ఉదాహరణ వాజ్మయము

తెలుగు సీమకే వెలుగుతెచ్చిన లఘుకృతులలో ఉదాహరణలు ప్రముఖస్థానము వహిస్తాయి. ఉదాహరణ అంటే మచ్చు అనే అర్ధంలో వాడుక ఉంది. ప్రబంధాలు లాగే ఆంధ్రసారస్వతానికి విశిష్టతను చేకూర్చిన ఒక శాఖకు ఉదాహరణ అని పేరు ఉంది. ఈరచనకు శ్రీకారాన్ని చుట్టినవాడు వీరశైవ మహాకవి అయిన పాల్కురికి సోమనాధుడు. సంస్కృతంలో కూడా ఈకవి ఉదాహరణను రచించి ఖ్యాతిపొందాడు.

ఎనిమిది విభక్తులతో ఎనిమిది పద్యాలు, కళికలు, ఉత్కళికలు కలిగి భక్తిభావ బంధురంగా ఉండే రచనా విశేషానికి ఉదాహరణ అని పేరు. ఈ ఉదాహరణకి చివర సార్వవిభక్తంగా ఒక వృత్తం కూడా ఉంటుంది. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాధుడు మొట్టమొదట బసవోదాహరణము అనే గ్రంథాన్ని రచించేడు. సంగీత, సాహిత్యాలను మేలవించి, మార్గదేశ, కవితలకు చక్కని సమంవయాన్ని కుదిర్చిన ఉదాహరణలు ఆంధ్రసాహిత్యంలో ధ్రువతారలు.

ప్రతీ ఉదాహరణలోనూ వృతము, కళిక, ఉత్కళిక అనే మూడు భాగాలు ఉంటాయి. ఉత్కళిక కళిక తాలూకు భాగమే కనక అందుకే కొందరు దీనిని రెండు భాగాలే అంటారు. కళికను, ఉత్కళికను కూడా దేశకవితకు తలమానికమైన రగడ అనే జాతీయ చందస్సు లోనే రచిస్తారు. ఇవి తాళాంగ ప్రధానము లవడము చేత, హృద్యంగా పాడుకోడానికి ఉపచరిస్తారు. ఇవి భక్తిభావాన్ని పెంపొందిస్తాయి కూడా.మధురగతి ఏకతాళము, వృషభగతి రగడకు త్రిపుట, ద్విరగతి రగడకు జంపె మొదలైన అనుగుణమైన తాళాల్ని లాక్షణికులు నిర్వచించేరు.

భాషా పరిణామానికి సంబంధించిన సరికొత్త విశేషాలు కూడా ఈ ఉదాహరణ వాజ్మయములో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క విభక్తికీ అనేకమైన ప్రత్యయములు ఉంటే అందరు ఉదాహరణ రచయితలే అవుదురు. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రయోగించి, మిగిలిన వాటిని పరిత్యజించేరు. ద్వితీయలో "ని" తృతీయలో "చే", "చేత", చతుర్ధిలో "కై", పంచమిలో "వలన" షష్టిలో "కు" సప్తమిలో "అందు" అనే ప్రత్యయాలని మాత్రమే ఉదాహరణ కవులు వాడేరు. బసవోదాహరణలో " ఇట్లుతులిత పుణ్యుడైన బసవయ్యకునై ప్రణమిల్లు చిత్తమా" అని ఉంది. చతుర్ధీ ప్రత్యయాలు "కై" "కొరకు" అని ఉండగా బసవయ్యకు "నై" అన్న ప్రయోగము చేసాడు కవి.

సంస్కృతాలంకారికులు, " యేనకేవాపి తాలేన గద్యం పద్య సమన్వితమ్| జయేత్యుపక్రమం, మాలిన్యాది ప్రాసవిచిత్రితం | తదాహరణం నామ విభక్త్యష్టాంగ సమ్యుతం " అని ఉదాహరణను నిర్వచించేరు. అయితే ఈలక్షణానికి లక్ష్యంగా ఇంతవరకు సంస్కృతంలో ఒక ఉదాహరణ కూడా లభించలేదని పరిశోధకులు తెలుపుచున్నారు. పాల్కురికి సోమనాధుడు ప్రచారం కోసం సంస్కృతంలో వ్రాసిన ఉదాహరణ తెనుగులో రాసిన దానికి తు.చ తప్పని అనుకరణమే. కాళిదాసు రఘువంశం లోనూ, విక్రమోర్వశీయం లోనూ ఉదాహరణలను పేర్కొనడముచేత, నేడు అవి లభ్యము కానప్పటికి, సంస్కృత కవులు కూడా ఈవిధమైన కావ్యలని వ్రాసేరని మనం ఊహించవచ్చును.

