సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ (కళావర్ రింగ్)

కళావర్ రింగ్ అని పేరుపొందిన నృత్యకారిణి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ. ఈమె తొలిగా విజయనగరంలో మేజువాణీలలో చేసిన నృత్యాలతో పేరు పొందిన తరువాత నాటకాల్లో నటించడం, హరికథలు కూడా చెప్పటం జరిగింది. కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజనర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసారు.[1]

బాల్యం, విద్య మార్చు

ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొండ గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విద్యాభ్యాసం చేసి మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, ద్వారం వెంకటస్వామి నాయుడు శిష్యు లైన మద్దిల సత్య మూర్తి, చాగంటి రంగ బాబు, కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం ;నాయకురాలుగా వ్యవహరించింది. ఆమే నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.[2]

పేరు వెనుక కథ మార్చు

ఈమెకు ఆ పేరు రావడానికి వెనుక కొన్ని కథలున్నాయి. వీటిలో దేని ద్వారా ఆమె పేరు స్థిరపడిదో తెలియదు.

గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకు కళావర్ రింగ్ ప్రేరణ అని వాదన ఒకటి ఉంది. ఐతే కన్యాశుల్కం మలి కూర్పు 1909లో రావడం, సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ పుట్టినదే 1908 కావడం వల్ల ఇది కేవలం పుకారుగా నిర్ధారించవచ్చు.[1]

ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు.

నృత్యం, నటన,గానం మార్చు

ఆంధ్ర దేశంలోనూ, రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ నానారాజ సందర్శనం చేసి సంగీత నృత్య విద్యలో మహా పండితుల్నీ మెప్పించి, నాట్య తరంగిణి, నవవసంత కోకిల, గాన కళా కోవిద అనే బీరుదులతో సువర్ణ హస్త కంకణాల బహుమానాలతో సన్మానాలు అందు కున్నది. జయపూర్, ధారాకోట. కళ్ళికోట, చీకటి కోట, కలహండి, కరియల్, మధుపూర్, టికిరియా సంస్థానాలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె తెలుగు చనల చిత్ర రంగంలోను ప్రవేశించి రాణీప్రమీల చిత్రంలో ప్రధాన పాత్ర ధరించి చక్కగా పాడి నటించింది. 1947 లో మద్రాసు రేడియో ప్రసారం చేసిన సీతారామ కళ్యాణం, సుందరకాండ, సక్కుబాయి, శ్రీరామ జననం, భక్త రామదాసు నాటకాల్లో పాల్గొని అత్యుత్తమంగా నటించింది.

1934 లో ఆమె అనేక గ్రామఫోన్ రికార్డుల నిచ్చింది. కోకిల కోయి అని కూయగా, వ్యాకుల మానసమాయేగా, చిటపట చినుకులు దుప్పటి తడిసెను, పచ్చ బొట్టు ప్రాణనాథా...... ......సై పగజాల, రాత్రి నాటకం, ఏరా నాప్రియ మొదలైన పాటల రికార్డుల వెలువడ్డాయి. చింతా మణి గ్రామ ఫోను రికార్డుల నాటకంలో చింతామణీ పాత్ర ధరించింది. 1964 మార్చి 17 వ తేదీన ఆమెను ఆంధ్ర ప్రదే సంగీత నాటక అకాడమీ హైదరాబాదు రవీంద్ర భారతిలో సన్మానించింది. నృత్య ప్రదర్శనం ద్వారా కళావర్ రింగ్ అపారంగా ధనం ఆర్జించింది. అనేక మంది బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసింది. అంతే కాదు, అవసరాల్లో వున్న వాళ్ళను ఆదుకుని అనాథులకు ఆశ్రయం ఇవ్వటం ఆమె సుగుణాలు. ఆమె అంతమ దశలో, అకాడమీ వారి వేతనంతో, హరికథా గానంతో జీవితం గడిపి 1964 లో స్వర్గస్తురాలైంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు – ఈమాట". eemaata.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-18.
  2. "తెలుగువారి జానపద కళారూపాలు/తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్ళు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2018-01-18.

బయటి లింకులు మార్చు