భారత ప్రభుత్వ చట్టం - 1935

(1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము నుండి దారిమార్పు చెందింది)

20 వ శతాబ్దపు మూడవ దశాబ్దము నుండి అతి శక్తివంతముగా జరుగుచుండిన శాంతియుత స్వరాజ్యోద్యమముల తాకిడి వలన నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వము మరోసారి రాజ్యాంగ సంస్కరణల పేరట 1933 లోప్రారంభించి చేసిన చట్టమును 1935 సంవత్సరము డిసెంబరులో శాసనముగా చేయబడెను. బ్రిటిష్ ఇండియా చరిత్రలో కల అనేక విశేషములలో 1935వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము మరొక విశేషమైన చరిత్రాంశము. దాదాపు రెండు శతాబ్దములనుంచీ నిరంకుశముగా పరిపాలించుచున్న బ్రిటిష్ ప్రభుత్వము వారు భారతదేశమును తమ బానిస రాజ్యముగనుంచుకునటకు చేసిన అనేక రాజ్యతంత్రములలో 1935 చట్టము ద్వారా ప్రసాదించిన రాజ్యాంగము మరియొక రాజ్యతంత్రము. ఆ చట్టముద్వారా భారతదేశానికి అబ్బే రాజ్యాంగము రాజకీయ దాస్యమును ఆర్థికదుస్థితిని ఇంకా పొడింగచేందుకేనని గ్రహించిన భారతదేశ ప్రజలు, ప్రజానాయకులు, అఖిలపక్షముల జాతీయ నాయకులు ఆ చట్టము ద్వారా కలుగు క్రొత్త రాజ్యాంగమును తిరస్కరించుటలో కాంగ్రెసుతో ఏకీభవించుట వలన గాంధీజీ నాయకత్వములో కాంగ్రెస్సు వారు స్వతంత్రోద్యమమును శాస్త్రోక్తముగ క్రొత్తఉ్యూహములు అవలంబించి 1937 నుండి ఇంకా శక్తివంతముగనూ, శాంతియుతముగ సాగించారు

పూర్వోత్తర చరిత్రాంశములు (1931-1937) మార్చు

1931 మార్చిలో జరిగిన గాంధీ-ఇర్విన్ సంధి బ్రిటిష్ సార్వభౌమత్వమునకు అవమానమైనదని, భారతదేశములో స్వతంత్రోద్యమమును, కాంగ్రెస్ పార్టీని అతిస్వల్పకాలములోనే అణచి తుడిచిపెట్టగలనన్న నమ్మకము కలవాడునూ, సామ్రాజ్యతత్వవాదైనట్టి లార్డు విల్లింగ్డన్ వైస్రాయిగా ( లార్డు ఇర్విన్ తర్వాత) పదవిచేపట్టి నిరంకుశముగా నిషేధాజ్ఞలు విధించుతూ 1931 సంవత్సరమునుండి భారతదేశమును పరిపాలించసాగెను. అతనికి చేదోడుగా ఇంగ్లండు లోని ఐరోపాసంఘము వారు భారతదేశములో ప్రబలుచున్న స్వరాజ్యకాంక్ష, అందుకు ప్రోద్బలించుచున్న కాంగ్రెస్సుపార్టీ, వారి స్వరాజ్యాందోళనోద్యమముల నణిచివేయుటకు అవలంబింపవలసిన నిర్భందవిధానముల ప్రణాళికను కూడా ప్రకటించిరి. అట్టి నిర్దుష్ట పరిస్థితులందుకూడా మాటతప్పని గాందీజీ గాంధీ-ఇర్విన్ సంధి వప్పందమునకు కట్టుబడియుండి ఆ సంధి ప్రకారము రెండవ రౌండ్ టేబుల్ సభలో పాల్గొనెను. కాని ఆ సభయందు బ్రిటిష్ ప్రభుత్వమువారు తమ వైఖరిని బయట పెట్టక సభను ముగింపచేసిరి. గాందీజీ 1931 డిసెంబరులో ఇంగ్లండునుండి తిరిగివచ్చి దేశ రాజకీయ పరిస్థితుల పై వైస్రాయితో సంప్రతింపులచేయటకు సమయము కోరగా నిరాకరించబడెను. 