనీ తదుపరి ఆర్నెల్లకే వెలువడిన స్వరాజ్య రథము నాటకాన్ని ప్రచురించలేదు. హేత్వంతరముచే నీ గ్రంథము వేంకటేశ్వర గ్రంథమండలిచే ప్రకటించబడక అభినవ నాటక మాలికలో ప్రచురితమైనదిఅని రచయిత నాటకం ముందుమాటలో పేర్కొన్నాడు. హేత్వంతరాలంటే ఆ రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వ నిర్బంధాలే. ...ఈ నాటకమును నేను వ్రాసిన స్వరూపమునకును, ముద్రింపబడిన స్వరూపమునకు పోలిక మెక్కడను లేదు. నా వ్రాతప్రతిని ముద్రించుటకు ముద్రాలయము వారు సర్కారు శాసన నిర్బంధమున వెనుదీయుట చేత దీనిని స్వరూపము తొడ బయటకు తీసికొని వచ్చితిని. నాటకమును ప్రదర్శించువారు కోరినచో వ్రాతప్రతిని పెంపెదను... అని రచయిత ముందుమాటలో పేర్కొన్న దాన్ని బట్టి రాతప్రతి సెన్సారై ముద్రణకు నోచుకున్నదని తెలుస్తున్నది.

అయినప్పటికి భయపడకుండా ధైర్యంగా తాను రాసింది యథాతథంగా ప్రదర్శించే వారుంటే రాతప్రతిని పంపిస్తాననడం సోమరాజు రామానుజరావు నిబద్ధతకు తార్కాణం. నిజానికి గుంటూరులోని చంద్రికా ప్రెస్ దేశభక్తి రచనలకు ఆ రోజుల్లో పేరెన్నికగన్నదే. అయితే ఈ ప్రెస్‌తో స్వాతంత్ర్యోద్యమ కారులతో సత్సంబంధాలుండడం అప్పటికే చంద్రికా ప్రెస్‌లో ముద్రించిన దేశభక్తి రచనలు నిషేధానికి గురికావడం వల్ల స్వరాజ్య రథము ముద్రణ నాటికి చంద్రికా ప్రెస్‌పై బ్రిటి ష్ ప్రభుత్వ నిఘా, నిర్బంధం పెరిగి ఉంటుంది. అయితే తన నాటక ప్రచురణకు గుంటూరు తిలకు నాటకసమాజము వారు ధన సహాయము చేసినట్లు సోమరాజు రామానుజరావు చెప్పుకున్నారు.

తొలి నవల మార్చు

ఈయన మొదటగా 1914లో ‘జగన్మోహిని’ నవల రాశారు.ఆ తర్వాత వరుసగా ‘విషవాహినీ, హైమావతి, రక్తజ్వాల’ నవలలు రచించారు. ఇవి ఎక్కువగా నాటకశైలిలో సాగుతాయి. ఈ నవలా సృజనే తర్వాతకాలంలో సోమరాజును గొప్ప నాటకకర్తగా ఆవిష్కరించింది. అతను తండ్రి కోదండరామయ్య ‘అనసూయ’ నాటకాన్ని రాసి అప్పటికే రచయితగా గుర్తింపు పొందారు. ఆ నాటకాన్ని మైలవరం నాటక కంపెనీ ప్రదర్శించింది. తండ్రి వారసత్వమే సోమరాజును నాటక రచనలవైపు దృష్టి సారించేలా చేసింది. అయితే తొలిరోజుల్లో తెలంగాణలో పారసీ, ధార్వాడ, సురభి కంపెనీలు ప్రదర్శించిన నాటకాలు ఇక్కడి కవి పండితులను ఆకర్షించాయి. వారు నాటక రచనలు చేసేలా ప్రేరేపించాయి. అలా స్ఫూర్తి పొందిన నాటకకర్తల్లో ఖమ్మం వాసి కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఒకరు. ఆ క్రమంలోనే తూము రామదాసు, చందాల కేశవదాసు లాంటి వారు తెలంగాణ నాటక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచారు.

