సారమతి గవీంద్రులు

సారమతి గవీంద్రులు అంటూ ప్రారంభమయ్యే పద్యం ఆంధ్ర మహాభారత అవతారికలోనిది. ఈ పద్యాన్ని ఆదికవి నన్నయ్య రాశారు. తాను రాసే కవిత్వాన్ని, తన కవిత్వ లక్షణాలను నిర్వచించుకుంటూ నన్నయ్య రాసిన ఈ పద్యం సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది.

పద్యం మార్చు

ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లో
నారసి మేలునా నితరు లక్షర రమ్యత నాదరింప నా
నారుచి రార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె జగద్ధితంబుగన్.

తాత్పర్యం మార్చు

సారమైన బుద్ధితో కవీంద్రులైనవారు ఆదరించేలా ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఇతరులంతా ఆదరించేలా అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తినిధి అనే లక్షణాలతో నన్నయభట్టు మహా భారత సంహితా రచనను తెలుగులో జగత్తుకు మేలుకూర్చేందుకు ఒప్పేలా రాస్తానని చెప్తున్నారు ఈ పద్యంలో.

విశేషాలు మార్చు

విశేషమైన కొత్తరీతుల్లో కవిత్వం చెప్పిన కవులందరూ తమ కవిత్వం యొక్క లక్షణాలు వివరిస్తూ కొన్ని పద్యాలు రాసే అలవాటు ఉంది.[1] అలాంటిది తెలుగు సాహిత్యానికే ఆదికావ్యం వ్రాస్తున్న క్రమంలో నన్నయ్య తన పీఠికలో తన కవితా లక్షణాలను తానే వివరిస్తూ ఈ పద్యం రాశారు. తన కవిత్వంలో కనిపించే లక్షణాలుగా మూడిటిని రాసుకున్నారు నన్నయ్య[2]:

  1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి
  2. అక్షర రమ్యత
  3. నానారుచిరార్థ సూక్తి నిధిత్వం

కవి తాను ముందుగా సూచించిన తన కవిత్వ లక్షణాలను పరిశీలించే విమర్శ సిద్ధాంతం ప్రకారం ఈ మూడు లక్షణాలను పలువురు విమర్శకులు నన్నయ్య కవిత్వంలో పరిశీలించారు. విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్న లక్షణాన్ని పరిశీలిస్తూ నన్నయ్యగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే విమర్శగ్రంథాన్ని రచించారు. మరెందరో రచయితల పీఠికల్లోనూ ఈ పద్యంలోని కవిత్వ లక్షణాలు ప్రాచుర్యం పొందాయి.

రాణి సుబ్బయ్య దీక్షితులు ఈ పద్యంలోని "జగద్ధితంబుగన్" అనే మాటను విశ్లేషిస్తూ, "భారత రచన చెయ్యడంలో వ్యాసమహర్షి దృక్పథం ధర్మం. నన్నయకు మాత్రం సమాజం ముఖ్యం. జగద్ధితంబుగన్ అనే మాటద్వారా మొత్తం మానవకోటి కల్యాణం కోసం నేను భారత రచన ప్రారంభిస్తున్నాను అని నన్నయ చెప్పాడు"[3] అని వివరించారు.

మూలాలు మార్చు

  1. వెల్చేరు, నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. తానా ప్రచురణలు.
  2. విశ్వనాథ, సత్యనారాయణ (2007). సాహిత్య సురభి (2 ed.). విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్. p. 9.
  3. "Pravachanas in 02 Sabha Parvam (Audio files) - part 01 (8:20 min) and Part 02 (9:51 min)". ప్రవచనం.కామ్. Archived from the original on 2015-06-12. Retrieved 2016-10-28.