జహంగీర్ పీర్ దర్గా

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా, రంగారెడ్డి జిల్లా, కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉంది, ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయనాయకులు సైతం కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు.

జహంగీర్ పీర్ దర్గా

దర్గా చరిత్ర మార్చు

దర్గా చరిత్ర తెలిపే కచ్చితమైన రుజువులు లేకపోయినా అరబ్బీ భాషలో రచించిన ఒక గ్రంథం ద్వారా జహంగీర్ పీర్ దర్గా గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.. సుమారు 700 సం.ల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినొద్దీన్, బురానొద్దిన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చి కొంత కాలం తరువాత మరణించినారని చెబుతారు. వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా వాడుకలో కొచ్చిందని నమ్ముతారు. 400 సం.ల క్రితం గోలుకొండ కోటపై విజయం సాధించిన రాజులు తరువాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి. దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరైన సయ్యద్ ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడుగా నియమించి, 4 పరగణాలకు ఖాజీగా కూడా నియుక్తులను చేసారు. 1948 సం. వరకు ఇబ్రాహిం అలీ వారసులు సంరక్షించే వారు. ఆ తరువాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆదీనంలోకి ఈ దర్గా వచ్చింది[1].

ఐతిహ్యం మార్చు

ఈ దర్గా ప్రాంతం పూర్వం అడవిలా ఉండేదని, రాత్రివేళల్లో దర్గా దరిదాపుల్లో ఎవరు సంచరించేవారు కాదని, దర్గాలో రాత్రివేళల్లో సింహాలు సంచరించేవని, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవని ఇక్కడి జానపదుల కథనాలు.

ఉత్సవాలు మార్చు

ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి పర్వదినాలలో 3 రోజుల పాటు దర్గాలో ఉర్సు ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని ముస్లిమ్‌లే కాకుండా విదేశాలలో ఉండేవారు సైతం వస్తుంటారు. ముఖ్యంగా అరబ్బుదేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే ముస్లిమ్‌లు ఇక్కడ తప్పకుండా ప్రార్థనలు చేసి వెళ్తుంటారు.

మతసామరస్య ప్రతీక మార్చు

ఈ దర్గా మతసామరస్యానికి ఓ గొప్ప ప్రతీక. ఇక్కడికి ముస్లిమ్‌లు, హిందువులతో పాటు సిక్కులు కూడా వచ్చి కొలుస్తుంటారు. సమీప ప్రాంతాలలోని లంబాడ కుటుంబాలు కూడా ఎడ్లబండ్లపై ప్రత్యేకంగా వచ్చి కందురులు చేస్తుంటారు, ఈ ప్రాంతంలో సంపన్న కుటుంబాలకు చెందినవారు ఏ మతానికి చెందినవారైనా తమ ఇంటి దేవుడిగా కొలుస్తుంటారు.

రవాణా మార్గం మార్చు

తెలంగాణ రాష్ట్ర రాజదానికి 45 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఇక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది. ముఖ్యంగా ప్రతి ఆది, గురువారాలలో ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. ఆటోలు, జీపులు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 73

వెలుపలి లంకెలు మార్చు