తనదైన శైలిలో రచనలు మార్చు

ఒకే కథ ఆధారంగా అనేకమంది అనేక నాటకాలను రచించారు. అయితే ఆ రచనల్లో ఎవరిశైలి వారిదే. ఆ క్రమంలో సోమరాజు కూడా అలాంటి ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. ‘సుగ్రీవ పట్టాభిషేకం, దానవీరకర్ణ, సతీ సక్కుబాయి, వీరాభిమన్యు, సీతాకల్యాణం, భోజ కాళిదాసు’ లాంటి నాటకాలు ఈ వరుసలో కనిపిస్తాయి. వేదం వేంకటరాయశాస్త్రి ‘ప్రతాప రుద్రీయం’ ఇదివరకే రాసినప్పటికీ 1926లో సోమరాజు ‘ప్రతాపరుద్రీయము అను యుగంధర విజయము’ అనే నాటకాన్ని రాశారు. కాళ్లకూరి నారాయణరావు 1918లో చింతామణి నాటకం రాశారు. సోమరాజు ఇదే ఇతివృత్తాన్ని తీసుకుని 1929లో తన ‘చింతామణి’ నాటకాన్ని కొత్తదనంతో ఆవిష్కరించారు.

జాతీయోద్యమ స్పూర్తి మార్చు

సోమరాజు 1914లో ‘సృజన వినోదిని’ అనే నాటక సంస్థను ప్రారంభించి పద్య నాటకాలను ప్రదర్శించారు. 1905- 1910 మధ్యకాలంలో జాతీయ మహాసభల్లో చేసిన స్వరాజ్య తీర్మానాలు నాటక సృజనకు ఉద్దీపన కలిగించాయి. పౌరాణిక, చారిత్రక పద్య నాటకాలు ఇక్కడి నాటక రంగాన్ని సుసంపన్నం చేశాయి. వీటిని రాసిన రచయితలు అంతర్లీనంగా జాతీయోద్యమ ప్రబోధాన్ని వినిపించేవారు. ఆయా నాటకాల్లోని ప్రధాన పాత్రలను జాతీయ వీరులుగా చిత్రించేవారు. ‘వీరాభిమన్యు’ లాంటి పౌరాణిక నాటకాలతోనే కాకుండా చారిత్రక నాటకాలతో కూడా జాతీయ భావాలను ప్రేరేపించారు సోమరాజు. ‘ప్రతాపరుద్రీయం’లో చెకుముకి శాస్త్రి పాత్రతో ‘‘ఓరీ దుష్టులారా! నికృష్టులారా! భరత ఖండము ఎవ్వరి తాత సొమ్ముని తలపోసి యథేచ్ఛ వ్యాపారంబున రాజమఖండము శాశ్వతముగా నేలకొన దలంచితిరి! మ్లేచ్ఛాధములగు మీ స్వాతంత్ర్యంబునకు దలలొగ్గి పరస్వాతంత్ర్య పిశాచ దాసులమై మీ బానిసలమైనను మీ నిరంకుశాధికారంబు మాపై సాగింపక వదలరైతిరా!’’ అని పలికించి, ఆంగ్లేయులను నిలదీశారు.

సోమరాజు రామానుజరావు 1917- 18లో బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే ప్రభావంతో ‘తిలక్‌ రాయబారము’ నాటికను రాసి ప్రదర్శించారు. తెలుగు నాటక రంగంలో ఇది తొలి స్వాతంత్ర్యోద్యమ నాటిక. ఒక అంకం కలిగిన ఈ నాటికను ‘యస్‌.వెంకటేశ్వర కంపెనీ’ పుస్తకంగా ప్రచురించింది. 1917 - 1922 మధ్యకాలంలో సోమరాజు దర్శకత్వంలో భద్రాచలం ప్రాంతంలో స్వాతంత్ర్యోద్యమ ఇతివృత్తాలతో కూడిన సాంఘిక నాటకాలను ప్రదర్శించేవారు. బైరెడ్డి పాపారావు, భద్రి రాములు, జాక అప్పన్న, అంకాల శేషగిరి రావు, దువ్వి సూర్యనారాయణ, శివారెడ్డి సీతయ్య, పోలాసు భద్రగిరి ఈ నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించేవారు. బైరెడ్డి ముసలి నాయుడు బాలనటుడిగా నటించేవారు. ఇదే పరంపరలో ప్రజల్లో జాతీయోద్యమాన్ని రగిలించేందుకు సోమరాజు తోలుబొమ్మలాటలతోనూ ప్రదర్శనలిప్పించేవారు. ఇందుకోసం అతను ప్రత్యేకంగా తోలుబొమ్మలను తయారు చేయించి గ్రామగ్రామాన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత కాలంలో అతను వారసులు ఈ బొమ్మలను లంకపల్లిలో భద్రపరిస్తే, 1970లో జరిగిన అగ్నిప్రమాదంలో అవి కాలిబూడిదయినట్లు సాహిత్య పరిశోధకులు ఆయాచితం శ్రీధర్‌ పేర్కొన్నారు.

