వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం

శ్రీవేంకటేశ్వరుడు (తిరువేంగడ ముడయాన్) -అలర్‌మేల్ మంగై తాయార్ (పద్మావతి) -స్వామిపుష్కరిణి మున్నగు పలుతీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-ఆనందనిలయ విమానము-తొండమాన్ చక్రవర్తి మున్నగువారికి ప్రత్యక్షము-తొండరడిప్పొడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్లు ఆండాళ్ కీర్తించిన స్థలము.

విశేషాలు మార్చు

"కలౌవేంకటనాయక:" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము.వడవానై (ఉత్తరదిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము. "వడక్కుత్తిరుమలై" యని (వడ తిరువేంగడం) "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు" అని సాంప్రదాయక తిరునామములు గలవు. ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము ఉంది. అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.

అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.

సాహిత్యం మార్చు

శ్లో. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:
 శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే
 తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:
 దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్‌||
 శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్‌|
 ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||

 మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌
 స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.

శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు

 "శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
 రమయా రమమాణాయ వేజ్కటేశాయ మంగళమ్‌"

("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.

 "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
 ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"

అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.

స్వామి వేంచేసియున్న ఈ వేంకటాద్రి శ్రీవైకుంఠము నుండి గరుడాళ్వార్లచే భూమికి తీసికొని రాబడింది. కావున వైకుంఠాద్రి యనియు, ఆదిశేషావతారమై, శేషాకారముగా నుండుటచే శేషాద్రియని, గరుడాళ్వార్ తీసికొని వచ్చుటచే గరుడాద్రియని; పేరువచ్చింది. ఈ వేంకటాచలమునకు

 "అంజనాద్రి: వృషాద్రిశ్చ శేషాద్రి: గరుడాచల:
 తీర్థాద్రి: శ్రీ నివాసాద్రి: చిన్తామణి గిరిస్తథా
 వృషభాద్రి: వరాహాద్రి: జ్ఞానాద్రి: కనకాచల:
 ఆనన్దాద్రిశ్చ నీలాద్రి: సుమేరు శిఖరాచల:

వైకుంఠాద్రి:పుష్కరాద్రి మార్చు

"ఇతినామాని నింశతి:"|| యని యిరువది పేర్లు ఉన్నాయి. ఏమైనను

"వేజ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేజ్కటేశ నమోదేవో సభూతో సభవిష్యతి" యని భక్తులచే సేవింపబడు చున్నదీ క్షేత్రము.

భోగమంటపాదులుగా ప్రసిద్దములైన క్షేత్రములలో తిరుమలై పుష్పమండపము మిగిలినవి శ్రీరంగము (భోగమండపము) కాంచీపురము (త్యాగ మండపము)

 దివ్యదేశము______మండపము__________మంత్రము________ప్రమాత
 శ్రీరంగము_______భోగమండపము_______తిరుమంత్రము______తిరుప్పాణన్
 కాంచీపురము____త్యాగమండపము_______ద్వయము________తిరుకచ్చినంబి
 తిరుమలై______పుష్పమండపము______చరమశ్లోకము____కురుంబరుత్తనంబి
అని ఆళవందారుల శ్రీసూక్తి.

"నమ్మాళ్వార్ ఈక్షేత్రమును "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు (భూలోక వాసులకును పరమపద వాసులకును సమానుడు)" అని అబివర్ణించియున్నారు. (కణ్ణావా నెన్ఱుమ్‌ మణ్ణోర్ విణ్ణోర్‌కు" తి.వా.మొ 1-8-3) తిరుమంగై యాళ్వార్ "వడవానై" (ఉత్తర దిశాదిగ్గజము తిరునెడున్దాణ్డగమ్‌ 10) అనిస్తోత్రము చేసియున్నారు. ఈక్షేత్రమునకు "వడక్కుత్తిరుమలై" యని సంప్రదాయక తిరునామము. తెఱ్కుత్తిరుమలై తిరుమాలిరుంజోలమలై.

