సామవేదం రామమూర్తి శర్మ

సామవేదం రామమూర్తిశర్మ సంస్కృత పండితుడు.

జీవిత విశేషాలు మార్చు

బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం నందలి రమాధీర సంస్కృత కళాశాలలో గురుకులపద్ధతిలో ముడెగుర్తి వి.ఎస్.ఎన్.శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేసారు. ఆయన భాషాప్రవీణ, సాహిత్యాచార్య, పురాణశాస్త్రి అర్హతలను సాధించారు. ఆంధ్ర సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేసారు.[1] వీరు చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితిని స్థాపించి ఎన్నో సాహితీ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య సంస్కృత పాఠశాల స్థాపించి ఎందరికో సంస్కృత బోధన గావించి, విద్యాదానం చేశారు. దాదాపు అర్ధ శతాబ్ది కాలం పురాణ ప్రవచనములు చేసిన పండిత ప్రకాండులు వీరు. కవిగా ప్రబంధ కర్తగా బహు ప్రసిద్ధి వహించారు. ధవళేశ్వర స్తోత్ర సుధ, శ్రీదేవి లీలాసుధ, ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర, ధృవోపాఖ్యానము, కామేశ్వర స్తోత్రసుధ, శ్రీగణేశాభ్యుదయం, శ్రీమదభీష్టద రామాయణము జగన్నాథ స్తోత్రసుధ, వేంకటేశ్వర నక్షకోమాల, భగవన్నుతి దండకమాల, నేనెవడు?, శ్రీసుబ్రహ్మణ్య సీసపద్య శతకము, నిరాలంబోపనిషత్,సుబ్రహ్మణ్య 'సకార ' సహస్రం, వంటి గ్రంథాలను రచించారు.

ఈ మహనీయుని పాండిత్య కవిత్వాలు సుబ్రహ్మణ్యాంకితాలై వారి యోగసాధనకు రూపాలై ఉన్నాయి. అరుదైన పురాణాంశాలను శోధించి వాటిని పరతత్త్వంతో సమన్వయించడం వారి సరణి. స్కందోపాసకులైన వీరు నిష్కపట భక్తితో కూడిన జ్ఞాని. వీరి రచనలు ఆర్షతేజోవిరాజితాలు. సాధారణంగా హరికథల్లో వాడే "తొహరా" అనే రగడ వంటి దేశీయ వృత్తాలతో బ్రహ్మవైవర్త పురాణాంతర్గత బ్రహ్మఖండ ప్రకృతి ఖండాలను రచించారు. "దేవీభాగవతం" అనే ఒక అరుదైన ప్రాచీన గ్రంథాన్ని (సాధారణంగా లభిస్తున్నదేవీభాగవతానికి విభిన్నమైన) అదే వృత్తంతో "దేవీలీలాసుధ" పేరుతో రచించారు. ఇవి బృహత్ గ్రంథాలు. థర్మ వేదాంతశాస్త్ర చర్చ చేసిన గ్రంథాలు నేనెవడను?", "తత్త్వదర్శిని కామేశ్వర స్తోత్ర సుధ, నిరాలంబోపనిషత్ ప్రశ్నోత్తర గర్భితంగా రచించిన సుబ్రహ్మణ్యసీస పద్య శతకం, ధవళేశ్వర స్తుతి, జగన్నాథ నక్షత్రమాల వంటి గ్రంథాలు ఆర్ష విజ్ఞానాన్ని ఛందోబద్ధంగా అందించిన రచనలు. ఋషిధర్మ సముపాసనతోనే ప్రతిక్షణం ఒక జ్ఞాన దీప్తిగా వెలిగిన వారి భావన నుండి వెలువడిన మరొక పద్యగద్యాత్మిక కావ్యం శ్రీమదభీష్టద రామాయణము" వాల్మీకి, అధ్యాత్మ రామాయణాలనే కాకుండా బహుపురాణాల, మంత్రశాస్త్రాల సమన్వితంగా సంపూర్ల రామాయణాన్ని రచించారు. వీరి ప్రతి రచనా తన అభీష్టదైవమైన కుమారస్వామి వచరణాలకు అర్పించుకున్నారు. జీవితంలో ఆటుపోట్ల ఎన్ని ఎదురైనా తన ప్రతిభావ్యత్పత్తులకు తగిన రాణింపరాకున్నా అధ్యాత్మ విద్యా సంస్కారంతో హిమశైల సమాన ధీరగుణంతో నిలచిన పరిపూర్ఖులు వీరు. ఆబాల్యం వీరి వైఖరిని గమనించడమే సాధనగా విరిసిన ఆధ్యాత్మిక తేజో విలాసమే "ఆర్షధర్మోపన్యాసకేసరి".

ఆయనకు ఫిబ్రవరి 10,2008 న విశాఖపట్నం లో స్వర్ణకంకణం యిచ్చి సత్కరించారు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

సామవేదం నరసింహాచార్యులు(తండ్రి), సత్యవతి (తల్లి) దంపతులకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమారుడు సామవేదం రామమూర్తిశర్మ. రామమూర్తిశర్మ మూడవ కుమారుడు "సామవేదం సత్యనరసింహశర్మ".[3] మరొక కుమారుడు సామవేదం షణ్ముఖశర్మ ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.

రచనలు మార్చు

  • "శ్రీ ధవళేశ్వర స్తోత్ర సుధ"
  • గణేశాభ్యుదయం [4]

మూలాలు మార్చు

  1. Sanskrit scholar honoured,ద హిందూ,ఫిబ్రవరి 15,2008
  2. In Visakhapatnam Today
  3. "OUT ME & OUR HERITAGE". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-30.
  4. తెలుగు బంధు డాట్ కాం నుండి

ఇతర లింకులు మార్చు