వత్తిడులూ నిర్భందాలు మార్చు

  • తిలక్‌ రాయబారం’ నాటికకు మరో నాలుగు అంకాలు చేర్చి, ‘స్వరాజ్యరథము’ నాటకంగా రాశారు సోమరాజు. 1921లో చంద్రికా ముద్రాక్షరాలయం దీన్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. అయితే ప్రభుత్వం నిఘా ప్రభావంతో ఆ ప్రచురణ సంస్థ ఈ నాటకంలో కొంత మార్పుచేర్పులు చేసి ప్రచురించింది. సోమరాజు ఈ పుస్తకానికి ముందుమాటను రాస్తూ ‘‘ఈ నాటకమును నేను రాసిన స్వరూపమునకు, ముద్రించబడిన స్వరూపమునకు పోలిక ఎక్కడనూ లేదు. నా రాతప్రతిని ముద్రించుటకు ముద్రణాలయము వారు సర్కారు శాసన నిర్బంధమున వెనుదీయుటచేత దీని స్వరూపము తోడ బయటకు తీసుకువచ్చితిని. నాటకము ప్రదర్శించువారు కోరినచో రాతప్రతి పంపెదను’’ అని చెప్పారు. బ్రిటిషు వారి నిర్బంధాన్ని సైతం ధిక్కరించి నాటక రచనల ద్వారా ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు సోమరాజు పడిన తపన ఈ మాటల్లో కనిపిస్తుంది.
  • సోమరాజు నైజాం ప్రాంతంలో ఉంటున్నప్పటికీ తన నాటక రచనలను గుంటూరులో ముద్రింపచేసేవారు. ఆంగ్లేయుల పాలనలోని నైజాం ప్రాంతంలో పుస్తకాల మీద నిఘా ఉండేది. ప్రజల్లో స్వాతంత్ర్య భావాలను ప్రేరేపించే రచనలను ప్రభుత్వం బయటికి రానిచ్చేది కాదు. అలా ‘స్వరాజ్యరథము’ నాటకాన్ని 1922, జూన్‌ 26న నిషేధించింది. నాటకకర్త సోమరాజు అరెస్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో అతను కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. పోలీసుల నిఘా మరింత పెరగడంతో అతను తన కుటుంబసభ్యులను అత్తవారింట్లో వదిలి మిత్రుల సహకారంతో రంగూన్‌కు (నాటి తెలుగువారు ‘రంగం’గా పిలుచుకున్న బర్మా రాజధాని) చేరుకున్నారు.

