పశ్చిమ గోదావరి జిల్లా
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. ఇచ్చిన కారణం: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన మార్పులు చేయాలి. (ఏప్రిల్ 2022) |
పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఇది 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా కొంత ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లా , ఏలూరు జిల్లాగా మిగిలిన ప్రాంతానికి భీమవరం కేంద్రంగా పశ్చిగోదావరిజిల్లా ఏర్పటు చేసారు.ఈ జిల్లా కేంద్రం భీమవరం. ఏలూరు, రాజమండ్రీ, అమలాపురం జిల్లాలకు అతి దగ్గరగా ఉంది.జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూన్నది. జిల్లాకు పశ్చిమాన దక్షిణన ఏలూరు జిల్లాకి,తూర్పున బంగాళాఖాతం,ఉత్తరాన రాజమండ్రీ,కోనసీమ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.జిల్లాలోని అభివృద్ధి చెందుతున్న పట్టణాలు భీమవరం, ఆకివీడు, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు,నరసాపురం. ఇవి అన్నీ కూడా పురపాలక సంఘాలు.ఈ జిల్లాలో 75% అక్షరాస్యత ఉంది.తాడేపల్లిగూడెం జిల్లా వాణిజ్య కేంద్రం.తణుకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న పట్టణం.భీమవరం జిల్లా కేంద్రం మరియు విద్య, వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పాలకొల్లు కళల,ఆద్యాత్మికమైన ముఖ్యనగరంగా వెలుగొందింది.నరసాపురం తీరప్రాంతం,బులియన్ మార్కెట్పట్టణం,ఆకివీడు జిల్లాకి ముఖద్వార పట్టణం మరియు కొల్లేరుపట్టణం..జిల్లాలో ఒక పార్లమెంటరీస్థానం(నర్సాపురం),ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.(భీమవరం,తాడేపల్లిగూడెం, తణుకు,పాలకొల్లు,నర్సాపురం,ఉండి,ఆచంట). రెవెన్యూడివిజన్లు (నర్సాపురం, భీమవరం). 19మండలాలు,6పురపాలక సంఘాలు కలవు. వరిసాగు 4.50లక్షల ఎకరాలు, ఆక్వాకల్చర్ 2.50లక్షల ఎకరాలు.పంటలకు కావలసిన నీరు నది కాల్వలు ద్వారా వస్తుంది. సముద్ర తీరం 19కీమీ. ప్రధాన రైల్వే స్టేషన్లు ఆకివీడు,భీమవరం,పాలకొల్లు,నర్సాపురం తణుకు తాడేపల్లిగూడెం. జిల్లాగుండా జాతీయ(16,165,214) రహదరులు వెళుతున్నాయి. ఆర్టీసి డిపోలు (భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నరసాపురం).
పశ్చిమ గోదావరి జిల్లా | |
---|---|
![]() . | |
![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతీయ | కోస్తా |
ప్రధాన కార్యాలయం | భీమవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 2.178 కి.మీ2 (0.841 చ. మై) |
జనాభా వివరాలు | |
• మొత్తం | 17.80 |
• సాంద్రత | 508/కి.మీ2 (1,320/చ. మై.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
అక్షరాస్యత | 73.95(2001) |
పురుషులు అక్షరాస్యత | 78.43 |
స్త్రీల అక్షరాస్యత | 69.45 |
లోకసభ నియోజకవర్గం | నరసాపురం లోకసభ నియోజకవర్గం |
జిల్లా చరిత్రసవరించు
బౌద్ధుల కాలంనుండి ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు సా.శ.పూ. 200 నుండి సా.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదఅమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి.[1]
ప్రస్తుతం పశ్చిమ గోదావరిగా పిలువబడే ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (సా.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. సా.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు సా.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు.
తరువాత బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి|ఏలూరుకి, తరువాత రాజమహేంద్ర వరం|రాజమండ్రికి మార్చబడింది. సా.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు.కాకతీయ వంశ జ రాణి రుద్రమదేవి నిర్వర్జ్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళిక్యుల ఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి.
బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[2]
భౌగోళిక స్వరూపంసవరించు
భౌగోళికంగా ఈ జిల్లా 16 - 15' నుండి 17-30' ఉత్తర అక్షాంశాల మధ్య, 80-55' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. గోదావరి నది డెల్టాలో కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం జిల్లా వైశాల్యం 2,178చ.కి.మీ. ( . జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు.
నైసర్గికంగా జిల్లాను సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును -
డెల్టా ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఈ జిల్లాలో సగం ఉంది. జిల్లాలో అటవీ ప్రాంతం 81,200 హెక్టేరులు - మొత్తం వైశాల్యంలో సుమారు 10.5%. సాగు అవుతున్న భూమిలో అధిక భాగం వరి పంట (82.8%), తరువాత పుగాకు (4.9%), చెరకు (4.7%), మిర్చి (1.3%)
ఆర్ధిక స్థితి గతులుసవరించు
వ్యవసాయంసవరించు
జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పాం, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది[3].
పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు | ||
పంట | విస్తీర్ణం
హెక్టేరులు |
ఉత్పత్తి
మెట్రిక్ టన్నులు |
వరి | 219.6 వేల హె. | 1,413,108 |
మొక్కజొన్న | 11.5 వేల హె. | 39,557 |
కంది | 0.28 వేల హె. | 191 |
మినుము | 9.54 వేల హె. | 3,885 |
పెసర | 2.79 వేల హె. | 1,130 |
వేరుశనగ | 3.21 వేల హె. | 6,476 |
చెరకు | 32.22 వేల హె. | 2,900,000 |
పుగాకు | 5.76 వేల హె. | 12,685 |
మామిడి | 20,483 హె. | 1,22,898 |
నిమ్మ | 1,449 హె. | 11,592 |
బత్తాయి | 183 హె. | 1,464 |
అరటి | 5,021 హె. | 3,26,365 |
జామ | 657 హె. | 13,140 |
సపోటా | 568 హె. | 4,544 |
జీడిమామిడి | 44,744 హె. | 22,372 |
పసుపు | 530 హె. | 1,855 |
మిరప | 2,703 హె. | 5,406 |
తమలపాకు | 175 హె. | 700 |
కొబ్బరి | 22,183 హె. | 3,327లక్షలు |
పామాయిల్ | 10,250 హె. | 61,500 |
కోకో | 2,800 హె. | 1,400 |
పోక చెక్క | 125 హె. | 125 |
కాఫీ | 50 హె. | 25 |
మిరియం | 150 హె. | 45 |
ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది.
జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉంది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉంది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది[4].
వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.[4]
నీటి వనరులుసవరించు
జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్ - సెప్టెంబరు కాలం) ఉంటుంది.
జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది.[4].
245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలోను సహజంగా వరద నీటిని బాలన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతుంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద యేరులతోబాటు సుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్దయెత్తున ఆర్థిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది[5].
జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి:
- గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)
- కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)
ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉంది.[6]
మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది.
- పోలవరం ప్రాజెక్టు
పరిశ్రమలుసవరించు
పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందిందనడానికి ఆస్కారం లేదు. అందువలన ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చును. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఈ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవే.
జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి[3]:
- లో టెన్షన్ (తక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 7125
- హై టెన్షన్ (ఎక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 118
- కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251
- జిల్లాలో మొత్తం ట్రాన్స్ఫార్మర్లు: 13,541
- పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్స్టేషన్లు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడే, పాలకొల్లు, ఏలూరు.
మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది.
నీలి విప్లవంసవరించు
ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.
- 80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు
శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.
1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది.1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి.
- తాజా పరిణామాలు
రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలుసవరించు
మండలాలుసవరించు
ఈ జిల్లాలో 19 మండలాలున్నాయి.
