జోసెఫ్ జార్జ్ (జననం 1977 అక్టోబరు 22), భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత కూడా. జోజు జార్జ్ అని పిలవబడే ఆయన మలయాళం సినిమాకు చెందినవాడు. అయితే, కొన్ని తమిళ ప్రాజెక్ట్‌లలో కూడా పనిచేశాడు. వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ (2023)తో జోజు జార్జ్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు.[1]

జోజు జార్జ్
జననం
జోసెఫ్ జార్జ్

(1977-10-22) 1977 అక్టోబరు 22 (వయసు 46)
మాల, కేరళ, భారతదేశం
విద్యాసంస్థక్రైస్ట్ కాలేజ్, ఇరింజలకుడా
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • ప్లే బ్యాక్ సింగర్
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
పురస్కారాలుఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్
మూడు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్

2015లో, అతను చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అదే సంవత్సరం, ఆయన ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లుక్కా చుప్పిలలో తన సహాయక పాత్రలకు ప్రత్యేక ప్రస్తావన - కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆయన చిత్రం జోసెఫ్ (2018) 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక ప్రస్తావన పురస్కారం పొందింది. వీటితో పాటుగా ఆయన నటుడుగా, నిర్మాతగా 20కి పైగా అవార్డులను అందుకున్నాడు.

చార్లీ (2015), ఉదాహరణం సుజాత (2018) వంటి చిత్రాలను నిర్మించిన ఆయన స్వంత నిర్మాణ సంస్థ అప్పు పాతు పప్పు ప్రొడక్షన్‌ని ప్రారంభించాడు.

ప్రారంభ జీవితం మార్చు

ఆయన 1977 అక్టోబరు 22న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా మాలాలో జార్జ్ పరేకాటిల్, రోజీ జార్జ్ దంపతులకు జన్మించాడు. ఆయన కుజూర్‌లోని జీహెచ్ఎస్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసాడు. ఆ తరువాత, ఆయన ఇరింజలకుడలోని క్రైస్ట్ కాలేజీలో చదువుకున్నాడు.

1995లో, ఆయన జూనియర్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆపై 1997లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదిగాడు.

కెరీర్ మార్చు

ఆయన మొదటగా జూనియర్ ఆర్టిస్ట్‌గా మజవిల్కూదరం (1995) సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించాడు. 2010ల నాటికి సపోర్టింగ్ రోల్స్‌తో క్రమంగా స్టార్‌డమ్‌కి ఎదిగాడు. 2015లో, ఆయన ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లుక్కా చుప్పి చిత్రాలలో తన సహాయ పాత్రలకు మొదటి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించిన జోసెఫ్‌ (2018)లో ప్రధాన పాత్రతో అతని కెరీర్‌లో మంచి పురోగతి వచ్చింది. ఈ చిత్రం ఆ సంవత్సరం జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకుంది. అలాగే, జోజు జార్జ్ రెండవ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. ఆయన పొరింజు మరియం జోస్, హలాల్ లవ్ స్టోరీ, జగమే తంతిరం, పద, అవియల్ వంటి చిత్రాలలోనూ నటించాడు. నయట్టు, మధురం, ఫ్రీడమ్ ఫైట్ చిత్రాలలో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నాడు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో మరో ఉత్తమ నటుడిగా పురస్కారం కైవసం చేసుకున్నాడు.

నిర్మాతగా, ఆయన చార్లీ (2015), ఉదాహరణం సుజాత (2017), జోసెఫ్ (2018), చోళ (2019), పొరింజు మరియం జోస్ (2019), మధురం (2021) చిత్రాలను నిర్మించాడు, నటుడిగా, నిర్మాతగానే కాకుండా, ఆయన జోసెఫ్‌లోని పాడవరంబాతిలోడే, దృశ్యంలోని చంద్రకళాధారణే, శాంతిలోని కల్లాతారం పాటలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా ఘనత పొందాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

జోజు జార్జ్ 2008లో అబ్బాను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఇయాన్, సారా, ఇవాన్ ఉన్నారు.[2]

మూలాలు మార్చు

  1. Eenadu (14 November 2023). "మరోసారి వాయిదాపడ్డ 'ఆదికేశవ'.. కారణమిదే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. "Mangalam - Varika 14-Mar-2016". Archived from the original on 14 March 2016. Retrieved 14 March 2016.{{cite web}}: CS1 maint: unfit URL (link)