మురారిరావు ఘోర్పడే

మరాఠా సైన్యాధికారి
(మురారిరావు నుండి దారిమార్పు చెందింది)

మురారిరావు ఘోర్పడే
జననం1699
గుత్తి
మరణం1779 (aged 79–80)
రాజభక్తిమరాఠా
సేవలు/శాఖసైన్యం
ర్యాంకుసైన్యాధిపతి & ఆ తరువాత సందూరు రాజా

మురారిరావుగా పేరొందిన మురారిరావు ఘోర్పడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. భారతదేశంలో మొగలుల పాలన క్షీణదశకు చేరుకొని దక్షిణాపథంలో మరాఠులు విస్తరిస్తుంటే, మరో ప్రక్క ఫ్రెంచ్, బ్రిటిషు సేనలు ఉపఖండంలో పట్టుసాధించడానికి కృషి చేస్తూండేవారు. మరాఠులు, నిజాంలు, మైసూరు రాజ్యం, ఆధిపత్యంకై పోరాడుతూండేవారు. అలాంటి సంక్లిష్టమైన సమయంలో, దక్కన్‌లో పీష్వాలకు నమ్మకమైన సేనానిగా ఉన్న మురారిరావుకు 18వ శతాబ్దపు దక్షిణాపథ చరిత్రలో కీలకమైన స్థానమున్నది.[1] మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి సాహసోపేతమైన రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.[1]

కుటుంబం మార్చు

మురారిరావు 1699 ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.[2] తండ్రి మరణం తర్వాత 1731 లో మురారి రావు రాజయ్యాడు. 1729 జూన్‌లో మొదటి భార్య సగుణాబాయిని వివాహం చేసుకున్నాడు. ఈయన రెండవ భార్య పేరు తెలియలేదు. కానీ ఆమె 1791లో, శ్రీరంగపట్నంలో టిప్పూసుల్తాను అదేశంపై చంపబడిందని తెలుస్తున్నది.[3] మురారిరావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో, చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు.

తిరుచిరాపల్లి పాలన మార్చు

1740లో రఘూజీ భోంసలే, ఫతే సింగ్, మురారిరావుల నేతృత్వంలో మరాఠా సైన్యం ఆర్కాటుపై దండయాత్ర చేసింది. ఆర్కాటు నవాబు దోస్త్ అలీ ఖాన్‌ను దామలచెరువు కనుమలో హతమార్చి ఆర్కాటు కోటను స్వాధీనం చేసుకొన్నారు. తిరుచ్చి కోటను ముట్టడిచేసి, అక్కడ జరిగిన యుద్ధంలో దోస్త్ అలీఖాన్ అల్లుడు చందా సాహిబ్ ను ఓడించి, బందీగా సతారాకు తీసుకొనివెళ్లారు. తిరుచ్చి కోటను పాలించడానికి మురారిరావును నియమించారు. 1741 జూన్ నుండి 1743 మార్చి వరకు రెండు సంవత్సరాలపాటు మురారిరావు పద్నాలుగు వేల మంది సైనిక బలగాన్ని తిరుచ్చి కోటలో మోహరించి, తిరుచిరాపల్లి ప్రాంతాన్ని పాలించాడు. కర్నాటకంలో వారసత్వపోరును మట్టు పెట్టాలనే కృత నిశ్చయంతో నిజాముల్ ముల్క్ 1743లో పెద్ద సైన్యంతో మరాఠులపై దండయాత్ర బయలుదేరాడు. ఆర్కాట్ కోటను తిరిగి వశం చేసుకొని అక్కడ వారసత్వ తగువుని తీర్చి, తిరుచ్చి కోటపై దాడి చేసి, ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. బాలాజీ బాజీరావు, రఘూజీ భోంసలే పరస్పర వైరుద్ధ్యాల వల్ల మహారాష్ట్ర నుండి సహాయం అందే సూచనలు లేక, చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారిరావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.[4]