ఆళ్వార్ల కీర్తనలలో తిరుమల మార్చు

తొలుత దేశభాషయైన తమిళభాషలో తిరుమలేశుని కీర్తించి ఆతని మహిమను లోకమున చాటిచెప్పినవారు ఆళ్వార్లు. "వడతిరు వేజ్గడమ్‌; తిరుమలై" అని వారు ఈ పర్వతరాజమును కీర్తించారు. ఇచటి స్వామిని "తిరువేంగడత్తాన్; తిరువేంగడముడైయాన్; అలర్‌మేల్ మంగై యుఱై మార్పన్"అని ప్రస్తుతించారు.

భగవన్తుడు వేంచేసియుండు దివ్యదేశముల కన్నింటికి "తిరుప్పది" అనియే పేరు "పది" అనగా స్థానము అని అర్దము. 108 తిరుప్పదులు ఆళ్వార్లచే కీర్తింపబడినవి. అవి అన్నియు తిరుప్పదులే. కానీ కాలక్రమంలో "తిరుప్పది" అనుపేరు. ఈక్షేత్రమునకు మాత్రమే వాచకంగా రూడమైనది. "తిరుప్పది"యే తిరుపతిగా మారినది. "తిరుమాల్ అనగా శ్రియ:పతి. ఆయనకు నిత్యనివాసస్థానమైన తిరుమలై తమిళదేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా "తొల్‌కాప్పియం" అను ప్రాచీన తమిళ గ్రంథమున పేర్కొనబడింది.

ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఈశ్రీనివాసుని పాదారవిందముల యందే "అలర్‌మేల్ మంగై యుఱైమార్పా....పుగలొ న్ఱిల్లా నడియేన్ ఉన్నడి క్కీళ అమర్‌న్దు పుకున్దేనే" అంటూ పిరాట్టిని (లక్ష్మీదేవిని) పురుషాకారంగా చేసికొని శరణాగతి చేసారు. మఱియు "అలర్‌మేల్ మంగై యుఱైమార్పా" అని ప్రస్తుతించి లక్ష్మీ పతిత్వమును ప్రకటించారు.

, "ఒళవిల్ కాలమెల్లామ్‌" అను దశకమున సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును ఈస్వామి తిరువడి ఘుళ్ళలో (శ్రీపాదములయందు) కైంకర్యము చేయుటచే పరమ పురుషార్థమని ప్రవచించారు. అంతేకాక ఈ దశకములోనే "ఎజ్గళ్‌పాశంవైత్త" అను చోట స్వామియొక్క వాత్సల్యగుణమును ప్రకాశింపచేసారు.

శ్రీగోదాదేవి తమ నాచ్చియార్ తిరుమొళిలో "విణ్ణీలమేలాప్పు" అను దశకమున ఈస్వామివార్కి మేఘములద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇట్లే ప్రథమ దశకములో "వేంగడవఱ్కెన్నై విదిక్కిత్తియే" అంటూ "మన్మథా! నన్ను వేజ్కటాచలపతితో కలసపూ" అని ప్రాదేయ పడతారు.

ఈస్వామిమ్రోల "వడియాయ్ కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే" కడపరాయిగా పడియుండి స్వామి దివ్యాధరమును సర్వదా సేవించు చుందును గాక! అని శ్రీకులశేఖరాళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమొళిలోని ఊనేఱశెల్వత్తు అను దశకములో ప్రార్థిస్తారు. కావుననే ఇచట గర్భ గృహద్వారమున గల గడపకు "కులశేఖరపడి" అని పేరు. "మన్దిపాయ్ వడవేంగడమామలై;వానవర్ శన్దిశెయ్య నిన్ఱాన్" అంటూ తిరుప్పాణి ఆళ్వార్ జ్ఞానులు అజ్ఞానులు అనుభేదం లేక ఊర్ధ్వలోక వాసులు భూలోకవాసులు సేవించునట్లు దయార్ద్రహృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసియున్నాడు అని అభివర్ణించిరి.

