పింగళి ఎల్లనార్యుడు

పింగళి ఎల్లనార్యుడు 17వ శతాబ్దమునకు చెందిన కవి. [1]

ఈ కవి సర్వేశ్వర మహాత్మ్యమను నామాంతరము గల తోభ్యచరిత్రమును రచించెను. తోభ్య చరిత్రము నాలుగాశ్వాసములు గల క్రైస్తవ గ్రంథము. ఇతను తన కవిత్వములో శివ భక్తులను నమస్కరించుట చేత ఇతడు శివభక్తుడని, నియోగి బ్రాహ్మణుడని తెలియుచున్నది. ఇతడు క్రైస్తవుడు కాక శైవ బ్రాహ్మణుడైన పక్షమున ఇతడు క్రైస్తవ గ్రంథమును ఎందుకు రచించాడో తెలియడం లేదు. ఇతడు క్రైస్తవ మతంలోకి చేరినదువలన గానీ, ధనాపేక్ష చేత గానీ ఈ గ్రంథమును రాసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అతను భరద్వాజ గోత్రుడు. పింగళి నాగయామాత్యుని పుత్రుడు. ఇతడు కృష్ణామండలం నందు గల కొండవీడు నందుండిన నియోగ బ్రాహ్మణుడు. ఈ కవి తుమ్మరాయపరెడ్డి ప్రేరణ చేత ఈ గ్రంథమును రచించెను. ఈ కవి మొదట వచన కావ్యముగా రాసిన గ్రంథమును తరువాత పద్య కావ్యముగా రాసినాడని తెలియుచున్నది. అతను దామెర వెంకటాధిపుని కాలంలో నివసింనినట్లు స్పష్టమగుచున్నది. బహుళాశ్వ చరిత్రమును రచించిన దామెర వెంకటాధిపుడు 17వ శతాబ్దము ఆరంభములోని వాడు. ఈ సమాచారం ఆధారంగా ఈ కవి 17వ శతాబ్ద మధ్య కాలం నాటి వాడని తెలియుచున్నది. ఈ తోబ్య చరిత్రము వేదాంత రసాయనము గ్రంథ రచన కంటే ముందు కాలం నాటినది తెలియుచున్నది. ఇతని కవిత్వం మృదుమధురం. ఈతని గురువు ఇవ్వటూరి శరభనారాధ్యుడు.

మూలాలు[2] మార్చు

  1. ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహము {శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం }
  2. Aandhra kavula charitramu muudava bhaagamu