బేడి ఆంజనేయస్వామి దేవాలయం

బేడీ ఆంజనేయస్వామి దేవాలయం తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహద్వారానికి, అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడీ ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజనీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట. అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటాయి.

దస్త్రం:బేడి ఆంజనేయస్వామి.jpg
బేడి ఆంజనేయస్వామి

సా.శ.1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయమే ఈ బేడీ ఆంజనేయస్వామి అని తెలుస్తోంది.[1] పూరీ నగరంలో కూడా ఇలాంటి బేడీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దాన్ని దరియా మహావీర దేవాలయం అని పిలుస్తారు. తిరుమల లోని ఆంజనేయస్వామి ఆలయం ముఖ మండపం, గర్భాలయం అని రెండు భాగాలుగా నిర్మించారు. గర్భాలయంలో సుమారు 6 అడుగుల ఎత్తున్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మించారు. గోపురానికి నాలుగుమూలల్లో సింహాలు చెక్కి ఉన్నాయి. ఆలయంలో ప్రదక్షిణ మండపం ఉంది.

విశేషాలు మార్చు

 
బేడి ఆంజనేయస్వామి ఆలయ గోపురం

ప్రతిరోజు మూడుపూటలా వేంకటేశ్వర స్వామికి నివేదన జరిగాక, బేడీ ఆంజనేయస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ నివేదన స్వామివారి ఆలయం నుండే వస్తుంది. ప్రతి ఆదివారం ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం రోజున సీతారామలక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయస్వామికి ఇస్తారు. శ్రీరాముని మెడలోని పుష్పహారాన్ని బేడీ ఆంజనేయస్వామికి సమర్పిస్తారు. హనుమజ్జయంతి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి.

మూలాలు మార్చు

  1. ttdj. "తిరుమల వెంకన్న ముందు ఆంజనేయస్వామికి బేడీలేసి నిలబెట్టారు... ఎందుకు..?". telugu.webdunia.com. Archived from the original on 2020-08-14. Retrieved 2020-08-14.