తిరుమంగై ఆళ్వార్లును "తిరువేంగడ ముడై నెంజమే" ఓ మనస్సా ! తిరువేంగడమును ఆశ్రయింపుమని భావించి; "నాయేన్ వన్దడైన్దేన్ నల్గియాళైన్నై క్కొణ్డరుళే" అంతట సంచరించి అన్నిబాధలను అనుభవించి అగతికుడనై నిహీన జంతువువలె నీసన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించితిని. ఆదరముతో నన్ను అనుగ్రహింపుము అని దీనంగా ప్రార్దిస్తారు. (పెరియతిరుమొళి)

ఆచార్యుల అనుభవాలలో తిరుమల మార్చు

 
తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయం ప్రక్కనున్నపుష్కరిణి /కోనేరు

భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు (రామానుజాచార్యుడు) తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు. ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు. కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడా పితామహుడై నారు)

 
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ప్రధాన ఆలయం ముందు భాగం

తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు. వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. ఆవనమునకు "రాషూనుశన్" అనిపేరు. వీరు ఆనాడు పెంచి పోషించిన నందనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది. వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్‌ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.

భగవద్రామానుజుల కైంకర్యములు మార్చు

భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు. అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి. వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు. ఈ సమయంలో పిరాట్టి ప్రీతికొఱకు నాచ్చియార్ తిరుమొழிని అనుసంధింతురు.

పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచానూరు" (తిరుచ్చుగనూరు) లో జరిగేవట-కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.

ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు. ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.

ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించారు. స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసారు.

ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల "అழగప్పిరానార్" అను బావియందు ప్రవేశించినారట.

శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల "అழగప్పిరానార్" అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. ఈ బావికి "అழగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.

ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట. ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.

మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట. ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట. ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.

స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా సేవ సాయించేవారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట. ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.

శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై ఆదివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.

అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. ఆ కారణంగానే "కజ్గులుమ్‌ పగలుమ్" అను శ్రీరంగనాథుని గూర్చి యుండు దశకము (తిరువాయిమొழி 7-2) ఇక్కడ అనుసంధింపబడు చున్నది.

ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అழగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.

ఈసన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్ష్ముణులతో సేవ సాయించుచున్నారు. ఇందుకు కారణమేమనగా;

దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమునకు "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని (విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది. ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట. ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడా వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలై లోని తిరువేంగడముడై యాన్ సన్నిధిలో వేంచేసింప చేసారు. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.

ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధికై కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించారు. ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు చేయబడుచున్నది.

ఇట్లే "తిరుక్కురువై" అనే గ్రామంలో "కురువైనంబి" అనుకుమ్మరి శ్రీవేజ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు. అతడు పరమపదించు సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆ భక్తునకు దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట. ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆగ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదుల లేక సహజరూపంలో ఉండు శ్రీవేజ్కటాచలపతిని, ఆప్రక్కనే "కురువైనంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.

శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట. ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట. మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామి పాదములు దర్శనమిచ్చినవి. శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్భుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడా అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించారు.

మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము మార్చు

శ్రీమతి మహతిద్వారే చి-- కా--స మయం చ బలిపీఠమ్‌
స్థాన మథ యామునేయం చన్పుకతరు సమ్పదం ప్రతీహారమ్‌
వినతా తనయ మహానస మణి మణ్డపం కనక మయ విమానపరమ్‌
పృతనాపతి యతిధుర్యౌ నరహరి మథ సమత జానకీ జానిమ్‌||
అథపునరసఘ మణిద్యుతి కవచిత కమలా నివాసభుజ మధ్యమ్‌|
కలయత కమల విలోచన మంజనగిరి నిధి మనంజనం పురుషమ్‌||

సంపత్కరమైన గోపుర ద్వారమును; అత్తాళిప్పుళిని (చింతచెట్టు) బంగారు బలిపీఠము; యమునై త్తుఱైవర్ అనుపుష్పమండపమును; సంపంగి చెట్లతో నిండిన ప్రాకారమును, గరుడాళ్వార్లను; తిరుమడప్పళ్లిని (వంటశాల) తిరుమామణి మండపమును; స్వర్ణమయమైన ఆనందనిలయ విమానమును; సేనమొదలియాళ్వార్లను; యెంబెరుమానార్లను; నరసింహస్వామిని శ్రీరామచంద్రులను సేవించిరి. అటపిమ్మట ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్యనివాసమైన వక్షస్థలము గలవాడను, అంజనాద్రికి నిధి వంటివాడును; అఖిలహేయ ప్రత్యనీకుడును; పరమపురుషుడునగు శ్రీనివాసుని కనులార సేవించిరి.