1932 లో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరును జైలుకంపించబడిరి, కాంగ్రెస్సు సంస్ధలు అవైధానికమని (అశాసనీయము; illegal) అని ప్రకటించబడెను. లార్డు వెల్లింగటన్ చేసేటటువంటి అనేక నిర్ధుష్టమైన నిషేధాజ్ఞలను అప్పటి శాసనసభలలోనుండిన ప్రభుభక్తులు శాసనములుగా చేయసాగిరి. ఒకప్రక్కన నిరంకుశ నిషేధాజ్ఞలు, నిర్భంధ విధానములతో అతి క్రూరముగా అమలుచేయుచున్న పోలీసులు చర్యలవల్ల చెరసాలలోమగ్గుతున్నవారు, లాఠీ దెబ్బలతో అంగవైకల్యములు కలిగినవారు, ప్రాణాలు పోగొట్టుకున్నవారు అనేకులుంటూవుండగా వైస్రాయి వెల్లింగటన్ కాంగ్రెస్ వారి ఆందోళనోద్యమములు అణిచిపోయినవని ఇంగ్లండు లోని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారికి నచ్చచెప్పుచుండెను. అట్టి పరిస్థితులలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారు భారతదేశమున కొత్త రాజ్యాంగ విధానమును ప్రవేశపెట్టుటకు విచారణలు జరుపుదుమని మూడవ రౌండ్ టేబుల్ సభకు కాంగ్రెస్ నాయకులనాహ్వానించిరి. కాని కాంగ్రెస్ ప్రభ్రుతులు ఆ రౌండ్ టేబుల్ సభలో పాల్గొన నిరాకరించగా బ్రిటిష్ ప్రభుభక్తులకొందరను ఆహ్వానించి చర్చలు జరిపి వారు చేయదలచిన రాజ్యాంగవిధానమునకు 1933లో వైటపేపర (White Paper) అనబడు ప్రణాలికను ప్రకటించిరి. ఆ ప్రణాలికలో సూచించబడిన రాజ్యాంగవిధానము దేశ ప్రజలకు రాజకీయనాయకులకు తీవ్ర అశాభంగముగానుండినది. అందుచే ఆ ప్రణాలికను చర్చించుటకు లార్డు లిన్ లిత్గొ అద్యక్షతన నొక పార్లమెంటు సంఘమునింయమించి అందు భారతీయ ప్రముఖులుకొందరిని సభ్యులుగచేసి కొన్ని సవరణలు చేసి ( ప్రభుత్వపు నిరంకుశ అధికారములను కొంచం పల్చబరచి) ఒక నివేదిక తయారిచేసి దాని ప్రకారము చిత్తు చట్టమును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చివరకు 1935లో చట్టరూపముగా బ్రిటిష్ పార్లమెంటు వారి ఆమోదముపొందిన తరువాత ఆ చట్టము 1935 డిసెంబరు నెలలో భారతదేశానికి నూతన రాజ్యాంగముగా చేయబడి 1937 ఏప్రిల్ 1 వ తేదీనుండి రాష్ట్రములలో అమలు చేయదలచి బ్రిటిష్ ప్రభుత్వము తగు సన్నాహములు చేయసాగెను.[1]

నూతన రాజ్యాంగమబ్బిన తరువాత చరిత్రాంశములు(1936-1937), రాష్ట్రములలో కాంగ్రెస్స్ ఫ్రభుత్వ స్థాపన మార్చు

