కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక, నిమ్మరసం వాడతారు.

కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం మొత్తం ఏడు చక్రాలు (శక్తికేంద్రాలు) గా విభజింపబడి ఉంటుంది. ఇవి వెన్నుపాము చివరన మూలాధార చక్రంతో మొదలై తలపైన సహస్రాధార చక్రంలో అంతమవుతాయి. ఇందులో ఆరోది రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం. దీనినే ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం. (7200నాడులు శరీరంలో ఉంటాయి) ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. [1]

ధరించే విధానం మార్చు

  • శివ భక్తులు విభూతితో మూడు అడ్డ నామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు.
  • విష్ణుభక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం. మధ్యలో ఎర్రనామం లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు.

మహిళలు మార్చు

హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. పెళ్ళైన మహిళలు ఇంటికి వచ్చి వెళుతున్నపుడు పెద్దవారైతే గౌరవసూచకంగా, చిన్న వారైతే దీవెనగా కుంకుమ బొట్టు పెట్టి సాగనంపడం ఆనవాయితీ.

మూలాలు మార్చు

  1. Huyler, Steven. "The Experience: Approaching God". In The Life of Indians , ed. Vasudha Narayanan and John Stratton Hawley. Los Angeles: University of California Press, 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=కుంకుమ&oldid=4010689" నుండి వెలికితీశారు