ఉప్పల లక్ష్మణరావు

ఉప్పల లక్ష్మణరావు నవల రచయితగా, అనువాదకునిగా సుప్రసిద్ధుడు. ఆయన నేటి ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1898లో జన్మించారు.

ఉప్పల లక్ష్మణరావు
జననంఉప్పల లక్ష్మణరావు
(1898-08-11)1898 ఆగస్టు 11
బరంపురం, ఒడిషా
మరణం1985 ఫిబ్రవరి 22(1985-02-22) (వయసు 86)
వృత్తివృక్షశాస్త్ర ఉపన్యాసకుడు, సంపాదకుడు, ప్రగతి ప్రచురణాలయం, మాస్కో
ప్రసిద్ధితెలుగు అనువాదకుడు, రచయిత
భార్య / భర్త మెల్లీ షోలింగర్

వృత్తి-వ్యక్తిగత జీవితం మార్చు

ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించారు. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సారస్వాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో "వికాసం" అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.

సాహిత్య రంగం మార్చు

లక్ష్మణరావు "అతడు-ఆమె" నవల రచన ద్వారా తెలుగు నవల రంగంలో కీర్తిని ఆర్జించారు. మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రిక నవల. ఈ నవల పాఠకుల ఆదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా పొంది లక్ష్మణరావును రచయితగా సుపరిచితుల్ని చేసింది.

రచనలు మార్చు

లక్ష్మణరావు "బతుకు పుస్తకం" పేరిట తన ఆత్మకథను రచించారు. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా రష్యాలో దాదాపు 40 రష్యన్ గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువాదం చేశారు.[1]