ఫ్రెంచివారితో ఒప్పందం మార్చు

మురారిరావు 1752 నవంబరులో ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకుని, వారి పక్షాన బ్రిటిషు వారిపై యుద్ధం చేశాడు. మురారిరావు తిరుచిరాపల్లి ముట్టడిలో ఫ్రెంచి వారికి సహాయం చేశాడు. ఆ సహాయానికి గానూ ఫ్రెంచివారు మురారిరావుకు పద్నాలుగు లక్షలు బాకీ పడ్డారు. కానీ కర్నాటకంలో కలిసిరాక, వర్తకం దెబ్బతిని మురారిరావు బాకీ చెల్లించలేకపోయారు. 1754లో తన రాజధానిని గుత్తికి మార్చి అక్కడ స్థిరనివాసమేర్పరచుకున్నాడు.

సావనూరు యుద్ధం మార్చు

1756లో గుత్తి దుర్గాన్ని పాలిస్తూ మురారిరావు, తనకు రాజ్యం నేరుగా ఛత్రపతి వల్ల సంక్రమించింది, పీష్వా వల్ల కాదని, బాలాజీ బాజీరావుకు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో నిజాంకు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. సావనూరు కోటలో తన సేనలను మోహరించి, నిజాం, పీష్వా సేనలనుండి వారిని కాపాడతానని హామీ ఇచ్చాడు.[5]

పీష్వా తన సేనలతో పాటు, మరాఠా నాయకులైన మల్హర్ రావు హోల్కర్, మధోజీ హోల్కర్ల సేనలతో పాటు 1756 మార్చి ప్రారంభంలో సావనూరు చేరుకున్నాడు. 1756 ప్రారంభంలోనే పీష్వాకంటే ముందే బీదరు నుండి బయలుదేరిన నిజాం సేనలు అప్పటికింకా సావనూరు చేరలేదు. షానవాజ్ ఖాన్ అదే అదనుగా భావించి ఫ్రెంచి వారిపై పీష్వాకు వైముఖ్యం కలిగేలా, నిజాం సేనల ఆలస్యంగా రావటానికి ఫ్రెంచివారే కారణమని పితూరీ చేశారు. ఫ్రెంచి వారు తమ పాత మిత్రుడైన మురారిరావుపై యుద్ధం చేయటానికి సిద్ధంగాలేరని షానవాజ్ ఖాన్ భావించడానికి కారణం లేకపోలేదు. తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో బుస్సీ, తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, సలాబత్ జంగుకు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక నిజాం, పీష్వాలతో కలిసి మురారిరావుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు.

సావనూరు కోటను మురారిరావు సమర్ధవంతంగా కాపాడుకోవటంతో కోట ముట్టడి ఏప్రిల్ నెలంతా కొనసాగింది. ముట్టడిలో ఉన్న వారిపట్ల అవలబించవలసిన వైఖరిపై పీష్వాల స్థావరం లోనూ, నిజాం స్థావరంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. మురారిరావును ఎలాగైనా కాపాడాలని మల్హర్ రావు అభిమతమైతే, నిజాం సైన్యంలోని పఠానులు సావనూరు నవాబుపై సానుభూతి వెలిబుచ్చారు. ఈ విషయాలని గ్రహించిన బుస్సీ, మురారిరావు తరఫున బాలాజీ బాజీరావుతో సంధి ప్రయత్నాలు చేశాడు. ముట్టడి ఇంకా అలాగే కొనసాగింది. మురారిరావును కాపాడటానికి బుస్సీ కావాలనే తాత్సారం చేస్తున్నాడని, ఇదివరకు ఉత్తర సర్కారులకు (తీరాంధ్ర) ఫౌజుదారులుగా ఉన్న షానవాజ్ ఖాన్, జాఫర్ అలీలు ఆరోపించారు. బుస్సీ ఆ నిందను బాపుకోవడానికి తన ఫిరంగి దళాన్ని కోటపై దాడి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఏప్రిల్ 25న సావనూరు లొంగిపోయింది.

