అరాజక, విప్లవ నేరాల చట్టం, 1919 లేదా ప్రముఖంగా రౌలట్ చట్టం ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1919 మార్చి 18న చేసిన చట్టం. 20 వ శతాబ్దమునాటికి భారతీయులలో కలిగిన రాజకీయ పరిజ్ఞానము, స్వరాజ్యకాంక్షను అణచుటకు చేసిన అనేకమైన నిర్భందములు, నిర్ధేశములుకలిగియున్న అనేక చట్టములలో 1915 సంవత్సరపు డిఫెస్సు ఆఫ్ ఇండియా చట్టము ఒక నిర్ధిష్టమైన కఠోర క్రిమినల్ చట్టము. భారతదేశములో 1905 తరువాత ఉద్భవించిన విప్లవాత్మక స్వరాజ్య కాంక్షను ఉక్కుపాదముతో అణుచుటకు నిశ్చయించిన నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వము అరాజక విప్లవోద్యముతోకూడిన దారుణవాదమును నరికట్టుటకు మార్గములు సిఫారస్సు చెయమని ఆంగ్లన్యాయాధిపతి రౌలట్ (Justice S.A.T. Rowlatt) అధ్యక్షతన ఒక విచారణసంఘమును నియమించిరి. ఆ సంఘమువారు అరాజక విప్లవోద్యమమును తీవ్రజాతీయవాదక ఆందోళనకును ముడిపెట్టి డిఫెన్సు ఆఫ్ ఇండియా చట్టమును సవరించి మరింత అధికమోతాదులో నిర్దిష్టముచేయ సూచనలిచ్చి తమ నివేదికను 1918లో ప్రకటించిరి. వారి సిఫారసులమేరకు చేసిన చట్టములే రౌలట్ చట్టములని బ్రిటిష్ ఇండియా చరిత్రలో ప్రసిద్ధిచెందినవి. రౌలట్ సంఘపు నివేదికను రెండు చట్టములుగా (క్రిమినల్ అమెండ్మెంటు లా) చేయుటకు 1919 ఫిబ్రవరిలో వైస్రాయి కార్యనిర్వాహక సంఘమున (ఎక్సెక్యుటివ్ కౌన్సిల్) ఆ బిల్లులు (చిత్తుచట్టములు) ప్రవేశపెట్టబడినవి. ఆ చట్టములను తీవ్రముగ ఖండించి గాందీజి చేసిన కృషి గణనీయము. ఆ రెండు బిల్లులలో ఒకటి శాసనముగ ఆమోదించబడింది. ఆచట్ట ములోని నిరంకుశ నిర్బంధ విధానములను వెలికితెచ్చి అతినిర్ధిష్టమైన ఆ చట్టమును గూర్చి ప్రజలలో అవగాహనచేసి అటుపై బ్రిటిష్ ప్రభుత్వముపై శాంతియుత వ్యతిరేక ప్రదర్శన కార్యక్రమములు చేపట్టి సత్యాగ్రహముచేయదలచినటుల ప్రకటనచేసి గాందీజీ భారతదేశ రాజకీయఆందోళనలో ప్రముఖ పాత్రవహించెను. సర్వసాదారణమైన భారతీయుల రాజకీయ ఆందోళనుగూడా విప్లవాదకమైన రాజద్రోహముగ భావించి భారతీయుల స్వరాజ్య కాంక్ష రూపుమాపుటకు బ్రిటిష్ ప్రభువులు వహించిన కఠిన వైఖరి, ఆ సమయమున మహాత్మా గాంధీ చేపట్టిన ఆందోళన కార్యక్రమము, సత్యాగ్రహోద్యమము సింహావలోకనం చేయవలసియున్నది. [1] [2]

సిడ్నీ రౌలట్, అతని వివాదాస్పద రౌలాట్ కమిటీకి అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి.

