జి.ఎ. వడివేలు

భారతీయ స్వాతంత్ర ఉద్యమకారుడు

జి.ఎ. వడివేలు (1925 జూన్ 12 - 2016 జనవరి 13) తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు. మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రాజాజీ, కామరాజ్‌ల సన్నిహిత సహచరుడు. [1] [2] [3]

జి.ఎ. వడివేలు
జననం
గొల్లహళ్ళి ఎ. వడివేలు

(1925-06-12)1925 జూన్ 12
గొల్లహళ్ళి, ధర్మపురి జిల్లా, తమిళనాడు
మరణం2016 జనవరి 13(2016-01-13) (వయసు 90)
సేలం

తొలి జీవితం మార్చు

తమిళనాడులోని ధర్మపురిలోని గొల్లహళ్లిలో జన్మించిన వడివేలు, ధర్మపురి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం కోసం చదువు మానేసాడు. 15 సంవత్సరాల వయస్సులో కాంగ్రెస్‌లో చేరాడు. 1940 వ్యక్తిగత సత్యాగ్రహం లోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని పాలయంకోట్టై జైలులో శిక్ష అనుభవించాడు. అతను అనారోగ్యంతో తమిళనాడులోని సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2016 జనవరి 13 న 90 సంవత్సరాల వయస్సులో మరణించాడు [4]

1940ల చివరలో మార్చు

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినా, పాండిచ్చేరికి విముక్తి లభించలేదు. అతడు పాండిచ్చేరి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. పాండిచ్చేరిలో ఉండగా, అతను సముదాయం అనే పత్రికను నడిపాడు. అణగారిన వర్గాలకు సేవ చేసేందుకు జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెస్‌లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వడివేలు జయప్రకాష్‌తో కలిసి సోషలిస్ట్ గ్రూపులో క్రియాశీల సభ్యుడిగా మారారు.

స్వాతంత్ర్యం తరువాత మార్చు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పేదవారికి సేవ చేసేందుకు 1948లో జయప్రకాష్ కాంగ్రెస్‌ను వీడి సోషలిస్టు పార్టీని స్థాపించాడు. వడివేలు అతన్ని అనుసరించి, అణగారిన వర్గాల కోసం పోరాడాడు. స్వేచ్ఛా భారతదేశంలో 17 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆయన అలుపెరగని కృషి, పోరాటాల కారణంగా సేలం, ధర్మపురి, మదురై జిల్లాల్లో దాదాపు 2,000 మంది భూమిలేని రైతులు అటవీ భూములు, రెవెన్యూ భూములను పొందారు. ధర్మపురిలో దాదాపు 1800 మంది గుడిసెవాసులు రైల్వే భూముల్లో ఇళ్ల స్థలాలు పొందారు. అప్పటి రైల్వే మంత్రి మధు దండావతే ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వడివేలు అవిశ్రాంత కృషిని ప్రశంసించాడు. "భారతదేశంలో పేదలకు రైల్వే భూములను ఉచితంగా అందించిన ఏకైక వ్యక్తి వడివేలు" అని అన్నాడు. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆయనను జైల్లో పెట్టారు, రోజుల తరబడి చేతులకు సంకెళ్లు వేసారు, వీధుల్లో ఊరేగించారు. చెన్నైలో రైల్వే శాఖ మెట్రో లైన్ పనులను ప్రారంభించింది. ఇది కొనసాగితే దాదాపు 12 వేల పేద కుటుంబాలు వీధినపడేవి. వడివేలు వారి కోసం పోరాడి 12,000 పేద కుటుంబాలను రక్షించే రైల్వే లైన్‌ను మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. మాటల్లో, చేతల్లో ఆయన సోషలిస్టు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ, చురుగ్గా, గాంధేయవాదిగా, 86 ఏళ్లు వచ్చినా, ఎంతో చురుగ్గా ప్రజలకు సేవ చేసాడు. ప్రజా సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదేళ్లు తమిళనాడు జనతాదళ్ అధ్యక్షుడిగా, రెండేళ్లు జాతీయ జనతాదళ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. 54 ఏళ్ల తర్వాత 2002లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాడు. AICC సభ్యుడుగా, TNCC కార్యవర్గ సభ్యుడుగా, దాని సమన్వయ కమిటీ సభ్యుడుగా పనిచేసాడు.

రచయితగా, పాత్రికేయుడిగా మార్చు

రాజకీయ కార్యకర్త గానే కాకుండా, అతను పాత్రికేయుడు, రచయితగా కూడా రాణించాడు. జనతా, సముదాయం, పుదు వజ్వు పత్రికలకు చాలా సంవత్సరాల పాటు సంపాదకుడుగా పనిచేసాడు. అతని వ్యాసాలు పురచ్చి, తమిళనాడు, మంజరి, ద్రవిడ నాడు, భారత దేవి, సంగోలి, మాలై, మురసు, త్యాగి, దినమణి, దినమలర్ వంటి వివిధ పత్రికలలో ప్రచురిత మయ్యాయి. రచయితగా, అతను సుమారు 30 పుస్తకాలను రచించాడు, వాటిలో చారిత్రక నవల సెంబియార్ తిలగం (1200 పేజీలు) ఒకటి. ఈ పుస్తకం 1985, 1986 సంవత్సరాలకు ఉత్తమ పుస్తకంగా పురస్కారం పొందింది. తమిళనాడు చరిత్రను ఎన్నో ఏళ్లుగా పరిశోధించి 300 ఏళ్ల కాలప్రాళుల చీకటి పాలనను వెలుగులోకి తెచ్చాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఈ పుస్తకాన్ని ప్రశంసించాడు.

మూలాలు మార్చు

  1. Sembiyar Thilagam Novel Published in the year 1985
  2. Dhina Malar article published on 5-5-2002
  3. "Archived copy". Archived from the original on 29 September 2011. Retrieved 19 January 2011.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Staff Reporter. "Former JD(S) State president Vadivelu dead". The Hindu.