నేడు తెలుగులో లభించిన ఉదాహరణ కావ్యములు దేశ కవితకు అలంకార భూతములు అయినా, వాటికి సంస్కృత సంపర్కము ఉందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మార్గకవితకు ఆశ్రయమైన వృత్తాల్ని ఈరచనలలో ప్రయోగించారో అప్పుడే సంస్కృత సంపర్కము కలిగిందని చెప్పవచ్చును. ఉదాహరణలకు ఆది పురుషుడే అయిన సోమనాధుడు వృత్తలలోనూ, రగడలలోనూ విరివిగా సంస్కృత పదజాలాన్ని వాడాడు.

మాననీయులు పూజ్యపాదులు అయిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు బసవోదాహరణాన్ని పరిశీలించి ప్రచురించేరు. చతుర్ధీ విభక్తి కళికలో మాత్రము ఆఖరు రెండు పాదాలు లేవు. అవి శ్రీ శాస్త్రి గారికి లభించలేదు కాబోలు.

తరువాత వెలసింది త్రిపురాంతకోదాహరణం. కాలక్రమేణ ఇది రెండోదైనా, రచనా కోశలములో మాత్రము ఎది అగ్రస్థానము వహిస్తుందని చాలా మంది విమర్సకుల అభిప్రాయము. దీని మూలప్రతి తంజావూరు సరస్వతీ గ్రంథ భాండాగారంలో లేకపోవడము చేత దీనిని రచియించిన వాడు "గుండయ" కవి అయి ఉంటాడని గిడుగు వెంకటరామమూర్తి పంతులుగారు మొదట భావించారు. అటుపై దీనిని పరిశీలించిన నిడదవోలు వెంకటరావు పంతులుగారు ఈ గ్రంథము రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసాడని, అతని వాడుక పేరు తిప్పన్న అని నిర్ధారణ చేసారు. ఈకవి 14వ శాతాబ్దములో జీవించాడు. మహాకవి అయిన శ్రీనాధుడు పొగడ్తకు ప్రాతుడైనాడు. ఈ ఉదాహరణనే కాకుండా రావిపాటి తిప్పన్న అంబికాశతకము, చంద్రతారావళి, సంస్కృతములో ప్రేమాభిరామం మొదలైన గ్రంథాలని రచించాడు. త్రిపురాంతకోదాహరణంలో శివలీలల్ని మనోహరముగా వర్ణితమయినాయి. శివాద్వైతానికి కవి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు. సాంఖ్య తొండడు, బల్లహుడు, కన్నప్ప, సేనమరాజు మొదలైన భక్తుల గాథలను కవి ఈ ఉదాహరణంలో మనోహరముగా చిత్రించాడు. ఇతను కళికలో అనేకమైన శివలీలలనుగాని గాథలను గాని వివరించి, ఉత్కళికలో సాధారణంగా ఏదో ఒకగాధను మాత్రమే వెలువరుస్తాడు.

అటుపై వచ్చినది వెంకటేశ్వరఉదాహరణము. దీనిని తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు వారు రచించారు. ఇది 16వ శతాబ్దములో వెలువడినది. పెదతిరుమలాచార్యులు గారు వీరి తండ్రి అయిన అన్నమాచార్యులు వారు, పెదతిరుమలాచార్యులు గారి కుమారులు చిన పెదతిరుమలాచార్యులు వారు సంగీతములో విశేష కృషి చేసిరి. దీనిలో సార్వ విభక్తిక పద్యం పూర్తి అయినాక షష్ట్యంలతో కూడిన అంకితాంక పద్యం రచించాడు. వృతాలలో వెంకటేశ్వర ప్రభావాన్ని, రగడలలో రామ కృష్ణాద్యవతారాలకు సంబంధించిన లీలా విశేషాలని ఈ కవి ఎంతో మనోహరముగ రచించాడు.

ఈ విధంగానే మరికొందరు కవులు వ్రాసిన అప్పకవికృష్ణోదాహరణ (అలభ్యం), చిత్రకవి పెద్దన హనుమోదాహరణ నిడదవోలు వెంకటరావు -శ్రీరామోదహరణ, బుర్ర కమలాదేవి- సామగాన ప్రియోదాహరణము, మొదలైనవి కూడాఅ ఉన్నాయి.

విభక్త్యాంతాల విశిష్టత ఉదాహరణ గ్రంథాలలోనే కాకుండా, మరొక విధంగా కూడా మనకు వ్యక్తమవుతున్నది. సంబోధనతో ఆశ్వాసాన్ని ప్రారంభించడం, గ్రంథ ప్రారంభానికి ముందు కృతిపతిప్రశంసలతో కూడిన షష్ట్యంతా లుండడము ప్రబంధపాఠకులకు తెలిసిన విషయమే.