(PFS125)తిరుమలలో అధ్యయన ఉత్సవమ్‌

తిరుమలైలో అద్యయనోత్సవములు ఇయఱ్పాతో ప్రారంభమై 23 దినములు నాలాయిరం సేవతో పూర్తి అవుతాయి. ఆపైన ఒక్కరోజు వరాహప్పెరుమాళ్ సన్నిధిలో అధ్యయనోత్సవం జరుగును. అద్యయనోత్సవ శాత్తుముఱై రోజున తిరుమామణి మణ్డపంలో తిరువాయిమొழி శాత్తుముఱై పూర్తి అయి తీర్థ ప్రసాద గోష్ఠి అవడంతోనే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తిరువేంగడముడైయాన్ సన్నిధికి వేంచేసి పెరుమాళ్ల యెదుట "వెన్ఱుమాలై యిట్టాన్" మండపంలో ఉండగా జీయంగార్లు, ఆచార్యపురుషులు తిరుప్పల్లాండులోని రెండు పాశురములను "ఒழிవిల్ కాలమెల్లాం, ఉలగముణ్డ పెరువాయా, తాయే తన్దైయెన్ఱుమ్‌. అనేపాశురాలను "అఖిల భువన జన్మ స్థేమ" ఇత్యాది శ్లోకాన్ని శరణాగతి గద్యంలోని పూర్వ ఖండాన్ని అనుసందానం చేస్తారు. అంతట భగవద్రామానుజులకు శ్రీనివాసుని పుష్పమాలా శఠగోపాదులతో మర్యాదలు జరుగును. ఆపైన తిరిగి పై పాశురములను అనుసందింతురు. ఇట్లు మంగళాశాసన కార్యక్రమం పూర్తికాగానే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తమ సన్నిధికి వేంచేయుదురు.

"చివరి రోజున తణ్ణీరముదువళి తిరుత్తుణై" అను ఉత్సవం జరుగును. ఆరోజు భగవద్రామానుజులు పాపవినాశం వేంచేసి తీర్థ తీసికొనిరాగా ఆతీర్థంతో పెరుమాళ్లకు తిరుమంజనం జరుగుతుంది. ఇది పెరియ తిరుమలనంబిగారి కైంకర్యానికి స్మారకము.

ఆపైన తిరుపతిలో గోవిందరాజ స్వామిసన్నిధిలో అధ్యయనోత్సవములు జరుగును. చివర రోజున నమ్మాళ్వార్లకు పరమ పదోత్సవం జరుపబడుతుంది. ఈ అధ్యయనోత్సవములు పూర్తి అయిన తరువాతనే తిరుమల తిరుపతులలోని సన్నిధులలోను, ఆచార్య పురుషుల తిరుమాళిగలలోను దివ్యప్రబంధాను సన్థానం ప్రారంభమగును.

తిరుమల తిరుపతులలోని క్షేత్రములు మార్చు

 
పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన గోపురము, తిరుచానూరు

దిగువతిరుపతిలో గోవిందరాజస్వామి సన్నిధి, చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాములవారి) సన్నిధి ప్రముఖముగా తప్పక సేవింపవలసినవి. ఈ సన్నిధులలో గల ఆళ్వారాచార్యుల సన్నిధులును తప్పక సేవింపవలెను. ఈమధ్యే తిరుమల తిరుపతి దేవస్థానముల దర్మాధికారులైన (శిరియకేళ్వి) శ్రీమత్ప్రరమహంస పరివ్రాజకాచార్యేత్యాది శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి నిర్మించిన సన్నిధియు, యాత్రికులకు అవశ్యము దర్శనీయమై యున్నది. ఈసన్నిధిలో వేంచేసియున్న శ్రీసుదర్శన నారసింహమూర్తి భక్తుల పాలిట కల్పవృక్షము.

 
పద్మావతి అమ్మవారి కోనేరు, తిరుచానూరు

తిరుచానూరు (అలమేలు మంగాపురం) లోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయము తప్పక సేవింపదగినది. యాత్రికులు తొలుత శ్రీపద్మావతీ అమ్మవారిని సేవించి ఆపై తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించడం సంప్రదాయం.

తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు మార్చు

భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్దసంగ్రహమును ఉపన్యసించారు.

అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే
విసత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే
శ్రుతి శిరసి విదిప్తే బ్రహ్మణి శ్రీనివాసే
భవతు మమ నరస్మిన్ శేముషీ భక్తిరూపా||

అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈఆలయప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చు చున్నది. ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు. వీరు శ్రీవేంకటాచలాదీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!

ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్దులైన శ్రీవేదాన్త దేశికులవారి "దయాశతకమ్" అగ్రగణ్యమైనది.తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకును కరుణైక పాత్రమ్‌" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళ మహామునుల అష్టదిగ్గజములలో నొకరైన "శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామిని గూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించారు. ఇవినేడును అనుదినం ఉష:కాల సేవలో స్వామియొద్ద అనుసంధింపబడును బహుళప్రచారం పొందియున్నవి.

శ్రీగోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు. శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీశ్రీశ్రీ పరకాల మఠం జీయర్‌స్వామివారు (మైసూర్) "అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీశ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు. పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు. తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి.దేవస్థానం వారు స్వర పరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించారు. పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించారు.

మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయేగాక స్వామి మహిమలను ప్రత్యక్షముగా నిరూపించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి సేవలు మార్చు

శ్రీవేంకటాచలపతి యావద్భారతమున ఆరాధింపబడు దేవాధిదేవుడు. కావుననే

 "వేజ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
 వేజ్కటేశ నమో దేవో నభూతో నభవిష్యతి||
అని ప్రస్తుతించారు మన పెద్దలు.

అట్టి ఈక్షేత్రాన్ని నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గమువారు అధికారులు అనన్యాదృశమైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. నానాటికి యాత్రికుల రద్దీ పెరుగుతుండడంతో అధునిక సౌకర్యాలతో, అనేక సత్రములను కాటేజీలను, కల్యాణ కట్టలను ఉచిత భోజనశాలలను, ప్రసాద వినియోగములను; ఉచిత వైద్యశాలలను, ఉపన్యాస వేదికలను, క్యూ కాంప్లెక్సులను, వానిలో టీవీల ద్వారా సన్నిధి కార్యక్రమాలను మున్నగు వానిని ఏర్పాటుచేసి చక్కగా నిర్వహించుచున్నారు. నేడు తిరుమలయాత్ర పరమాహ్లాదకర యాత్రగా నున్నది. తిరుపతిలో తి.తి.దేవస్థానం వారు నిర్వహించుచున్న పురావస్తు ప్రదర్శనశాల; ఓరియంటల్ మానిస్క్రిప్టు లైబ్రరీ, ప్రాచీన ఓరయంటల్ కళాశాల, వేద ఆగమ, దివ్య ప్రబన్ద పాఠశాల, శిల్పసంగీత నృత్యకళాశాల, అనేక కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ప్రాచీన నవీన విజ్ఞాన వికాసములకు తోడ్పడుచున్నవి.

ఇట్లే వీరు నిర్వహించుచున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు; ఆళ్వార్ దివ్యప్రబన్ద ప్రాజెక్టు; భాగవత ప్రాజెక్టు; దార్మిక గ్రంథముల ముద్రణకు సహాయము మున్నగునవి బహుముఖములుగా ధర్మ ప్రచారమునకు తోడ్పడుచున్నవి. అనేక నగరములలో కల్యాణ మండపములు నిర్మించి శిథిలములైన దేవాలయములను జీర్ణోద్దరణగావించి ఆయాప్రాంత వాసులకు మహోపకారము చేస్తున్నారు.

"వృక్షోరక్షతి రక్షిత:" అనే నినాదంతో తిరుమల పరిసర ప్రాంతములను ఘనవన శ్యామలములను గావించుచున్నారు. వీరేర్పాటుచేసిన జంతువుల పార్కులు, అభయారణ్యములు, అనాథశరణాలయాలు మున్నగునవి జీవకారుణ్యానికి నిదర్శనం.

మార్గము: ఈ క్షేత్రమునకు భారతదేశపు నలుమూలలనుండి ప్రయాణ వసతి ఉంది. ఇంతటి ప్రయాణ సౌకర్యములు మరియే క్షేత్రమునకు లేవు.

తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి మార్చు

భక్తులారా ! భాగవతోత్తములారా!

