ఎం.ఎ.నరసింహాచార్

కర్ణాటక సంగీత విద్వాంసుడు

మండయం అన్నాదొరై నరసింహాచార్ మైసూరులో 1924, ఆగష్టు 24వ తేదీన జన్మించాడు.[1] ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో కర్ణాటక గాత్ర సంగీతంలో టైగర్ వరదాచారి, సబేశ అయ్యర్, పొన్నయ పిళ్ళైల వద్ద శిక్షణ పొందాడు. 1942లో ఇతడు మైసూరులో గానకళామందిరం పేరుతో స్వంత సంగీత పాఠశాలను నెలకొల్పాడు. దీనిని 1972లో బెంగళూరుకు తరలించాడు. ఇతడు మైసూరు మహారాణి సంగీత కళాశాలలో కూడా సంగీత అధ్యాపకుడిగా పనిచేశాడు.

మండయం అన్నాదొరై నరసింహాచార్
వ్యక్తిగత సమాచారం
జననం (1924-08-24) 1924 ఆగస్టు 24 (వయసు 99)
మరణం2004 జూలై 7(2004-07-07) (వయసు 79)
సంగీత శైలికర్ణాటక సంగీతం (గాత్రం)
వృత్తిగాయకుడు

సంగీత విద్వాంసుడిగా ఇతడు దేశంలోని నలుమూలలా సంగీత కచేరీలు చేశాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అన్ని సంగీత సభలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు సంగీతంపై అనేక వర్క్‌షాపులు నిర్వహించాడు. తన గురువు టైగర్ వరదాచారిపై, వీణ శేషణ్ణపై గ్రంథాలను రచించాడు. వివిధ పత్రికలలో సంగీతపరమైన వ్యాసాలు అనేకం వ్రాశాడు.

కర్ణాటక సంగీత రంగంలో ఇతడు చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 1992లో రాజ్యోత్సవ ప్రశస్థిని ప్రదానం చేసింది. 1999లో "రాజ్య సంగీత విద్వాన్" బిరుదును ఇచ్చింది. 2003లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో అవార్డుతో సత్కరించింది. ఇంకా ఇతనికి కర్ణాటక గానకళా పరిషత్తు "గానకళాభూషణ", కర్ణాటక సంగీత నృత్య అకాడమీ "కర్ణాటక కళాతిలక" బిరుదులను ప్రదానం చేశాయి.

ఇతడు 2004 జూలై 7న తన 79వ యేట మరణించాడు.[2] ఇతని కుటుంబం, శిష్యులు 2001లో ఇతని పేరుతో "ఎం.ఎ.నరసింహాచార్ మ్యూజికల్ ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రతియేటా కర్ణాటక సంగీతంలో విశేషమైన కృషి చేసిన కళాకారుడిని "గాన వారిధి" బిరుదుతో సత్కరిస్తున్నారు.

మూలాలు మార్చు

  1. web master. "Mandayam Annadorai Narasimhachar". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 10 ఆగస్టు 2020. Retrieved 23 February 2021.
  2. M.A. Narasimhachar passes away