పీయూష లహరి (Piyusha Lahari) జయదేవుడు రచించిన ప్రముఖ సంస్కృత గోష్ఠీ రూపకము. దీనికి కథావస్తువు గీత గోవిందంలోని కథా వస్తువైన రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపడము కథాంశము. అందువలన పీయూష లహరిని గీత గోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడ్డాడు.

పీయూష లహరి
పీయూష లహరి పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: వావిలాల సోమయాజులు
సంపాదకులు: డా. వి.వి.యల్.నరసింహారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
విడుదల: 1990

గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు, 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు. అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులు ఉండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి, కామ శృంగార ప్రధానం.

పీయూష లహరి పై మొదటగా భారతి పత్రికలో వావిలాల సోమయాజులు ఒక సుదీర్ఘ వ్యాసం రచించారు. తరువాత తెలుగు అనువాదాన్ని, సంస్కృత మూలంతో సహా తెలుగు విశ్వవిద్యాలయం 1990 సంవత్సరంలో ముద్రించింది.

చరిత్ర మార్చు

ప్రాచీనకాలంలో పూరీలోని జగన్నాథ స్వామి ఆలయంలో అనేకములైన ఏకాంక నాటికలను ప్రదర్శించేవారు. పీయూష లహరిని కూడా అటువంటి నాటక సమాజంతో కలిసి జయదేవుడు ప్రదర్శించినట్లు దీనిలోని "గోష్ఠీ శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే సర్తితుమ్" అన్న వాక్యం వల్ల వ్యక్తమౌతున్నది. ఇటువంటి నాటక సమాజాలు నేడు కూడా అచ్యుతానంద సంప్రదాయులైన వైష్ణవుల్లో కనిపిస్తున్నది. వీరు రాధను ప్రధాన నాయికగా గ్రహించి జగన్నాథ స్వామి ముందు రాసక్రీడలు సలుపుతుంటారు.

పాత్రలు మార్చు

  • మాధవుడు = నాయకుడు
  • రసలకుడు = సఖుడు
  • రాధిక = నాయిక
  • నవమాలిక = సఖి
  • ప్రేమకళ = సఖి
  • వకుళమాలిక = సఖి

నాంది మార్చు

ప్రకట కేసరపుంజ పింజర దళత్కనక

పంకేజ విలసనము శంపా మనోజ్ఞాంశు

మధు శర త్కాదంబినీ డంబరోజ్జ్వలము

పార్వతీ మృదునటోల్లాస లాస్యాంచితము

చక్ర క్రమోన్నట త్సాంబశివ చండ తాం

డవము నిర్వ్యాజమ్ము క్షేమప్రథమ్మగుచు

సంపూర్ణ దృష్టితో జగము నేలెడుగాత !


క్రీడగా కంపించు చంపకమ్ములు గాలి

దేలి చుంబింపగా లీల దూలెడి నల్ల

కలువపూ సొగసు నొల్కించుచును తేలగా

రాస లీలా విలాసముల లాలసలతో

పల్లవీ పల్లవీకృత వల్గిత జ్యోతి

నిరతమ్ము మా యెదల నెలిమి శోభించుతను.

ముగింపు మార్చు

సకల జగమ్ముల నిరతము

శుభములు ప్రాప్తించుగాక !

రిపులకైన నపకారము

లెపుడు కలుగకుండుగాక !

సర్వేశుడు జగదీశుడు

కపటదారు విగ్రహ వే

షమ్మున కరుణాకటాక్ష

వీక్షణలహరీ తరంగ

ప్రసరణలను, బహుగతులను

ప్రణయముతో పంపుగాక !

మూలాలు మార్చు

  • పీయూష లహరి, శ్రీ జయదేవ కవి విరచిత సంస్కృత గోష్ఠీ రూపకానికి శ్రీ వావిలాల సోమయాజుల తెలుగు అనువాదం, మూల సహితంగా ముద్రితం, సంపాదకుడు: డా. వి.వి.యల్.నరసింహారావు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1990.