శక్తి సామర్ద్యములు గల స్త్రీ పురుషులు ఆబాలగోపాలము గోవింద నామోచ్చారణం చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళండి అవసరమైతే తిరిగివచ్చేటప్పుడు బస్‌లో రావచ్చును.

స్నానంచేసి భారతీయ సంప్రదాయంప్రకారం శుచి శుభ్రములైన వస్త్రములను దరించి వారి వారి సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకొని (శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున ఊర్థ్వ పుండ్రమును ధరించుట (నామము) సంప్రదాయము) శ్రద్ధా భక్తులతో సేవించండి.

స్వామివారిని సేవింపనిదే భుజింపకండి. ఆలస్యమగు పక్షమున శక్తిలేనిచో పండ్లు పాలు వంటివి తగుమాత్రం తీసికొనండి. ద్వజస్తంభం వద్ద నమస్కరించి మనస్సులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవింద నామం జపిస్తూ లోనికి వెళ్ళండి. ప్రధాన ద్వారం దగ్గరకురాగానే గరుడాళ్వార్లకు నమస్కరించండి. ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతిని తీసికొని ఎదురుగాసేవ సాయించుచుండు స్వామివారి దివ్యమంగళ విగ్రహమును కండ్లు చెమర్చగా, శరీరం పులకరింపగా; గద్గదమగు కంఠముతో, పారవశ్యంతో దర్శించండి.

శ్రీవారి పాదారవిందములు; పీతాంబరం, శ్రీహస్తములు;వక్షస్థలమునగల శ్రీభూదేవులను శంఖచక్రములను, ముఖారవిందమును;రత్నఖచిత కిరీటమును దర్శించి తిరిగి పాదారవింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి ఈక్రింది శ్లోకాలను, పాశురాలను పఠించండి.

 పార్దాయ తత్సదృశ సారథినా త్వయైవ
 యౌదర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి
 భూయోపి మహ్య మిహతౌ కరర్శితౌతే
 శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

 వినావేంకటేశం ననాథో ననాథ:
 సదావేంకటేశం స్మరామి స్మరామి
 హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
 ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ.

ఈ శ్లోకాలను అనుసంథానం చేయండి.

దివ్యప్రబన్దం వచ్చినవారు "అగలిగిల్లేన్ ఇఱైయుమెన్ఱు" "తాయేతన్దై యెన్ఱుమ్‌" అనే పాశురాలను అనుసంధానం చేయండి.

దర్శన నియమాలు మార్చు

తిరిగివచ్చునప్పుడు స్వామికి వెన్నుచూపరాదు. ఈనియమాలను పాటించి ఈ చెప్పిన విధంగా స్వామిని దర్శిస్తే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున ప్రతియొక్కరు తిరుమల యాత్ర చేయండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి.

పా. ఉళన్ కణ్డాయ్ నన్నె-; ఉత్తమ నెన్ఱు
 ముళన్ కణ్డాయ్;ఉళ్ళువారుళ్ళ-త్తుళన్ కణ్డాయ్
 వెళ్ళత్తి మళ్ళానుమ్;వేజ్గడత్తు మేయానుమ్‌
 ఉళ్ళత్తి నుళ్ళా నెన్ఱోర్
 పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది 99
పా. మనత్తుళ్ళాన్;వేజ్గడత్తాన్ మాకడలాన్;మత్‌తుమ్‌
 నినైప్పరియ; నీళరజ్గత్తుళ్ళాన్-ఎనైప్పలరుం
 తేవాతిదేవ;నెనప్పడువాన్;మున్నొరునాళ్
 మావాయ్ పిళన్ద మకన్.
 పూదత్తాళ్వార్-ఇరణ్డాన్దిరువన్దాది 28
పా. ఇఱై యాయ్ నిఅనాకి;యెణ్డిశై యున్తానాయ్
 మఱై యాయ్; మఱై ప్పారుళాయ్ వానాయ్-పిఱై వాయ్‌న్ద
 వెళ్ళత్తురువి విళజ్గొలినీర్;వేజ్గడత్తాన్
 ఉళ్ళత్తి నుళ్ళే యుళన్.
 పేయాళ్వార్-మూన్ఱాన్దిరు వన్దాది 39
పా. కడైన్ద పాఱ్కడ్ఱ్కిడన్దు;కాలనేమియై క్కడిన్దు,
 ఉడైన్ద వాలి తన్దమక్కు;ఉదవవన్ది రామనాయ్,
 మిడైన్ద వేழ் మరజ్గళుమ్;అడజ్గవెయ్‌దు, వేజ్గడ
 మడైన్ద మాలపాదమే; అడైన్దు వాళుముయ్‌మినో.
  తిరుమழிశై ఆళ్వారు-తిరుచ్చన్ద విరుత్తమ్‌ 81
పా. అగలకిల్ఱే నిఱై యుమెన్ఱి అలర్ మేల్ మజ్గై యుఱై మార్‌పా;
 నిగరిల్ పుగழா యులగమూన్ఱుడై యా;యెన్నైయాళ్ వానే,
 నిగరిల మరర్ మునిక్కణజ్గళ్ విరుమ్బుమ్; తిరువేజ్గడత్తానే
 పుగలొళిన్ఱిల్లా వడియే; మన్నడిక్కీழ் అమర్‌న్దు పుగున్దేనే||
  నమ్మాళ్వార్లు-తిరువాయిమొழி 6-10-10
పా. శెడియాయ పల్ వినైగళ్ తీర్కుమ్‌ తిరుమాలే
 నెడియానే వేజ్గడవా విన్ కోయిలిన్ వాశల్
 అడియారుమ్‌ వానవరుమ్‌ అరమ్బైయరుమ్‌ కిడన్దియజ్గుమ్‌
 పడియాయ్ క్కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే
  కులశేఖరాళ్వార్లు-పెరుమాళ్ తిరుమొழி 4-9