రచనల విశిష్టత మార్చు

డా.వుప్పల లక్ష్మణరావుగారు అతడు ఆమె భార్యాభర్తల డైరీ రూపంలో రాసారు. ఈ నవల మొదటగా దిగుమర్తి వారికుటుంబంలో ఓ లిఖితపూర్వకంగా కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితమయి పత్రిక నడుపుకునేవారు. దాని పేరు "ఉషఃకాలం" ఈ పేరుతో geni.com లో కొన్ని వివరాలు ఉన్నాయి.ఈ నవల మొదటి రెండుభాగాలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ వారు అచ్చు వేయడానికి నిశ్చయించి లక్ష్మణరావుగారిని అడిగారు. సరే కాస్త ఆగండి అని దాని నకలు బరంపురంలో వారింటికి పంపారు. అది చదివిన వారమ్మగారు ఏముంది ఇందులో...దేశమంతా స్వాతంత్య్రం కోసం గగ్గోలు పెడుతుంటే ఇందులో ఇంట్లో జరిగే భర్త భార్య గొడవలేవున్నాయి అని చమత్కరిస్తే...దానికి స్పందించి లక్ష్మణరావుగారు అతి స్వల్పవ్యవధిలో దానిని తిరిగి రాసేరు..కన్యాశుల్కం ఏలా ఐతే గురజాడ తిరిగి రాసేరో...లక్ష్మణరావుగారి అతడు-ఆమె తెలుగులో భారతస్వాతంత్ర్య సమరాన్ని ఓ భార్యా భర్త డైరీరూపంలో ఆవిష్కరించిన తొలి తెలుగు నవల. బహుశా ఇంకే దేశీయభాషల్లో ఇంతటి విశ్లేషణాత్మక నవల రాలేదనే నా అభిప్రాయం. స్వామ్యవాదం పట్ల ఆకర్షణ...దానికి సానుభూతిపరులుగావుంటూ..ఆయన ఆయన భార్య "మెల్లీ జోల్లింగరు" చాలా సేవలు చేశారు. దానిలో భాగంగానే వారిరువురు మాస్కో వెళ్ళడం. ఆమే యూరోపియన్ కరస్పాండెంట్ గా ఉండేవారు. ఈయన ప్రగతి ప్రచురణలు మాస్కోలో తెలుగు విభాగం ప్రారంభించి...రష్యన్ భాషనుంచి తెలుగుకు నలభైకి పైగా అనువాదాలుచేసారు. ఆయన మాటల్లో చెప్పాలంటే"నాకు అత్యంత ఆనందం సంతోషం కలిగించిన విషయం ఏదయినా వుందంటే అది నేను ముఖ్యసంపాదకునిగా మేం తయారుచేసిన తెలుగు రష్యన్ నిఘంటు మాత్రమే" అని హాయిగా చెప్పేవారు. ఇది సాధికారతతో నేను చెప్పడానికి కారణం.1972 నుండి ఆయన మరణం వరకూ సుమారుగా వారానికి రెండు మూడు సార్లు వారింటికి వెళ్ళేవాడిని. వారింట్లో సుమారు సభ్యునిగా కూడా మసిలేను. 1974 నుండి 1975/1976 వరకూ ఆయన మాస్కోనుండి తిరిగి వచ్చిన తరువాత అతడు- ఆమె మూడోభాగం మళ్ళీ జనార్ధనం శుభ పాత్రలడైరీలరూపంలో తెలంగాణాలో జరిగిన నిజాం వ్యతిరేకపోరాటాన్ని ఈ మూడోభాగంలో అక్షరీకరించేరు. 1976లో ఈ మూడో భాగం ఆవిష్కరించారు. ప్రచురణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ఈ మూడో భాగాన్ని వికాసంకు, శుభపాత్రకు ప్రాగ్రూపమయిన వారి మానస పుత్రిక కీ. శే. బచ్చు దేవి సుభధ్రామణికి,, కోటా లక్ష్మీప్రసాద్ గారికీ (ఈయన ఓ ఎలక్ట్రటికలర్ ఇంజనీరు, ప్రఖ్యాత తెలుగు సినిమా రచయిత-, సంభాషణారచయిత, స్క్రీన్ ప్లే రచయిత - హైదరాబాద్ నివాసం) అంకింతం ఇచ్చారు. మానసపుత్రిక మరణాని ఖిన్నుడయినా ఆవిషాదంలోంచి బయటపడేందుకు భళ్ళీ రచనావ్యాసాంగం మొదలుపెట్టి.. వాల్టర్ రూబెన్ అనే జర్మన్ శాస్త్రవేత్త జర్మన్ లో రచించిన "ప్రాచీన భారత దేశంలో బానిసల స్థితిగతులు"అనే గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించారు. గోవా స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంగా అతడు ఆమె నాలుగోభాగాన్ని పూర్తిచేసి ప్రచురించారు. పులుపుల శివయ్యగారి పురస్కారం అందుకున్నారు దానికిగాను "ఆధునిక ఆంధ్ర కవితా ఉద్యమం"అని ఓ వ్యాసాన్ని రాస్తే అరసం వారు దాన్ని ప్రచురించారు.

ప్రాచుర్యం మార్చు

ఉప్పల లక్ష్మణరావు రచించిన "అతడు-ఆమె" నవలను పలు సాహితీసంస్థలు, పత్రికలు విడుదల చేసిన "చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా"ల్లో చోటుచేసుకుంది. మాలతీచందూర్ వంటి సాహితీవేత్తలు వివిధ శీర్షికల్లో ఈ పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేశారు. చారిత్రిక నవలగా, నవలగా తెలుగు నవలా వికాసంలో కీలకమైన రచనగా "అతడు-ఆమె" తద్వారా గ్రంథకర్త ఉప్పల లక్ష్మణరావు సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించారు.[2][3]

పురస్కారాలు మార్చు

  • 1983 - అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[4]

మూలాలు మార్చు

  1. తెలంగాణా విముక్తి పోరాట కథలు
  2. 100 చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా: సాక్షి ఫన్ డే 100 సంచికల ప్రత్యేక సంచిక
  3. నవలామంజరి:మాలతీచందూర్ నవలా పరిచయ వ్యాసాల సంకలనం
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.