బర్మాలో తెలుగు నాటక జండా మార్చు

సోమరాజుకు రంగూన్‌ నాటక రంగం ఆశ్రయమిచ్చింది. అప్పటికే భారతదేశానికి చెందిన అనేకమంది వ్యాపార నిమిత్తం వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వాళ్లలో తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ నగరంలో మాంసా సారథ్యంలోని ఎంపైర్‌ పారసీ థియేటర్‌ గుజరాతీ నాటకాలను, వెలగల వెంకటరెడ్డి నిర్వహణలోని ‘రంగూన్‌ జాతీయ నాటక సభ’ తెలుగు నాటకాలను ప్రదర్శిస్తుండేవి. ఈ సమాజాల పరిచయం సోమరాజుకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అదే సమయంలో అతను రాకతో అక్కడి నాటక బృందాలకు రచయితలు లేని లోటు తీరింది. సోమరాజుతో వెలగల వెంకటరెడ్డి అనేక నాటకాలు రాయించి రంగూన్‌లో గొప్పగా ప్రదర్శింపచేశారు. రామానుజరావు రంగూన్‌కు రాక పూర్వమే ‘స్వరాజ్య రథము, ప్రచండ బొబ్బిలి, సీతావనవాసం, ద్రౌపది, బిల్వమంగళం’ నాటకాలను రాసి ఉన్నారు. రంగూన్‌కు వెళ్లాక 1922లో ‘శ్రీరామ జననం’ నాటకం రచించారు. గజేంద్రమోక్షం, పరీక్షిత్తు, కుచేలోపాఖ్యానం, భక్త మార్కండేయ, ధ్రువ చరిత్ర కథలతో 1924లో సోమరాజు ‘మహాభక్తవిజయం’ నాటకాన్ని రాశారు. కంపెనీ నిర్వాహకుడు వెలగల వెంకటరెడ్డి ప్రత్యేక రంగాలంకరణలతో దీన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మొదట్లో ఆరుగంటల పాటు ప్రదర్శితమైన ఈ నాటకాన్ని ఆ తర్వాత కాలంలో మూడు గంటలకు కుదించారు. ‘సరస్వతీ నాట్యమండలి’ వారు 1932లో దీన్ని తెలుగునాట ప్రదర్శించారు. అరేబియన్‌ సాహిత్యం ఆధారంగా సోమరాజు నాటక సృజన చేయడం ఆ రోజుల్లో గొప్ప ప్రయత్నం. ‘అరేబియన్‌ నైట్స్‌’లోని అలీబాబా నలభై దొంగల కథ నేపథ్యంలో 1925లో ‘అదృష్ట విజయం’ నాటకం రాశారాయన. ఇది రంగూన్‌లో అనేకసార్లు ప్రదర్శితమై, అరేబియన్‌ కథలకు అక్కడ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. తన నాటకాలను తెలుగునేల మీద మొదటిసారి ప్రదర్శించే సమాజాలకు ‘రజతపాత్ర’ను బహుమతిగా ఇస్తానని సోమరాజు అప్పట్లో ప్రకటించారు. అలా అతను పరాయిగడ్డ మీద ఉంటూ తెలుగునాట నాటక వ్యాప్తికి పరోక్షంగా ప్రేరణ కలిగించారు. రంగూన్‌లోని ఎంపైర్‌ పారసీ థియేటర్‌ గుజరాతీ భాషలో ‘దానవీరకర్ణ’ నాటకాన్ని ప్రదర్శించింది. వెలగల వెంకటరెడ్డి కోరిక మేరకు ఆ నాటకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సోమరాజు 1927- 28లో తెలుగులో ‘దానవీరకర్ణ’ నాటకాన్ని రచించారు. సోమరాజు రచించిన ‘సతీ సక్కుబాయి’ నాటకాన్ని చూసిన ప్రఖ్యాత నాటకకర్త చందాల కేశవదాసు ఎంతో మురిసిపోయారు. ఈ నాటకాన్ని ప్రచురిస్తున్నప్పుడు అతను ముందుమాట రాస్తూ ‘‘నాటక రచన ప్రదర్శనానుకూలము గాను, పఠనాను కూలముగాను తూచినట్లు రసవత్తరంగా నీ సతీసక్కుబాయి నాటకమునకు వలె నా హృదయమునకు ముదము గూర్చిన నాటకములు కొన్ని మాత్రమే యనక తప్పదు’’ అని ప్రశంసించారు.