రవాణా వ్వవస్థసవరించు
214,165,16వ నెంబరు జాతీయ రహదారి పశ్చిమ గోదావరి జిల్లా గుండా వెళుతుంది. జిల్లాలో రోడ్ల వివరాలు
- మొత్తం రోడ్ల పొడవు: 5,194 కి.మీ. అందులో
- జాతీయ రహదారి: 108 కి.మీ.
- రాష్ట్రం రహదారులు: 281 కి.మీ.
- జిల్లా స్థాయి రోడ్లు: 1308 కి.మీ.
మద్రాసు-కొలకత్తా రైలు మార్గం ఈ జిల్లాగుండా వెళుతుంది. జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఆకివీడు, తాడేపల్లిగూడెం,భీమవరం (జంక్షన్),తణుకు,నరసాపురం, జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం, సరకుల రవాణా పెద్దగా జరగడం లేదు. గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది. జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గన్నవరం (విజయవాడ), మధురపూడి (రాజమండ్రి) విమానాశ్రయాలు ప్రస్తుతం జిల్లావాసులకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలాగానే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు. కొంత వరకు హైదరాబాదు, విశాఖపట్నం నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.
జనాభా లెక్కలుసవరించు
(చెక్ చేసి మార్పులుచేయాలి) పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490[7]. జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు.
- ఇతర ప్రధాన జన విస్తరణాంశాలు (2001 జనాభా లెక్కలననుసరించి)
- జనాభా: 37.96 లక్షలు (పురుషులు 19.06 లక్షలు, స్త్రీలు 18.9 లక్షలు)
- దశాబ్దంలో జనాభా పెరుగుదల: + 7.92%
- జన సాంద్రత: చ.కి.మీ.కు 490 మంది
- అక్షరాస్యత: 73.95% (పురుషులలో 78.4%, స్త్రీలలో 69.4 %)
- సాపేక్ష అభివృద్ధి సూచిక: 20.71
- మొత్తం జనాభాలో పని చేసేవారు: 43.4%
- వ్యవసాయ సంబంధిత ఉపాధిలో: 71.2%
- గనుల పనులలో: 0.2%
- పరిశ్రమలలో: 5.1% (కుటీర పరిశ్రమలు మినహాయించి)
- కుటీర పరిశ్రమలలో: 2.21%
- నిర్మాణం పనులు: 1.01%
- సేవా రంగంలో: 19.5%
- మొత్తం వైశాల్యంలో అడవులు 10.38%
- వ్యవసాయం జరిగే భూమిలో నీటి వసతి ఉన్నది: 86.5%
- తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి: 383 కి.గ్రా.
- ప్రతి 100 చ.కి.మీ.కు రోడ్ల పొడవు: 77.42 కి.మీ.
సంక్రాంతి ఉత్సవాలుసవరించు
తెలుగువారికి అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు కర్నాటక రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు.ముఖ్యంగా గోదావరి జిల్లాల్లు అయిన తూర్పు,పశ్చిమలో సంప్రదాయ రీతిలో ఉంటాయి. సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.
సంస్కృతిసవరించు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ సంస్కృతి ఉంది. కాపు, కమ్మ, రెడ్డి, బి.సి, యస్.టి సామాజిక వర్గాల జనాభా ఎక్కువ. ఆంధ్ర క్షత్రియులు (క్షత్రియ రాజులు), బ్రాహ్మణ కులాల జనాభా తక్కువగా ఉంది. భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తుంది. మహిళా అక్షరాస్యత - సాధికారతలో కూడా ఈ జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లా వాసులకు వివాహ సంబంధాలు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వాసులతో జరుగుతూవుంటాయి.
వ్యవసాయంసవరించు
జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం నగరం రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి.