పూర్వోత్తర చరిత్ర మార్చు

1919-20 మధ్య జరిగిన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు (1) 1919 ఫిబ్రవరిలో రౌలట్ బిల్లులు రెండు ప్రవేశపెట్టబడినవి (2) రౌలట్ బిల్లులకు వ్యతిరేక ముగా అనేక ఆక్షేపణలు తెలిపిరి (3) మార్చిలో ఒక రౌలట్ బిల్లును శాసనముగ చేసిరి (4) రౌలట్ శాసన ఉపసంహరణకు గాందీ సత్యాగ్రహ ప్రారంభము (5) ఏప్రిల్ 6 న పెద్ద పెట్టున దేశవ్యాప్తముగ విజయవంతమైన హార్తాళ్ (6) పంజాబ్ లోకి ప్రవెశించరాదన్న ప్రభుత్వ నిషేధాజ్ఞను ఏప్రిల్ 9 గాందీ ఉల్లంఘన (7) గాందీ నిర్భందన (8) ఏప్రిల్ 10 జలియన్వాల బాగ్ ఘోర కాల్పులు, పంజాబులో మార్ష్యల్ లా అమలు (9) ఏప్రిల్ 18 నుండి గాందీ సత్యాగ్రహ విరామం (10) 1919లో మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము (11) గాందీ సత్యాగ్రహకార్యక్రమములు 1920నుండి క్రమేణా పూర్తిస్తాయి సహాయనిరాకరణోద్యమముగా (Non Co-operation movement) మారి అనేక బహిష్కరణోద్యమములతో ఖిలాఫత్ ఉద్యమమునకు చేదోడుగా సాగినది.

రౌలట్ చట్ట ఉపసంహరణకొరకు గాంధీ చేసిన సంగ్రామము మార్చు

రౌలట్ విచారణసంఘపు సిఫారసులను అనుసరించి రౌటు బిల్లులని ప్రసిద్ధిచెందిన రెండు చిత్తుచట్టములను 1919 ఫిబ్రవరి మాసములో వైస్రాయి కార్యనిర్వాహక సంఘమున ప్రవేశపెట్టారు. వాటిని శాసనములుగ చేయవలదని అనేక ప్రముఖ రాజకీయనాయకులు ప్రభుత్వమునకు సూచించిరి. వైస్రాయి కార్యనిర్వాహక సంఘము లోపల వెలుపల కూడా పెద్దపెట్టున విరోధమును ప్రకటించిరి. ఆ కాలమునందప్పటికే (1919) నాటికే ముస్లిమ్ లీగ్ అధినేతగాఎంపికకాబడిన మహ్మద్ అలి జిన్నా కూడా బహాటమ్ముగా ఆ చట్టమును విమర్శించెను. అటువంటి చట్టమును అమలుచేయు ప్రభుత్వము నాగరకతారహితమైన ప్రభుత్వమని విమర్సించెను. అయినపట్టికిని నిరంకుశమైన బ్రిటిష్ ప్రభుత్వము మార్చిలో ఒక బిల్లును చట్టముగ శాసించిరి. 1919 ఫిబ్రవరిమాసమున గాందీ తీవ్రఅస్వస్తుడైయుండెను. పూర్తిగా కోలుకొనకనే ఆ ఉపసంహరణ సంగ్రామమునకు నాయకత్వమువహించెను. అరాజక విప్లవాందోళన కేవలము కొన్ని ప్రాంతములకు మాత్రమే అయి యుండగ ఆ నిర్ధిష్ట చట్టమును యావద్భారతదేశానికి వర్తింపచేయుట చాల అన్యాయమని గాందీ వాపోయెను. అనేక రాజకీయ నాయకుల కోరిక పై గాంధీ రాజకీయ రంగమున ప్రవేశించి ఆ రౌలట్ చట్టమును ఉపసంహరింపు మని ప్రభుత్వముపై వత్తిడి తెచ్చుటకు ఆందోళనా కార్యక్రమములు చేపట్టెను.