బ్రిటిష్ ప్రభుత్వము వారు క్రొత్త రాజ్యాంగమును 1937 ఏప్రిల్ 1 వ తేదీనుండి అమలుచేయుటకు తగు సన్నాహములు చేయుచుండగా ఇచ్చట కాంగ్రెస్సు నాయకులు గాందీజీ నాయకత్వములో ఆ నిర్దుష్ట రాజ్యాంగమును విఫలము చేయుటకు శాస్త్రయుతమైన శాంతియుత విధానము నవలంబించిరి. భారతదేశములో జాతి మత వైషమ్యాల వల్ల ప్రజాతంత్రము నడువసాగదని భ్రిటిష్ వారి అంచనా. భారతదేశమునకు బ్రిటిష్ ప్రభువులిచ్చు కేంద్రీకృతముగనుండెడి కొత్తరాజ్యాంగములో తాముకూడా భాగీదారులుగ నుండుటకు స్వదేశ సంస్థానప్రతినిధులు 1932 లో జరిగిన రెండవ రౌండు టేబుల్ సమావేశములో తమ సమ్మతి తెలిపిరి. అది బ్రిటిష్ ప్రభువులకణుగమైన సమ్మతి. స్వదేశ సంస్తానాధీశులందరు నిరంకుశ పరిపాలకులైయుండినందున వారి సంస్థానములలో శాసనసభలునెలకొల్పు రాజ్యాంగము భారతదేశమునకిచ్చి ప్రజాపరిపాలనా పధ్దతి నెలకొలిపితిమనిపించుకునిరి.చూడు బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు ( దానికి తగట్టుగనే బ్రిటిష్ వారు 1909సంవత్సరపు సంస్కరణలో (మింటో-మార్లే సంస్కరణలు) అల్పసంఖ్యలకనిచెప్పి మహ్మదీయులకే కాక ఇతర వర్గములవారికినీ ప్రత్యేక నియోజక వర్గములు నెలకొల్పి జాతి మతవైషమ్యాలను పెంపొందిచే (విభజించి పరిపాలించమన్న సూత్రము తో) ప్రభుత్వ పరిపాలన సాగించుచుండిరి. 1919 సంవత్సరములో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణల (మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము) వల్లనెలకొలపబడ్డ కేంద్ర, రాష్ట్ర శాసన సభల లోని సభ్యులందరూ కాంగ్రెస్సు పార్టీకి చెందనందున ఏకీకృతాభిప్రాయములేక నిశ్చిత తీర్మానములు చేయబడుట లేదనీ అప్పటికి 1937 ఫిబ్రవరిలో వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్సు సభ్యులు అధిక సంఖ్యలో రాజాలరని బ్రిటిష్ ప్రభుత్వ అంచనాను విఫలము చేయ కాంగ్రెస్స్ నాయకత్వము నిశ్చయించారు. అందుకణగుణముగా యావద్భారతదేశములోని అన్ని రాష్ట్ర శాసససభలకూ (1937 నాటి 11 రాష్ట్రములు) కాంగ్రెస్సు సభ్యులు అధిక సంఖ్యలో పోటీచేసి ఏన్నికలలో ఏడురాష్ట్రములలో అధిక ఓట్లతో ఘనవిజయము సాధించి కాంగ్రెస్సు ప్రభుత్వోదయము చేసి ఫ్రబుత్వమువారి అంచనాలకు విరుధ్దమగు ఫలితములు కలుగచేసిరి. అయితే క్రొత్తగా వచ్చిన రాజ్యాంగములో గవర్నర్ జనరల్ కు, రాష్ట్ర గవర్నర్లకు నిరంకుశమైన విశేషాధికారములు యధావిధిగా అమలులోనుండబట్టి ప్రజాభిప్రాయము, రాజ్యాంగ మర్యాదకి స్థానములేక శాసనసభలు, మంత్రుల నిర్ణయాలు త్రోసిబుచ్చబడగలవు. అందుచే ప్రజాపరిపాలన విషయములో గవర్నర్లు, గవర్నర్ జనరల్ ఆటంకములు పెట్టరను ఆశ్వాసనము ఇచ్చే వరకూ తమ మంత్రులు పదవులు చేపట్టగూడదను ఒక తీర్మానము 1937 మార్చిలో కాంగ్రెస్సు మహాసభలో చేయబడెను. కొంత నిరాకరణ, విముఖత చూపి ఎట్టకేలకు 1937 జూలై మాసములో బ్రిటిష్ ప్రభుత్వము వారు మెట్టు దిగివచ్చి కాంగ్రెస్సు వారికి తగు ఆశాస్వన మిచ్చిన తరువాత కాంగ్రెస్సు మంత్రులు పదవీ స్వీకరించి ఆ ఏడు రాష్ట్రములలో ప్రజాపరిపాలన మొదలుపెట్టిన తరువాత భారతదేశములో నూతన యుగము ఆరంభమైనదని చెప్పవచ్చును.