వ్యతిరేఖతలను దాటుకుంటూ నిలబడ్డా రంగూన్ రౌడీ నాటకం మార్చు

సోమరాజు నాటకాల్లో ‘రంగూన్‌ రౌడీ’ ప్రత్యేకమైంది. ఇది రంగూన్‌తో పాటు తెలుగుగడ్డ మీద కూడా అనేక సార్లు ప్రదర్శితమై, మంచి పేరు తెచ్చుకుంది. ఈ నాటకాన్ని 1929లో ‘జాతీయ నాటక సభ’ కోసం రాశారు సోమరాజు. నాటక బృందం ప్రదర్శనకు సన్నద్ధమవుతున్న సమయంలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ‘రంగూన్‌ రౌడీ’ అనే పేరు తమను కించపరిచేలా ఉందని ప్రదర్శనను అడ్డుకున్నారు. దీంతో సోమరాజు ఈ నాటకం రంగూన్‌ ప్రజలకు వ్యతిరేకం కాదని, ఆ పేరు హీరోయిజానికి ప్రతీకగా ఉంటుందని, నాటకం చూసిన తర్వాత నచ్చకపోతే ప్రదర్శన ఆపేస్తామని విజ్ఞప్తి చేశారు. చివరికి పోలీసుల సహకారంతో ‘రంగూన్‌ రౌడీ’ని ప్రదర్శించారు. ‘‘ప్రదర్శనమును గాంచుటకు కోపముచేత ప్రజలు రారేమో యని భీతిల్లితిమి గాని ఆ నాటక మెట్లుండునో చూతమను ఉద్దేశముతో ఆనాడు ప్రేక్షకులు ఇసుకవేసిన రాలని చందమున నరుదెంచి హాలంతయు నిండి పోయినది. నాటక ప్రదర్శనము మొదలు మంగళం వరకును ప్రేక్షకులు సంపూర్ణ ప్రమోదభరిత మానసులై నాటకమను వీక్షించి, తొలుత మేమెంత భీతిల్లితిమో అంత అధికముగా భూషింపసాగిరి. ఈ నాటకమే రంగూన్‌ జాతీయ నాటక సభ వారిచే గోదావరి, విశాఖపట్టణము, గంజాము జిల్లాలలో నంతటను పలుసార్లు ప్రదర్శింపబడి మంచికీర్తిని గడించినది’’ అని ‘రంగూన్‌ రౌడీ’ నాటక పుస్తకం తొలిపలుకుల్లో చెప్పారు రామానుజరావు. ఈ నాటకంలో కథానాయకుడి పాత్రపోషణలో దొమ్మేటి సూర్యనారాయణ చాలా పేరుగడించారు.

సామాజిక ఉపయుక్త కృత్యాలు మార్చు

18వ యేట రచనారంగంలోకి ప్రవేశించాడు. 1921 నాటికే దుమ్ముగూడెంలో శ్రీ వెంకటేశ్వర గ్రంథమండలిని ఏర్పాటు చేసి దాని ద్వారా పుస్తకాలు ప్రచురించేందుకు గాను ఒక ప్రెస్‌ని కూడా స్థాపించాడు. శ్రీ వెంకటేశ్వర గ్రంథమండలి ప్రెస్‌లో 1921 నాటికే 21 పుస్తకాలు అచ్చయ్యాయి. తన స్వగ్రామం దుమ్ముగూడెంలో గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. అయితే ఈ లైబ్రరీ 1953లో గోదావరికి వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది.

సినిమా రంగంలో మార్చు

  • అనేక పౌరాణిక చిత్రాలు నిర్మించిన హెచ్‌.ఎం. రెడ్డి సాంఘిక చిత్రాల బాట పట్టారు. సోమరాజు రామానుజరావు నాటిక ‘రంగూన్‌ రౌడీ’ హక్కులు కొని ఆ నాటికకు అసంఖ్యాక మార్పులుచేసి ‘గృహలక్ష్మి’ (1938) చిత్రాన్ని నిర్మించారు.

మరణం మార్చు

సోమరాజు జీవించింది 38 సంవత్సరాలే. ఆ కొద్దిపాటి జీవన ప్రయాణంలోనే యాభై నాటకాలు, ఇరవైకి పైగా నవలలను రచించారు. సామాజిక స్పృహ కలిగిన రచయితగా సంఘం పట్ల బాధ్యతను, దేశంపట్ల నిబద్ధతను చాటుకున్నారు. బహుముఖీనమైన అతను కృషి కొత్తతరానికి స్ఫూర్తిదాయకమైంది. 1934, నవంబరు 14న సోమరాజు స్వర్గస్థులయ్యారు. ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్థంలో తెలుగు నాటక రంగంలో అతను ఓ ఉత్తుంగ తరంగం. రంగస్థల కార్యక్షేత్రంలో తెలంగాణ వారసత్వమై జాతిని జాగృతం చేసిన మహానుభావుడు.