రౌలట్ చట్ట ఉపసంహరణకు గాందీ సత్యాగ్రహం మార్చు

ఫిబ్రవరి 1919 లోనే గాందీ తన సత్యాగ్రహ దీక్షచేపట్టనున్నటుల ప్రకటించెను. శాంతియుతమైన సత్యాగ్రహ కార్యక్రమములో ముందుగ హార్తాళ్ జరిగింది. ఏప్రిల్ 6 వ తారీకునాటి పెద్దపెట్టున జరిగిన ఆ హార్తాళ్ బ్రిటిష్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి దేశవ్యాప్త రాజకీయ ఆందోళనగ చెప్పవచ్చును. అంతకుముందు 1905 చారిత్రాత్మకమైన బెంగాల్ విభజనప్పుడు జరిగిన ఆందోళన కంటే హెచ్చు స్థాయిలో జరిగినటుల కనబడుచున్నది. 1919వ సంవత్సరపు ఏప్రిల్ హార్తాళ్ పంజాబులోను ఢిల్లీలోను శాంతిభంగకరమైన హార్తాళ్ జరిగినవి. ఏప్రిల్ 9తారికున పంజాబులో lahore ప్రవేశించవద్దన్న పోలీసు వారి ఆజ్ఞలు ధిక్కరించి గాందీ పంజాబు వెళ్ళుచుండగ దారిలోనే గాందీని అదులోపుతీసుకుని బొంబాయిలో విడిచిపెట్టిరి. అటుతరువాత జరిగిన జలియన్ వాలా బాగ్ (అ‌‌‌‌మృత్సర్ మరణకాండ) ఘోరములు దేశమును కుదిపివేశినవి. రౌలట్ చట్టమును విరోధించుతూ ప్రారంభించిన సత్యాగ్రహ వాగ్దాన పత్రము (pledge) బహుకొద్దిమంది గాంధీ అనుచరుల సంతకములుతో మాత్రమే విడుదలగుటచూచి గాందీతలపెట్టిన సత్యాగ్రహమునకు అధిక సంఖ్యలో దేశప్రజలనుండి మదత్తురాదని, గాందీ తలపెట్టిన ఆందోళన సఫలమవజాలదని షెమ్సఫర్డు ప్రభుత్వమేకాక జాతీయనాయకులు సహితము తలపోసిరి (భూపెంద్రనాధ బసూ, అనీ బిసెంట్ మొదలగు ప్రముఖులు). అనేకప్రముఖులు రౌలట్ బిల్లును శాసనముగచేయుటను తీవ్రముగా ఖండించినప్పటికినీ బ్రిటిష్ ప్రభుత్వముపై సంగ్రామమునకు నడుముకట్టి దిగుటకెవ్వరును సాహసించలేదు ఒక్క గాందీ తప్ప. వైస్రాయి ఇంపీరియల్ కౌన్సిల్ లోని కొందరు ప్రముఖ సభ్యులు (శ్రీనివాస శాస్త్రి, సురెంద్రనాధ్ బెనర్జి, డి.ఇ. వాచా, మహ్మద్ షఫీ మొదలగు ప్రముఖులు) కూడా రౌలట్ బిల్లును శాసనముగాచేయుటను నిరసించుతూ తమ విముఖత తెలిపుచూచేసిన ఒక ప్రకటన మార్చి 2తేది విడుదల చేసిిరి. కాని అందు గాందీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను సమర్ధించలేదు. రౌలట్ బిల్లులఉపసంహరణకోసం ప్రారంబించిన సత్యాగ్రహ దీక్ష ఏప్రిల్ 18 వరకు జరిగిన మీదట కొంతకాలము నిలిపివేశెను. శాంతియుతమైన సంగ్రామము గాందీ సూత్రం. హింసాత్మక ఘటనలు సంభవించినప్పుడల్లా గాందీ తన సత్యాగ్రహదీక్ష విరమించుట పరిపాటి [2]