[1]. కానీ దాదాపు 200 సంవత్సరముల బ్రిటిష్ పరిపాలనక్రిందయుండుటవలన 1947 తరువాతగూడా స్వతంత్ర భారతదేశములో బ్రిటిష్ ప్రభుత్వపరిపాలనా విధానము ఒకనమూనాగా నిలచిపోయినటుల కనబడుచున్నది. 1935 సంవత్సరపు ఇండియా రాజ్యాంగచట్టమే పరిణామములతో స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగమైనదని అనడములో ఆశ్చర్యములేదన్నాడు ప్రముఖ చరిత్రకారుడు బి.కె. నెహ్రూ.[2]

చట్టము ద్వారా కలగిన నూతనరాజ్యాంగ వివరములు మార్చు

1937 సంవత్సరము నూతన రాజ్యాంగము అమలు చేసేనాటికి రాజకీయముగా భారతదేశమునందు అనేక స్వదేశ సంస్థానములున్నవి. వాటిని స్వతంత్ర రాజ్య పరిపాలకుల (నవాబులు, రాజాలు, మహారాజాలు) క్రిందనుండిననూ సర్వచత్రాదిపత్యము బ్రిటిష్ ప్రభుత్వమువారిదే. అటువంటి స్వదేశ సంస్థానములు ప్రిన్సిలీ స్టేట్స్ (Princely States) బ్రిటిష్ ఇండియాలో లేనివి హైదరాబాదు, మైసూరు, జమ్మూ-కాశ్మీర్ లాంటివి దాదాపు 600 దాకా నుండెడివి. అవన్నీ తదుపరి 1947-48 లో ఇండియ డొమీనియన్ (Dominion of India. చూడు అధినివేశ స్వరాజ్యము) లో కలసిపోయినవి.[2] అంతేకాక భారతదేశములో సరాసరి బ్రిటిష్ గవర్నర్ల పరిపాలన క్రింద బ్రిటిష్ ఇండియా లోని రాష్ట్రములు (మద్రాసు, బొంబాయి మొదలగునవి). అట్టి రాష్ట్రములు కూడా బ్రిటిష్ ప్రభుత్వము క్రింద సర్వాధికార పరిపాలకుడైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ద్వారా పరిపాలించ బడుచుండెను. 1937 ఏప్రిల్ మాసములో అమలు చేసిన నూతన రాజ్యాంగము "ఫెడరేషన్" అనేటటువంటి కేంద్ర ప్రభుత్వము స్థాపించబడెను. భారతదేశమును పరిపాలించు గవర్నర్ జనరల్ ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభుత్వమందలి ఇండియా రాజ్యాంగ మంత్రికి లోబడి కార్యాచరణచేయును. భారతదేశానికి గవర్నర్ జనరల్ సర్వాధికారి. అతని సహాయార్దం, సలహానిమిత్తము నొక మంత్రిమండలినుండెను.శాసనములు చేయుటకు రెండు శాసన సభలుండెను. కాని ఆ చట్టము ద్వారా భారతదేశానికి ప్రజాప్రభుత్వ పద్ధతులుగాని రాజ్యాంగ మర్యాదలు గాని లేని రాజ్యాంగమును బ్రిటిష్ సార్వభౌములు ప్రసాదించారు. బ్రిటిష్ గవర్నర్లు, గవర్నర్ జనరల్ కు నిరంకుశాధికారములివ్వబడి ప్రజాప్రభుత్వ సిధ్దాంతములకు విరుద్దముగానుండిన రాజ్యాంగము, బ్రిటిష్ పౌరులు, వారి వ్యాపారము నకు పక్షపాతమైనట్టి