ఉప్పులూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం ఉప్పులూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం :[1] కాకతీయ సామ్రాజ్యం పతన దశలో వున్న రోజుల్లో మహమ్మదీయుల దాడి నుంచి హిందూ మత రక్షణకు, ఆంధ్ర దేశ పర్యటనకు వచ్చిన సింహాచల క్షేత్రనివాసి కందాల కృష్ణమాచారి ఉప్పులూరులో 1335వ సంవత్సరంలో అప్పటి అప్పలస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణుడే చెన్నకేశవస్వామి. చెన్న అంటే అందమైన అని మేలయిన కేశములు కలవాడు అని, కేశియను రాక్షసుని సంహరించినవాడు అని అర్ధం. 'కేశులు' అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారిని తన వశమందుంచుకున్నవాడు కేశవుడు.

ఆలయ చరిత్ర మార్చు

ఉండి గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో భీమవరంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉప్పులూరు గ్రామం శ్రీ చెన్నకేశవాలయం గురించి ఈ ఆలయం అతి ప్రాచీన ఆలయం. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, పల్నాడులో ధూప, దీప, నైవేద్యాలతో నిత్య పూజలందుకునే చెన్నకేశవస్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ సమయంలో దాడులు జరిగాయని... ఆ సమయంలో స్వామిని కాపాడుకోవడానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు, అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పల స్వామి అని పేరు మార్చారు. అనంతరం అక్కడి నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చేరుకున్నారు. అప్పుడు ఈ గ్రామంలో ఒక మర్రి చెట్టు నీడలో ప్రతిమను ఉంచి, స్వామికి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు. అదేసమయంలో ఈ గ్రామంలో కొందరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్పుడు హరిజనులు మన గ్రామంలోకి అడుగుపెట్టినందుకు ఇలా జరిగిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు, అతని సోదరులను నిర్బదించారు. ఇక ఆ రోజు రాత్రే సింహాచల అప్పన్న గ్రామ పెద్దలకు కలలో కనిపించి వారు నిరపరాదులు వారిని విడిచిపెట్టమని... గ్రామంలోని మర్రిచెట్టు క్రింద తన ప్రతిమ ఉందని, స్వామి వారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి తనకు దీప నైవేద్యాలు హరిజన దాసులే అర్చకులుగా ఉండాలని ఆదేశించారట. ఇలా ఆ స్వామివారి ఆజ్ఞ ప్రకారం గ్రామా పెద్దలు 1335 లో ఈ ప్రాంతంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి అర్చకులుగా వారికీ స్థానం కల్పించారు. నిజానికి విగ్రహాం చెన్నకేశవుడిదే కాబట్టి 1868 లో ఈ అప్పలస్వామికి పూర్వపు నామమైన చెన్నకేశవస్వామిగా మరల నామకరణం చేసారు.1650లో జజ్జూరి సంస్థ్దానాదీశులు రాజా వల్లి రాగన్న జమీందారు అప్పలస్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు.పాల్వంచ, భద్రాచలం సంస్థానాదీశులు రాజా పార్థసారథి అప్పారావు బహుదూర్‌ 1893లో ఈ ఆలయానికి భూదానమిచ్చారు. శనివారపు పేట సంస్థానాదీశులు రాజా ధర్మ అప్పారావు బహుదూర్‌ 1793లో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. వైష్ణవ మత గురువులైన పరవస్తు రామాజనుజాచార్యులు 1870 సంవత్సరంలో ఈ ఆలయ విగ్రహానికి చెన్నకేశవస్వామిగా నామకరణం చేశారు. 1895లో శేషబట్టారు రాఘవాచారి చెన్నకేశస్వామికి మొట్టమొదటి సారిగా కల్యాణోత్సవాలు జరిపించారు.[2] కొన్ని తరాలు అయిన తర్వాత శ్రీ స్వామి వారి అనుగ్రహం వల్ల గ్రామము పెద్దదై సుసంపన్నమై సరస్వతి దేవి లక్ష్మీదేవి నిలయమై చుట్టుప్రక్కల గ్రామాల కంటే ఎంతో అభివృద్ధి చెందటం జరిగింది.క్రమేపి ఈ గ్రామాల వారు ఇతర సుసంపన్నమైన కుటుంబాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ ఇతర గ్రామాల సంపన్నులు దేవాలయానికి వచ్చి శ్రీ స్వామి వారిని దర్శించి ఇక్కడ అర్చకులు హరిజనులు అని తెలుసుకొని గ్రామ పెద్దలతో చెప్పి వైష్ణవదాసులను మార్పించి, బ్రాహ్మణులను అర్చకత్వమునకు ఏర్పాటు చేస్తామని తెలుపగా అప్పటి గ్రామ పెద్దలు అలోచించి అర్చకులను మర్చుటకై అప్పటి సంస్థానమైన నూజీవీడు సంస్థానానికి సుమారు 1893లో ఒక అర్జిని వ్రాసి పంపగా రాజావారు అందుకు ఆమోదిస్తూ రాజముద్ర వేయగా వెంటనే ఆయన కుటుంబంలోని వారికి తీవ్ర అనారోగ్యము కలుగుట ఆ రాత్రి శ్రీ స్వామి వారు రాజా వారి స్వప్నములో కనపడి వారు నా సేవకులు వారిని మార్చితే నువ్వు, నీ రాజ్యము ఉండదు అని నిదర్శనము చూపి హెచ్చరించినారట.రాజా పార్ధసారథి అప్పారావు గారు జరిగిన పొరపాటును గ్రహించి మరునాడే వారిని పిలిపించి తానిచ్చిన తాఖీదును వెనుకకు తీసుకొని తానే స్వయంగా ఉప్పులూరికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామి వారికి అంగరంగ భోగములకై 40 ఎకరములు భూదానం ఇచ్చారు.అందు రెండు భాగములు అర్చకులకు, ఒక భాగము శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవములకు అని పెద్దలు నిర్ణయించడం జరిగిందని చెబుతారు...

ప్రత్యేకతలు మార్చు

దళితులే అర్చకులు మార్చు

శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో దళితులే అర్చకులుగా కొనసాగుతున్నారు. పల్నాడును పాలించిన బ్రహ్మనాయుడు సేనాధిపతి అయిన కన్నమదాసు సేవాతత్పరతకు, నిష్కళంక దేశభక్తికి మెచ్చి మాచర్ల, మార్కాపురం గ్రామాలలోని చెన్నకేశవస్వామి ఆలయాల్లో పూజల నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు 1280వ సంవత్సరంలో ఉప్పులూరు గ్రామానికి వలస వచ్చారు. తరువాతి కాలంలో ఆలయం ఆవిర్భావంతో నారాయణదాసు కుటుంబీకులే అర్చకులుగా కొనసాగుతున్నారని ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, దినపత్రిక. "చెన్నకేశవస్వామి కల్యాణోత్సవాలు". www.andhrajyothy.com. Archived from the original on 17 జూలై 2020. Retrieved 16 July 2020.
  2. "సమానత్వానికి పెద్దపీట - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 16 July 2020.

బయటి లింకులు మార్చు