మృదుల సారాభాయ్

భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారిణి, రాజకీయవేత్త

మృదుల సారాభాయ్ (6 మే 1911 - 26 అక్టోబరు 1974) గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, గాంధేయవాది.[1] ఈమే అహ్మదాబాద్‌లోని సారాభాయ్ పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందినది.

మృదుల సారాభాయ్
జననం(1911-05-06)1911 మే 6
మరణం1974 అక్టోబరు 26(1974-10-26) (వయసు 63)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు,

తొలి జీవితం మార్చు

మృదుల 1911, మే 6న గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌ నగరంలోని ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించింది.[2] అంబాలాల్ సారాభాయ్ - సరళా దేవి దంపతులకు ఎనిమిది మంది పిల్లలలో ఒకరైన మృదుల విక్రమ్ సారాభాయ్కి సోదరి.[3] తల్లిదండ్రుల పర్యవేక్షణలో బ్రిటీష్, భారతీయ ఉపాధ్యాయుల సమక్షంలో ఇంటిలోనే తన చదువును కొనసాగించింది. కళాశాల చదువు కోసం 1928లో గుజరాత్ విద్యాపీఠంలో చేరింది.[4] గాంధీజీ నేతృత్వంలో సాగిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొనేందుకు 1929లో తన చదువును మానేసింది. విదేశీ వస్తువులు, సంస్థలను బహిష్కరించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపును పాటించడంతోపాటు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి నిరాకరించింది.

కాంగ్రెస్ మహిళ, స్వాతంత్ర్య సమరయోధురాలు మార్చు

మహాత్మా గాంధీ ప్రభావంలో భారత స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన మృదుల పదేళ్ళ వయసులోనే కాంగ్రెస్‌కు చెందిన వానర సేన ("మంకీ ఆర్మీ" - ఇందిరా గాంధీ నిర్వహించిన బాల కార్యకర్తల బృందం)తో కలిసి పనిచేసింది. ఆ సమయంలోనే స్వాతంత్రోద్యమకారులకు సందేశాలు, త్రాగునీటిని అందించింది. జవహర్‌లాల్ నెహ్రూచే ప్రభావితురాలై జీవితకాల స్నేహితురాలుగా, మార్గదర్శకులుగా మారింది. 1927లో రాజ్‌కోట్‌లో యూత్ కాన్ఫరెన్స్ నిర్వహణలో సహాయం చేసింది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో కాంగ్రెస్ సేవాదళ్‌లో చేరి, విదేశీ వస్త్రాలు-బ్రిటిష్ వస్తువులను బహిష్కరించింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారు ఆమెను జైలులో పెట్టారు.[5]

1934లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి గుజరాత్ నుంచి ప్రతినిధిగా మృదుల ఎన్నికయింది. తరువాతి సంవత్సరాల్లో స్వతంత్ర వైఖరి రాష్ట్రానికి చెందిన ఇతర నాయకులతో గొడవల కారణంగా పార్టీ మృదులను నామినేట్ చేయడానికి నిరాకరించడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

కాంగ్రెస్ మహిళా విభాగానికి నాయకత్వం వహించడంతోపాటు, కాంగ్రెస్ సంస్థాగత యంత్రాంగంలో ముఖ్యమైన పాత్రను కూడా పోషించింది. నేషనల్ ప్లానింగ్ బోర్డు కోసం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రపై సబ్ కమిటీ కార్యదర్శిగా నియమించబడింది. ఈ నివేదికను రాజ్యాంగ ముసాయిదా, మొదటి కొన్ని బడ్జెట్ల సమయంలో తొలి శాసనసభ్యులు ఉపయోగించారు.

1946లో, పండిట్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా మృదులను నియమించాడు. అల్లర్లు చెలరేగినప్పుడు రాజీనామా చేసి గాంధీజీతోపాటు నోఖాలి వరకు వెళ్ళింది. భారతదేశ విభజన సమయంలో మత సామరస్యం, సామరస్య పునరుద్ధరణలో చురుకైన నాయకత్వం వహించింది. 1947, ఆగస్టు 15న మొదటగా పాట్నాలో గాంధీజీ అనుమతితో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయింది. పంజాబ్‌లో అల్లర్లు జరిగినపుడు నెహ్రూను సంప్రదించి శాంతి పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించేందుకు అక్కడికి వెళ్ళింది.[3]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తి చెంది కాశ్మీర్ వెలుపల షేక్ అబ్దుల్లాకు మద్దతుదారుగా మారింది.[3] కాశ్మీర్ కుట్ర కేసులో అబ్దుల్లా జైలు పాలైనందుకు అతని ఖర్చులకు కావలసిన నిధులను కూడా సమకూర్చింది.[6] కాశ్మీర్ కేసులో విచారణ లేకుండానే అనేక నెలలపాటు జైలుశిక్షను అనుభవించింది. అయినప్పటికీ, మృదులపై ఎప్పుడూ కుట్ర అభియోగాలు మోపబడలేదు.[7]

మరణం మార్చు

మృదుల 1974, అక్టోబరు 26న మరణించింది.

మూలాలు మార్చు

  1. "Mridula Sarabhai". Azadi Ka Amrit Mahotsav, Ministry of Culture, Government of India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-13.
  2. "Not a woman you could cross | Women | Articles on and by Mahatma Gandhi". www.mkgandhi.org (in ఇంగ్లీష్). Retrieved 2021-11-13.
  3. 3.0 3.1 3.2 Rebel With A Cause
  4. Mankekar, Kamla (2002). Women pioneers in India's renaissance, as I remember her: contributions from eminent women of present-day India. New Delhi: National Book Trust, India. pp. 341–342. ISBN 978-81-237-3766-9.
  5. Mahatma Gandhi: Salt satyagraha: the watershed by Navjivan Publications, 1995:pp 263-On 9 April in Ahmedabad Khurshedbehn Naoroji and Mridula Sarabhai were arrested for selling contraband salt.
  6. he Sheikh's expenses were met by his woman friend, Mridulla Sarabai, who was the daughter of the owner of the Bombay-based famous industry "Sarabai Chemicals". Archived 18 సెప్టెంబరు 2011 at the Wayback Machine
  7. [1] India, Pakistan and the secret jihad: the covert war in Kashmir, 1947-2004 By Praveen Swami

గ్రంథాలు మార్చు