రాజ్యాంగము ( అదియే రాజకీయ దాస్యము. ఆ సంగతి చట్టములోని వివిరములు నిరూపించగలవు). అప్పటిలో (1930-1940 సంవత్సరాలు) లో భ్రిటిష్ సామ్రాజ్యములోని అదినివేశ స్వరాజ్యములు (Dominions) కెనడా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మొదలగు దేశములకివ్వ బడిన రాజ్యాంగములో దేశ పరిపాలనా వ్యవహారములలో బ్రిటిష్ గవర్నర్లు గానీ గవర్నరజనరల్ గాని ఏవిధమైన జొక్యముచేసుకునే హక్కు ఇవ్వబడలేదు. కానీ 1935 సం|| చట్టముద్వారా భారతదేశానికి ప్రసాదించిన రాజ్యాంగము అటువంటి అధినివేశస్వరాజ్యము కలిగించిన రాజ్యాంగము కాదు. కీలక పరిపాలనావిషయములలో గవర్నర్ జనరల్ కు స్వబుధ్దినుపయోగించి (individual judgement) వ్యవహరించవలయునని ఆ చట్టములో చెప్పబడియున్నది. అతనికి సహాయసలహా నిమిత్తము నియమించబడ్డ మంత్రిమండలి సలహా ప్రకారము స్వబుధ్ది కలుగదుకనుక ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సలహాను త్రోసి పుచ్చగల నిరంకుశాధికారమిచ్చినటులనే. ఆ చట్టమే బ్రిటిష్ చక్రవర్తి పేరట గవర్నర్ జనరల్కు, గవర్నరల్లకు ఇచ్చిన రాజనిర్దెశ పత్రము అనబడినది

ఆ చట్టములో గల 308 ప్రకరణలు (sections), వాటిలోని వివిధ భాగములు (subsections), పరిఛ్చేదములు (clauses), నిబంధనలు (rules and regulations) పేర్కొనబడిన వివరాలు కొన్ని మాత్రమే ప్రజాప్రభుత్వరహితమైన రాజ్యాంగమని నిరూపించుటకు ఈ క్రింద ఇవ్వబడినవి. పూర్తి వివరాలకు మూల పుస్తకము చూడవలయును.[3].
(1) ఇంగ్లండు లోని పార్లమెంటుకు భారతదేశ పరిపాలనా విషయములో సర్వాధిక్యతకలిగి వారి ప్రతినిధిగా గవర్నర్ జనరల్ (వైస్రాయి) భారతదేశమును పరిపాలించును.
(2) గవర్నర్ జనరల్ స్వతంత్ర వివేకమునుపయేగించి నిర్ణయించవలసినవిగా శాసించ బడిన విషయములు:
విదేశ వ్యవహారములు, దేశ రక్షణ, క్రైస్తవమత అబివృధ్ది, దేశ ఆర్థికాభివృధ్ది, ఐ.సి.యస్ అధికారుల కట్టుదిట్టములు, ఇంగ్లీషు సరుకులను నిరోధించు విషయములు, ఇంగ్లీషుప్రజలు ఈ దేశానికి వచ్చి వ్యాపారముచేసి లాభములు సంపాదించుటకు ఆటంకము లేకుండా చేయు బాధ్యత గవర్నర జనరల్ కే ఇవ్వబడింది.
(3) కేంద్ర, రాష్ట్ర శాసన సభలకు పై విషయములలో గవర్నర్ జనరల్ వద్ద ముందుగా అనుమతి పొందితే తప్ప శాసనములు చేయుటకెట్టి అధికారములేదు
(4) 50వ సెక్షన్ ప్రకారము రాష్ట్రముయొక్క పరిపాలనాధికారము ఇంగ్లండు దేశ బ్రిటిష్ చక్రవర్తి తరఫున గవర్నర్ స్వయముగాగానీ, తన తాబేదారులద్వారా గాని పరిపాలించవలయును. గవర్నర్ కు సలహానిమిత్తము నియమించబడ్డ మంత్రి మండలికి అవసరమైనచో గవర్నర్ అధ్యక్షత వహించవచ్చును.