పా. శెన్నియోజ్గు; తణ్ తిరువేజ్గడ ముడైయాయ్;ఉలకు
 తన్నై వాழనిన్ఱనమ్బీ!;తామోదరా! శదిరా!;
 ఎన్నైయు మెన్నుడైమై యైయు;మున్‌శక్కరప్పాఱి యుత్‌తిక్కొణ్డు;
 నిన్నరుళే పురున్దిరున్దేన్;ఇనియెన్? తిరుక్కుఱిప్పే.
  పెరియాళ్వార్లు-పెరియాళ్వార్ల తిరుమొழி 5-4-1
పా. విణ్ణీల మేలాప్పు;విరిత్తాఱ్పోల్ మేగజ్గాళ్;
 తెణ్ణీర్‌పాయ్ వేజ్గడత్తెన్; తిరుమాలుమ్‌ పోన్దానే;
 కణ్డీర్గళ్ ములైక్కువట్టిల్;తుళిశోర చ్చోర్వేనై
 పెణ్ణీర్మె యీడழிక్కు;మిదు తమక్కోర్ పెరుమైయే
  ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 8-1
పా. మన్దిపాయ్; వడవేజ్గడమామలై; వానవర్‌గళ్
 శన్ది శెయ్యనిన్ఱాన్;అరజ్గత్తరవినణై యాన్;
 అన్దిపోల్ విఱత్తాడై యుమ్‌; అదన్మేలయనై పెడైత్తదోరెழிల్
 ఉన్దిమేల దన్ఱో అడియే నుళ్ళత్తి న్నుయిరే.
  తిరుప్పాణి ఆళ్వార్లు-అమలనాదిపిరాన్ 3
పా. తాయే తన్దై యెన్ఱుమ్; తారమేక్కిళై మక్కళెన్ఱుమ్;
 నోయే పట్టొழிన్దే; నున్నై క్కాణ్బదోరాశై ఉఇనాల్;
 వేయేయ్ పూమ్బొழிల్ శూழ்; విరయార్ తిరువేజ్గడవా
 నాయేన్ వన్దడైన్దేన్; నల్గియాళెన్నై కొణ్డరుళే||
  తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-9-1


ప్రశమిత కలిదోషం ప్రాజ్యభోగానుబన్దాం
సముదితగుణజాతాం సమ్యగాచారయుక్తామ్‌,
శ్రితజన బహుమాన్యాం శ్రేయసీం వేంకటాద్రౌ
శ్రియముపచిను నిత్యం శ్రీనివాస త్వమేవ.

సమస్తజననీం వందే చైతన్య స్తన్యదాయినీమ్‌
శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణిమ్‌||

 "శ్రీమద్వేదాన్తదేశికులు"

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు