దుల్లా భట్టి పంజాబ్ ప్రాంతానికి చెందిన 16వ శతాబ్దపు విప్లవ కారుడు. ఇతన్ని పంజాబ్ రాబిన్ హుడ్ అని కూడా పిలుస్తారు. మొఘలాయి అక్బర్ పరిపాలనా కాలంలో అతని మీద తిరుగుబాటు చేశాడు. ఇతను చేసిన సాహస కార్యాలు పంజాబీ సాంప్రదాయ కళల్లో, పంజాబీ కిస్సేలలో తరచూ దర్శనమిస్తూ ఉంటాయి.

Dulla Bhatti (4067802963).jpg
దుల్లా భట్టి సమాధి

బాల్యం మార్చు

దుల్లా భట్టి పంజాబ్ ప్రాంతానికి చెందిన పిండి భట్టియాన్ అనే ఊర్లో ఒక ముస్లిం రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. ఈ ఊరు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇతని తండ్రి ఫరీద్, తాత బిజ్లీ అక్బర్ ప్రతిపాదించిన కేంద్రీయ శిస్తు చెల్లింపు విధానాన్ని వ్యతిరేకించి ఉరితీయ బడ్డారు. అతని తండ్రిని ఉరి తీసిన నాలుగు నెలలకు తల్లి లాధి దుల్లాకు జన్మనిచ్చింది.[1]

కాకతాళీయంగా అక్బర్ కొడుకు జహంగీరు కూడా అదే రోజు పుట్టాడు. అక్బర్ ఆస్థానంలోని పండితులు జహంగీరు ఒక సాహస వీరుడుగా రాజ్యం నిలుపుకోవాలంటే ఒక రాజపుత్రుల ఇంటిలో పెరగాలని సలహా ఇచ్చారు. అక్బర్ ఆ బాధ్యత లాధికి అప్పజెప్పాడు. ఆమె విప్లవకారుల కుటుంబానికి చెందినదైనా ఆమెకు చక్రవర్తి ప్రాపకం లభిస్తే తరువాతి తరం వారైనా దాని జోలికి వెళ్ళకుంటా ఉంటారని అక్బర్ ఆలోచన. [2]

ఇందులో భాగంగా భట్టి కచ్చితంగా పాఠశాలకు హాజరవ్వాలి. అప్పటికి భట్టికి తన తండ్రి, తాతలకు జరిగిన అన్యాయం గురించి తెలియక పోయినా బడికి వెళ్ళనని మారాం చేశాడు. తనని ఒక విద్యావంతుడిగా మార్చడానికి, ఒక ఉత్తమ పౌరుడిగా మార్చడానికి చేసిన ఏర్పాట్లన్నీ బేఖాతరు చేస్తూ బాల్యంలో సామాన్యమైన అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు.[2]

కానీ తల్లి లాధి మాత్రం ఏదో మాట మీద భట్టికి తన పూర్వీకుల గురించి తెలియజెప్పాల్సి వచ్చింది. దాంతో ప్రత్యేకించి తన తండ్రి, తాత మరణాలకు ప్రతీకారంగా కాకపోయినా సామాన్య ప్రజల త్యాగాలను చూసి అతనికి సహజంగానే అక్బర్ పరిపాలన మీద ఉన్న ద్వేషం మరింత పెరిగి తిరుగుబాటుదారునిగా చేసింది. గౌర్ అనే రచయిత దీన్ని ఒక సామాన్యుడి ఉద్యమంగా అభివర్ణించాడు.[3]

బందిపోటు మార్చు

దుల్లా తనదైన శైలిలో ధనవంతుల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టేవాడు. [4] అంతే కాకుండా ఆడపిల్లలను దొంగతనంగా బానిసలుగా అమ్మడాన్ని కూడా వ్యతిరేకించాడు. వారికి కట్నాలతో సహా ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాడు. [5]

ఇతని చర్యలవల్లనే అక్బర్ గురు అర్జున్ దేవ్ ను సంతృప్తి పరచడానికి వారి ప్రాంతమైన బారీ దోఅబ్ ను భూమిశిస్తునుండి మినహాయింపు ప్రకటించి ఉండవచ్చు. [4]

మరణం మార్చు

భట్టి 1599 లో లాహోర్ లో బహిరంగంగా ఉరితీయబడ్డాడు. అలా చేస్తే అతను భయపడతాడని అక్బర్ భావించాడు కానీ చివరి దాకా భట్టి తన ధైర్యాన్ని చెరగనీయలేదు. భట్టికి సమకాలీనుడైన సూఫీ కవి షా హుస్సేన్ భట్టి చివరి పలుకులను ఇలా వర్ణించాడు. ఏ పంజాబ్ ముద్దుబిడ్డైనా భూమిని వేరేవారికి అమ్ముకోడు.[6][7]

గమనికలు మార్చు

  1. Gaur (2008), pp. 34, 37
  2. 2.0 2.1 Gaur (2008), p. 35
  3. Gaur (2008), pp. 35–36
  4. 4.0 4.1 Gaur (2008), p. 36
  5. Purewal (2010), p. 83
  6. Gaur (2008), p. 37
  7. Ayres (2009), p. 76

మూలాలు మార్చు

  • Ayres, Alyssa (2009), Speaking Like a State: Language and Nationalism in Pakistan, Cambridge University Press, ISBN 9780521519311
  • Gaur, Ishwar Dayal (2008), Martyr as Bridegroom: A Folk Representation of Bhagat Singh, Anthem Press, ISBN 9788190583503
  • Purewal, Navtej K. (2010), Son Preference: Sex Selection, Gender and Culture in South Asia, Berg, ISBN 9781845204686