(5) 51వ సెక్షన్ ప్రకారము గవర్నరే రాష్ట్రమంత్రులను నియమించును మంత్రలను నియమించుటలోను, తొలగించుటలోను గవర్నరే తన స్వంతవివేకముతో చేయవలయును
(6) 52వ ప్రకరణము: గవర్నరు ఇచ్చిన ప్రత్యేక బాధ్యతలు సూచించ బడినవి. అందులో ముఖ్యమైనవిగా రాష్ట్రములో శాంతి భద్రతలు కాపాడుట, అల్పసంఖ్యాకుల హక్కులు, ఉన్నతప్రభుత్వోద్యోగుల హక్కులను సంరక్షించుట, పరిపాలనా కార్యనిర్వాహక మండలమును కట్టుదిట్టములు చేయుట, గవర్నర్ జనరల్ జారీచేయు ఉత్తర్వులను, సూచనలను అమలు చేయుట మొదలగునవి.
(7) 53 నుండి 77 ప్రకరణములు: చక్రవర్తి ఇచ్చిన రాజనిర్దేశ పత్రము (ఈ చట్టము) లోని అంశములకు భిన్నముగా గవర్నర్ జనరల్ సూచనలు చేయరాదు.శాసనసభలు చేయు తీర్మానములు, చిత్తు చట్టములు చక్రవర్తి పేరట గవర్నర్ అంగీకారము, తిరస్కారము చేయవలను. శాసనసభలుచేసిన తీర్మానములు, ఆమోదించిన చట్టములు 12 నెలలో పల నిరాకరించబడవచ్చు. శాసనసభలు సమావేశ పరచుటకు వాయిదా వేయుటకు గవర్నర్లకు అధికారమివ్వబడింది.
(8) 78నుండీ-100వ ప్రకరణము: శాసనసభలయందు ఇంగ్లీషు భాషనే ుపయోగించవలెను. ఇతరభాషలో ప3సంగించుటకు అవకాశమివ్వబడును. హైకోర్టు ఆ తదిర పై కోర్టు జడ్జీల ఉద్యోగసంబంధమగు ప్రవర్తనను శాసనసభలో చర్చించరాదు. శాసనసభ సమావేశములో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయవచ్చును. అవి 6 నెలలు అమలులో నుండును. ఏ ఆర్డినెన్సునైననూ చక్రవర్తి నిరాకరించవచ్చును. ఆర్డినెన్సును పొడిగించు ఆర్డినెన్సు చేయుటకు గవర్నర్ జనరల్ తన పై అధికారి, ఇంగ్లండులోని ఇండియా రాజ్యాంగ మంత్రి అనుమతి, బ్రిటిష్ పార్లమెంటు ఆమోదముపొందవలెను.ట రాజ్యాంగచట్టము ప్రకారము రాజ్యాంగ యంత్రాంగము నడువదని చెప్పి గవర్నర రాష్ట్ర పరిపాలనము తానే చేపట్టవచ్చు
(9) 101 నుండి 120 వ ప్రకరణము: పాశ్చాత్యదేశమునుండి బ్రిటిష్ ఇండియాకు వచ్చుప్రజలపై విధించబడే నిషేధాజ్ఞలు ఇంగ్లండు, స్కాట్లాండు, వేల్సు దేశవాసులైన బ్రిటిష్ ప్రజలకు వర్తించవు. బ్రిటిష్ కంపెనీలపై విధించు పన్ను సాధరణకంటే ఎక్కువ వుండగూడదు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "The British Rule in India" D. V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 414-426
  2. 2.0 2.1 "Ethnonationalism in India" Edited by Sanjib Baruah (2012) Oxford India Paperback.Critical issues in Indian Politics. pp 139,406
  3. "రాష్ట్రీయ స్వపరిపాలనము (నూతన ఇండియా రాజ్యాంగ చట్టము)" దిగవల్లి వేంకట శివరావు (1937) విజ్ఞాన చంద్రికామండలి- రాజకీయ ప్రచురణలు, విజ్ఞాన చంద్రికా మండలి, సౌభాగ్య ప్రెస్సు బెజవాడ పేజీలు88