మారొజు వీరన్న మొదట సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. బహుజనులను బలీయమైన సామాజిక, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా, ఇంకా చెప్పాలంటే రాజ్యాధికార శక్తిగా పరివర్తించడానికి మారోజు వీరన్న తన యావచ్ఛక్తులు ధారబోసారు. దళిత బహుజన మహాసభ ద్వారా దళితులను, బీసీలను, ఆదివాసీలను, మహిళలను ఐక్య పోరాటాల్లోకి తీసుకురావాలని సిద్ధాంతీకరించాడు. ఆచరణలో అలాంటి ఐక్య ఉద్యమాలకు ఊపిరి పోశాడు.[1]

జీవిత విశేషాలు మార్చు

ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో కుల నిర్మూలనా చైతన్యానికి నిలువెత్తు రూపాలైన గుండగాని సూరమ్మ, మారోజు రామలింగం దంపతులకు 1962 జనవరి 1 న జన్మించారు. చిన్ననాటి నుండి చదువులు, ఆటపాటలు, వక్తృత్వం, వ్యాసరచన మొదలైన కళా నైపుణ్యాలలో తన ప్రతిభాపాటవాలను కనబరిచేవాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు "అన్యాయం", "ఊరు తిరగబడింది" మొదలగు నాటికలను మండలంలోని గ్రామాలన్నింటా ప్రదర్శించి, ప్రజల మన్ననలను అందుకున్నారు. సూర్యాపేటలో ఇంటర్మీడియెట్‌ విద్య మొదటి సంవత్సరం, హైదరాబాద్‌ బడీచౌడి చైతన్య కళాశాలలో రెండవ సంవత్సరం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సైస్సు కళాశాల సైఫాబాద్‌లో బియ్యస్సీ డిగ్రీ చదివారు. 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ భూ భౌతిక శాస్త్రం అధ్యయనంలోకి ప్రవేశించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్‌సయూ) రాష్ట్ర అధ్యక్షునిగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపై విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. పీడీఎస్‌యూ వీరన్నగా వాసికెక్కారు. మారోజు వీరన్న సీపీఐ (ఎంఎల్‌) విమోచన పార్టీలో రాష్ట్ర నాయకుడుగా, సిద్ధాంతకర్తగా ఎదిగారు. తదనంతరం సీపీఐ (ఎంఎల్‌) జనశక్తిగా రూపాంతరం చెందిన పార్టీలో సిద్ధాంత పోరాటాన్ని కొనసాగించారు.

ఉద్యమాలలో మార్చు

ఆయన దళిత ఉద్యమాలు, మండల్ ఉద్యమం, తెలంగాణ సాధన ఉద్యమం లలో మమేకమైనారు. భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల సామాజిక తెలంగాణ ఏర్పాటుకు కార్యాచరణ చేశారు. మేమెంత మందిమో మాకంత వాటా కావాలని సామాజక, రాజకీయ పంపిణీ న్యాయ సూత్రంతో ముందుకురికారు. జనశక్తి పార్టీని దళిత బహుజన కమ్యూనిస్టు పార్టీగా పరివర్తన చెందించాలని ఆ పార్టీలో 1995 మే 17 నుంచి 1998 వరకు అంతర్గత పోరాటం చేశారు.[2]

భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలనే లక్ష్యం, నినాదంతో మారోజు వీరన్న తెలంగాణ మహాసభను స్థాపించారు. 1997 ఆగస్టు 11న సూర్యాపేట పట్టణంలో వేలాది మందితో తెలంగాణ రాష్ట్ర సదస్సు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమానికి ఆ రోజు మారోజు ఊపిరులూదారు. అణగారరిన కులాలు, జాతులు, తెగలను ఐక్యం చెయ్యడానికి దళిత బహుజన మహాసభ స్థాపించారు. ఐక్య రాజకీయ ఉద్యమాల నిర్వహణ కోసం మహాజన ఫ్రంట్‌ను రూపొందించారు. విద్యార్థులను బహుజన రాజ్య నిర్మాణానికి కార్యోన్ముఖులను గావించడానికి 1998 ఆగస్టు 18న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎ్‌సఎఫ్‌) స్థాపించారు. చారిత్రక అస్తిత్వ ఉద్యమమైన మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (మాదిగ హక్కు దండోరా) ఉద్యమ ప్రభావం వీరన్నపై ప్రగాఢంగా ఉంది. దీంతో అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలను విడి విడిగా సంఘటితం చేయడానికి మారోజు వీరన్న అనేక అణగారిన కులాలకు సంఘాలను వ్యవస్థాపించారు.[2]

మరణం మార్చు

ఆయన 1999, మే 16 న మరణించారు.

మూలాలు మార్చు

  1. "అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న". Archived from the original on 2014-05-16. Retrieved 2016-05-15.
  2. 2.0 2.1 "బహుజన విప్లవాదర్శ వైతాళికుడు". కృపాకర్‌ మాదిగ. andhrajyothy. 2016-05-15.

ఇతర లింకులు మార్చు