బుస్సీ మధ్యవర్తిత్వంతో అని పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. సావనూరు నవాబు, సలాబత్ జంగు ఆధిపత్యాన్ని తిరిగి శిరసావహించాడు. మురారిరావు పీష్వాకు చౌత్ చెల్లించడానికి ఒప్పుకున్నాడు. పీష్వా మురారిరావును తిరిగి తన సేవలోకి తీసుకున్నాడు. తనకోసం బుస్సీ పడిన శ్రమకు కృతజ్ఞతతో మురారిరావు ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ తనకు ఇవ్వవలసిన ఋణాన్ని మాఫీ చేశాడు.

మైసూరుతో యుద్ధాలు మార్చు

మరాఠులు పొరుగురాజ్యమైన మైసూరుతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. హైదర్ అలీ ప్రాబల్యం పెరిగిపోతుందని గ్రహించిన పీష్వా మాధవరావు, మురారిరావు సహాయంతో మైసూరుపై దండెత్తాడు. ఈ దండయాత్ర 1764 నుండి 1765 జూన్ వరకు కొనసాగింది. యుద్ధంలో గెలవలేక హైదర్‌అలీ పీష్వాతో సంధి చేసుకుని 28 లక్షలు కప్పం చెల్లించాడు. 1770 లో మాధవరావు తిరిగి శ్రీరంగపట్నంపై దాడి వెడలినపుడు 40 లక్షలు కప్పం చెల్లిస్తానని సంధి చేసుకున్నాడు.

1775 డిసెంబరులో హైదర్ అలీ బళ్ళారిని కైవసం చేసుకొని గుత్తిని ముట్టడించాడు. 1776 జనవరి 10న గుత్తి దుర్గంపై దండెత్తి మురారి రావును బంధించి తొలుత శ్రీరంగపట్నంలోనూ, ఆ తర్వాత కబ్బాలదుర్గ్‌లో బందీగా ఉంచాడు.[6] ఆ తర్వాత కొన్నాళ్ళకే కారాగారంలోనే మురారిరావు 70 యేళ్లు పైబడిన వయసులో మరణించాడు. గుత్తితో పాటు సందూరు రాజ్యం మొత్తాన్ని హైదర్ అలీ తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.[7]

వ్యక్తిత్వం మార్చు

మురారిరావు ముక్కుసూటి మనిషి. డబ్బు విషయాలలో నిక్కచ్చిగా ఉండేవాడని, చేయించుకున్న పనికి జీతం తప్ప ఆపైన ఒక్క పణం కూడా ఎక్కువ ఇవ్వడని, కొల్లగొట్టిన ధనాన్నంతా స్వయంగా అనుభవించేవాడని, తనకు రావలసినవి వసూలు చేసుకోవటానికి ఎంతటి పనులకైనా ఉపక్రమించగలడని సమకాలీన ఫ్రెంచివారి దుబాశీ ఆనందరంగ పిళ్లై డైరీల వల్ల తెలుస్తున్నది.[8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Monitor's Hold - Sugata Srinivasaraju". Archived from the original on 2012-05-29. Retrieved 2012-10-17.
  2. A collection of treaties, engagements, and sanads relating to ..., Volume 8 By India. Foreign and Political Dept
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-23. Retrieved 2012-10-19.
  4. Political History of Carnatic Under the Nawabs By N. S. Ramaswami
  5. Nizam-British Relations, 1724-1857 By Sarojini Regani
  6. Memoirs of Hyder and Tippoo: rulers of Seringapatam, written in the Mahratta ...By Ram Chandra Rao Punganuri
  7. Imperial Gazetteer of India By Sir William Wilson Hunter
  8. Private Diary of Ananda Ranga Pillai - 12 Vols. By Ananda Ranga Pillai