1932 కమ్యూనల్ అవార్డు

1932 కమ్యూనల్ అవార్డు 16 ఆగస్టు 1932న బ్రిటీష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డొనాల్డ్ బ్రిటీష్ ఇండియాలో ఉన్నత కులాలు, నిమ్నకులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్ఖులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ఎలక్టోరేట్లు ఏర్పరుస్తూ ప్రకటించారు. దీనిలో దామాషాను కూడా ఒక ప్రాతిపదికగా స్వీకరించారు.

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమయ్యాకా బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ప్రభుత్వం దీన్ని భారతదేశంలోని సమస్యలను తీర్చే చర్యగా పేర్కొనగా, జాతీయవాదులు, కాంగ్రెస్ వారు దీన్ని భారతీయులను విభజించే కుట్రగా ఖండించారు. ప్రధానంగా మహాత్మా గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

మహాత్మా గాంధీ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పచడంపై ఎలాగో సమాధానపడినా, కులాలవారీగా ఉన్నత కులస్తులను, నిమ్నకులస్తులను, దళితులను విడదీసి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచడం మాత్రం అంగీకరించలేకపోయారు. హిందూ సమాజంలో కమ్యూనల్ అవార్డు చీలిక తెస్తుందంటూ యెరవాడ జైల్లోంచి గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు. ఇదెలావున్నా ముస్లిం లీగ్ నాయకులు, సుప్రసిద్ధ దళిత నేత బి.ఆర్.అంబేద్కర్ దీన్ని ఎంతగానో స్వాగతించారు.

గాంధీ నిరాహార దీక్ష ఫలితంగా, అంబేద్కర్ తో విస్తారమైన, లోతైన చర్చల ఫలితంగా చివరకు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను వదిలిపెట్టి, దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని అంగీకారానికి వచ్చారు.

మూలాలు మార్చు

Menon, V.P. (1998). Transfer of Power in India. Orient Blackswan. p. 49. ISBN 978-81-250-0884-2.