మదిన సుభద్రమ్మ

తెలుగు కవయిత్రి

మదిన సుభద్రమ్మ లేదా మదిన సుభద్రయ్యమ్మ (జ: 1781 - మ: ?) శ్రీ సర్ మహారాజా గోడే నారాయణ గజపతి రాయుడు గారి మేనత్త,[1] మదిన జగ్గారాయుడుగారి తల్లి. శతకములు రచియించిన స్త్రీలలో నీమె యగ్రగణ్యురాలని కందుకూరి వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమునందు వ్రాసియున్నారు. ఈమె తరిగొండ వెంగమాంబకు సమకాలీనురాలు. ఈమె శ్రీరామ దండకము, రఘునాయక శతకము, కేశవ శతకము, కృష్ణ శతకము, రాఘవరామ శతకము రచియించెను.

తెలుగు కావ్యములుసవరించు

తెలుగు కావ్యములు మదిన సుభద్రయ్యమ్మ 1893 సంవత్సరంలో రచించిన పుస్తకం.[2] దీనిని కవయిత్రి మేనల్లుళ్లయిన శ్రీ రాజా గోడె నారాయణ గజపతి రాయనింగారు సి. ఐ. ఇ. వారివల్ల ఎడిట్ చేయబడి శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యులయ్యవారలుంగారిచే విశాఖపట్టణమున ఆర్యవర ముద్రాశాలలో అచ్చువేసి ప్రకటింపంబడెను.

ఇందులో శ్రీ రామ దండకము; శ్రీ కోదండరామ శతకము మొదలగు వానిలోని పద్యములు; శ్రీ హరి రమేశ పద్యములు; శ్రీ రంగేశ్వర పద్యములు; శ్రీ సింహాచలాధీశ్వర పద్యములు; శ్రీ రఘునాయక శతకము; శ్రీ వేంకటేశ శతకములోని పద్యములు; శ్రీ కేశవ శతకము; శ్రీ కృష్ణ శతకము; శ్రీ సింహగిరి శతకములోని పద్యములు, శ్రీ రాఘవ రామ శతకము ఉన్నాయి.

ఉదాహరణ పద్యాలుసవరించు

ఈమె కవనధోరణిని తెలుపుటకై యీమె రచితములని కవిచరిత్రలో వ్రాసిన రెండు పద్యములు:

ఉ. శ్రీరమణీకళత్ర సరసీరుహ నేత్ర జగత్పవిత్ర స
త్సారసబృందమిత్రసురసన్నుతిపాత్ర నరేంద్రపుత్ర శృం
గారసమగ్రగాత్ర జనకర్మవిదారణకృచ్చరిత్ర శ్రీ
నారదమౌనిగీతచరణా రఘునాయక దీనపోషకా.

ఉ. మన్ననదప్పియున్న యెడ మక్కువగల్గినవారి నేనియున్
దిన్నగ మందలించినను దెల్లముగామది నొవ్వకుండునే
యన్నకు ధార్తరాష్ట్రునకు నాదరమొప్ప హితోపదేశమి
ట్లెన్నగ జేసి యావిదురు డేమి ఫలంబును జెందె గేశవా!

మూలాలుసవరించు

  1. మదిన సుభద్రమ్మ (1935). భండారు అచ్చమాంబ రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాల. బెజవాడ: కొమర్రాజు వినాయకరావు. p. 256.
  2. https://archive.org/details/10879telugukaavy034400mbp ఆర్కీవు.కాం.లో పుస్తక ప్రతి.