రచనా రంగం మార్చు

నాటకాలు మార్చు

సోమరాజు రామానుజరావు నాటకకర్తగా అనేక నాటకాలు రచించారు. అతను రాసిన నాటకాలు ఇవి:

  • లక్ష్మణ మూర్ఛ[2]: రామాయణంలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే అతను ప్రాణాలు దక్కించేందుకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. ఆ పనికి అమితాదరం పొందిన రాముడు హనుమను కౌగలించుకుంటాడు. అపురూపమైన ఈ ఘట్టాన్ని రాముడి వద్దకు హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం నుంచి మొదలుకొని ఐదు అంకాల నాటకంగా రచించారు కవి. ఈ గ్రంథం 1933లో ప్రచురణ పొందింది.
  • అదృష్ట విజయము[3]: రామానుజరావు రచించిన ఈ నాటకానికి ప్రపంచ ప్రసిద్ధమైన అరేబియన్ నైట్స్ గ్రంథంలోని కథ మూలం. ఈ అరేబియన్ నైట్స్ కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అత్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు. వాటిలోని ఆలీబాబా నలభై దొంగలు ఈ కథకు మూలం. రహస్యంగా దొంగలు దాచిన నిధిని కనిపెట్టిన ఓ నిరుపేద జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ముఖ్య కథాంశం. పారశీక ఇతివృత్తాన్ని రచయిత భారతీయ నేపథ్యంలోకి మలిచారు.
  • రంగూన్ రౌడీ: వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా రచించిన నాటకమిది.[4] అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం సినిమాగా కూడా రూపొందించారు.
  • కాలకేతనము[5]: కాలకేతుదనే రాజు కథను ఈ నాటకంగా మలిచారు. ఇది జానపద ఇతివృత్తంగల నాటకం.
  • గృహలక్ష్మి: హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం-గృహలక్ష్మి. దీని కథా రచయిత సోమరాజు రామానుజరావు. రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.
  • స్వరాజ్య రథము: సోమరాజు రామానుజరావు వ్రాసిన ఐదు అంకాల నాటకం ఇది. ఆంగ్లేయుల దురంతాలకు తల్లడిల్లిన భరతమాత తనను కాపాడుమని ఇంధ్రసభలో వేడుకొంటుంది. తిలక్ గాంధీగా అవతరించి, ప్రజలను చైతన్యపరచి స్వరాజ్య రథాన్ని ముందుకు నడిపించి స్వాతంత్ర్యాన్ని సాధించడం ఈ నాటకంలోని ఇతివృత్తం. వందలాది ప్రదర్శనలకు నోచుకొన్న ఈ నాటకం బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధించబడింది.
  • పార్వతీ గర్వభంగము[6]: ఈ నాటకానికే గంగావతరణమని మరో పేరు. ఈ నాటకాన్ని అతను రంగూనులోని ఆంధ్ర జాతీయ నాటక సభ కోసం రచించారు. జానపదుల నోళ్లలో నానుతూన్న గంగా గౌరీ సంవాదం, పౌరాణికంగా వర్ణితమైన గంగావతరణం సమన్వయం చేసి రచించిన నాటకమిది.
  • భోజ కాళిదాసు[7]: భోజరాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్నట్టుగా, వారిద్దరి మధ్యా జరిగిన సరస, సాహిత్యపరమైన వివిధ కథలు చాటువులుగా ప్రచారంలో ఉన్నాయి. రకరకాలైన శ్లోకాలు కాళిదాసు చెప్పినట్టుగానూ దానికి భోజరాజు కారణమైనట్టుగానూ ఉన్నాయి. వీటిలో చాలా భాగం చమత్కారయుతంగానూ, సాహిత్యంలోని సూక్ష్మ విశేషాలు తెలిపేవిగానూ ఉంటాయి. వీటన్నిటినీ స్వీకరించి రచయిత గ్రంథాన్ని రచించారు.
  • సతీ సక్కుబాయి[8]: సక్కుబాయి ప్రముఖ భక్తురాలు. ఆమె కథ చాలా ప్రాచుర్యం పొందింది. అత్తగారి ఆరళ్ళు భరించి, కృష్ణునిపై భక్తిని పెంచుకున్న ఆమెకు అత్తగారు చేయలేని పనిని అప్పగించినప్పుడు కృష్ణుడే కాపాడాడని ప్రతీతి. ఆమె కథను మహిళాభ్యుదయంతో ముడిపెట్టి ఈ నాటకాన్ని రచించారు.
  • ధరణికోట[9]: రెడ్డిరాజుల పరిపాలననూ,అందులోనూ ముఖ్యంగా వారు పోరిన ఓ సంగ్రామాన్ని కథావస్తువుగా స్వీకరించి ఈ నాటకం రచించారు.
  • భీష్మ బ్రహ్మాచారి [10]: మహాభారతంలోని భీష్ముడి గురించిన నాటకం
  • వీరాభిమన్యు [11]
  • దోమాడ యుధ్దము [12]
  • సంగీత సావిత్రి [13]
  • దానవీర కర్ణ [14]
  • తాజ్‌మహల్, దానవీరశూర కర్ణ, సతీ అనసూయ తదితర నాటకాలు అనేకం రచించారు.
  • వీరు తెలుగులో 1926లో ప్రచురించిన ‘పద్మవ్యూహాము’ అనే నాటక పుస్తకంలో పద్మవ్యూహం చిత్ర రూపంలో కనిపిస్తుంది.

