తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయపల్లె గ్రామ సమీపమున ఓబులేశుని కోన వెలయుటకు కారణభూతమైన చరిత్ర వివరము 1470వ సంవత్సరమునకు పూర్వము అప్పుడు ఆ రోజులలో కాలినడకన అహోబిల క్షేత్రమునకు ఈ మార్గములో ప్రయాణము సాగించెడివారు. ఒకరోజున భక్తజన సమూహము కోలాహలముగా భజనలు చేసుకుంటూ శ్రీ అహోబిల శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి కళ్యాణము (తిరుణాల) తిలకించుటకు పోవుచుండగా ప్రస్తుతము ఓబులేశు కోన క్షేత్రము ఆ రోజులలో దట్టమైన అడవి మార్గంగా ఉండెడిది. ఈ భక్తులందరూ అక్కడికి చేరుకున్నప్పుదు వారిలో ఒకామె నిండు చూలాలు మాత్రము ప్రయాసపడుతూ నరసింహస్వామి జపము చేసుకుంటూ, స్వామీ! నీదర్శనార్థమై వచ్చినాను.నీవద్దకు వచ్చుటకు నాకు శక్తిలేదు,నీ దివ్యమంగళరూపము దర్శించు భాగ్యము ప్రసాదించమని వేడుకొనగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు ఆమెకు ప్రత్యక్షమై "ఓ భక్తురాలా! భయము వలదు, నీకు ప్రసవము సులభముగా జరుగును. నేను ఇక్కడనే శిలా రూపముదాల్చి భక్తుల కోర్కెలు తీర్చుచుందును" అని చెప్పి అంతర్థానమాయెను. మూర్చిల్లిన భక్తులందరూ తేరుకొన్నారు. జరిగిన విషయము ఆమె అందరికీ వివరించింది. తర్వాత భక్తులందరూ కలిసి శ్రీ పెమ్మసాని తిమ్మనాయుడిని కలిసి వారికి జరిగిన వృత్తాంతము తెలియజేసినారు. ఆయన వెనువెంటనే ఆశిలా రూపమునకు ఆలయము నిర్మించి ఓబులేశు కోనశ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయముగా నామకరణము జరిపెను.

ఈ చరిత్ర అంతయూ తాడిపత్రి కైఫీయత్‍లో బ్రిటిష్‍వారు పొందుపరచారు.