రౌలట్ విచారణసంఘమును నియమించిన ఉద్దేశ్యము సంఘముచేసిన సూచనలు మార్చు

ఆంగ్ల న్యాయాధిపతి రౌలట్ అధ్యక్షతన విచారణ సంఘమును నియమించిన ఉద్దెేశ్యము పెరుగుచున్న రాజద్రోహ ఉద్యమము యొక్క శాఖోపశాఖలన్నింటిని పరిశీలించి విప్లవాందోళనను కూకటివ్రేళ్లతో నిరోదించుటకు అవలంబించవలసిన మార్గములు, పోలీసులు పోందియుండవలసిన అధికారములను సూచించుటకు. అయితే ఆ సంఘము అతిచతురత చూపించుటకు భారతదేశములో అప్పటిలోనుండిన జాతీయ అతివాదమును గూడా విప్లవాదముతో ముడిపెట్టి సాదారణ రాజకీయ అభిప్రాయములు, ప్రభుత్వముపట్ల ద్వేష భావము గాని, విరోదభావములు కూడా నిర్మూలింపజేయు తీవ్ర శాసనములు చేయవలెనని సలహాలు సూచించిరి. భారతీయ న్యాయాధిపతి కుమారస్వామి శాస్త్రి (అప్పటి మద్రాసు హైకోర్టు న్యాయాదిపతి) సభ్యులుగనుండిన ఆ విచారణ సంఘము నివేదిక తమ సూచనల సమర్ధనగ భారతజాతీయ కాంగ్రెస్సులు అప్పటి అతివాద నాయకులైన బాలగంగాధర తిలక్, అరవిందఘోష్ యొక్క కార్యక్రమ చర్యలను రాజద్రోహ ఉద్యమములకు కారణభూతములనియు అనుమానస్పద విప్లవాదకులేనన్న వ్యాఖ్యలు జోడించి సూచనలిచ్చుట విచారకరమైన విషయము [1]

రౌలట్ చట్టములోని నిబంధనలు మార్చు

1915 సంవత్సరపు డి.ఐ చట్టములోనున్న కొన్ని నిబంధనల పరిదిని రౌలట్ చట్టములో విస్తృతపరచి శాసనముగాచేసి పోలీసులకు విశేష అధికారములు ఇవ్వబడినవి.
(1) ఎవరిపైనను విప్లవాదకులని అనుమానముకలిగినచో విచారణలేకనే జైలులో రెండేండ్లవరకు నిర్బందించ గల అధికారము కలిగెను
(2) అట్టి ముద్దాయిలను విచారించుటకు ప్రత్యేక ముగ్గురి న్యాయాధీశుల సంఘమునేర్పరచి అతి స్వల్పకాలములోనే కేసును ముగించవలసిన అత్యవసరనిబందన చేయబడెను.
(3) ఆ చట్టము క్రింద నిర్బందిచబడ్డ ముద్దాయిలకు పైకోర్టులో అప్పీలుచేసుకునే అవకాశము లేకుండా చేసెను.
(4) విప్లవాదకుల నిర్భంద వివరముల వార్తలను నిషేధించబడెను.
(5) చట్టముచేయకముందునాటి నేరములని అనుమానించిన ఘటనలపైనగూడా ఆ చట్టములోని నిబంధనలు వర్తించును

వైస్రాయి షెమ్సఫోర్డు అవలంబించిన రాజనీతి మార్చు

రౌలట్ చట్టము చేయబడిననాటికి భారతదేశమున బ్రిటిష్ ప్రభుత్వము వైస్రాయి షెమ్సఫర్డు ( Frederic John Napier Thesiger, 1st Viscount Chelmsford) పరిపాలన క్రిందయుండెను. 1916 నండీ 1921 వరకూ పరిపాలించిన షెమ్సుఫర్డు ప్రభువు కార్య కాలమున చాలప్రముఖమైన విశేషముల జరిగెను.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "The British Rule in India" D.V. SivaRao(1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp380-382
  2. 2.0 2.1 "The Making of a Nation" B.R. Nanda(2004)HarperCollins pp127-171