నవలలు మార్చు

ఇతడు నాటకాలే కాకుండా నవలలు 20కిపైగా రచించాడు. నవలా ప్రక్రియను తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చినవారిలో సోమరాజు రామానుజరావు ముఖ్యుడు, ఈ విషయంలో ఇతను కొవ్వలి, జంపన వంటివారి కోవలోకి చెందుతాడని అక్కిరాజు రమాపతిరావు భావించాడు.[15]

వాటిలో కొన్ని[1]:

  1. మంజుమతి (1914)
  2. జగన్మోహిని (1915) - సుబోధినీ గ్రంథమాల, నెల్లూరు వారు ప్రచురించారు.
  3. విషవాహిని (1916) - ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, నిడదవోలు వారు ప్రచురించారు.
  4. హైమవతి (1916) - ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, నిడదవోలు వారు ప్రచురించారు.
  5. దోమాడ యుద్ధము (1921)
  6. శిశుహత్య
  7. వనదుర్గము
  8. జపమాలిక
  9. తపోవనము
  10. రక్తజ్వాల
  11. కరుణ

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. 1.0 1.1 సంగిశెట్టి, శ్రీనివాస్ (13 November 2017). "తొలితరం నవలాకారుడు సోమరాజు రామానుజరావు". మనతెలంగాణ. Archived from the original on 16 నవంబరు 2017. Retrieved 14 November 2017.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణ మూర్ఛ నాటకం.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో అదృష్ట విజయము నాటకం.
  4. భారత డిజిటల్ లైబ్రరీలో రంగూన్ రౌడీ నాటకం.
  5. భారత డిజిటల్ లైబ్రరీలో కాలకేతనము నాటకం.
  6. భారత డిజిటల్ లైబ్రరీలో పార్వతీ గర్వభంగము పుస్తకం.
  7. భారత డిజిటల్ లైబ్రరీలో భోజ కాళిదాసు నాటకం.
  8. భారత డిజిటల్ లైబ్రరీలో సతీ సక్కుబాయి నాటకం.
  9. భారత డిజిటల్ లైబ్రరీలో ధరణికోట నాటకం.
  10. భారత డిజిటల్ లైబ్రరీలో భీష్మబ్రహ్మాచారి నాటకం.
  11. భారత డిజిటల్ లైబ్రరీలో వీరాభిమన్యు నాటకం.
  12. భారత డిజిటల్ లైబ్రరీలో దోమాడయుధ్దము పుస్తకం
  13. భారత డిజిటల్ లైబ్రరీలో సంగీత సావిత్రి నాటకం
  14. భారత డిజిటల్ లైబ్రరీలో దానవీర కర్ణ నాటకం
  15. అక్కిరాజు, రమాపతి రావు (1975). తెలుగు నవల. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. p. 26. Retrieved 1 June 2018.

ఇవి కూడా చూడండి మార్చు