విద్యాసంస్థలుసవరించు
ప్రధానంగా వ్యవసాయం, ఆక్వాకల్చర్ పై ఆధారపడిన ప్రాంతము, అటవీ ప్రాంతము ఉన్న ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉంది. నిట్ కాలేజ్ ఉంది. ఇటీవల ప్రైవేటు రంగంలో విద్యావకాశాలు పెరగడం వలన ఇంజినీరింగ్, మెడికల్ విద్యాలయాలు జిల్లాలో స్థాపించబడ్డాయి. జిల్లాలో విద్యాలయాల సంఖ్య ఇలా ఉంది.
- ప్రాథమిక పాఠశాలలు - 2555
- మాధ్యమిక పాఠశాలలు - 349
- ఉన్నత పాఠశాలలు - 385
- ప్రభుత్వ గురుకుల పాఠశాలలు - 2
- నవోదయ పాఠశాలలు - 2
- జూనియర్ కళాశాలలు - 51
- డిగ్రీ కళాశాలలు - 37
- ఐ.టి.ఐ.లు - 23
- పాలిటెక్నిక్ కళాశాలలు - 6
- ఇంజినీరింగ్ కళాశాలలు >13(తాడేపల్లి గూడెం-3, తణుకు-1 భీమవరం-8,నరసాపురం-1)
- మెడికల్ కళాశాలలు - 2 (పాలకొల్లు,భీమవరం)
- బి.ఎడ్.కళాశాలలు - 4
- న్యాయశాస్త్ర కళాశాలలు - 1 (భీమవరం)
- నిట్ -1 - (తాడేపల్లి గూడెం)
- డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, (తాడేపల్లి గూడెం)
ప్రముఖ విద్యా సంస్థలుసవరించు
- నన్నయ విశ్వవిద్యాలయం పి.జి కళాశాల, తాడేపల్లిగూడెం
- డి.ఎన్.ఆర్. కళాశాల. భీమవరం
- వై.ఎన్ కళాశాల. నర్సాపురం
జిల్లాలో ఎక్కువ కళాశాలలు నన్నయ విశ్వవిద్యాలయా నికి అనుబంధంగా ఉన్నాయి. ఇటీవల కార్పొరేట్ విద్యారంగం పెరిగిన కారణంగా ప్రైవేటు రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించబడినాయి.
పుణ్యక్షేత్రాలుసవరించు
- భీమవరము -భీమారామం, మావుళ్ళమ్మ దేవాలయము
- వీరంపాలెం - బాల త్రిపుర సుందరీ పీఠము
- పెనుగొండ - వాసవి కన్యకాపరమేశ్వరీ పీఠం
- పాలకొల్లు - క్షీరారామము
- నత్తా రామేశ్వరం - త్రిశివాలయ క్ష్తేత్రం
- ఆచంట - ఉమారామలింగేశ్వర శ్వామి ఆలయం, జైన దేవాలయం..
చారిత్రక, పర్యాటక ప్రదేశాలుసవరించు
ఇతర ఆకర్షణలుసవరించు
- చించినాడ (దిండి రిసార్ట్స్, హౌస్ బోట్లు-తూర్పు గోదావరి జిల్లా)
- కొల్లేరు సరస్సు
- పాలవెల్లి రిసార్ట్స్
క్రీడలుసవరించు
భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు, 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు.
ప్రముఖవ్యక్తులుసవరించు
- చిరంజీవి - సినీనటుడు, రాజకీయ నాయకుడు.
- ముళ్ళపూడీ హరిశ్చంద్రప్రసాద్ - పారిశ్రామికవేత్త
- బోళ్ళ బుల్లిరామయ్య - మాజీ ఎంపి
- బూరుగుపల్లి శేషారావు - శాసన సభ్యులు. నిడదవోలు
- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు - తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు.
- కనుమూరి బాపిరాజు మాజీ ఎంపీ,టీటీడీ చైర్మన్ (ఆకివీడు)
- అడవి బాపిరాజు
- అల్లూరి సీతారామరాజు - భీమవరం దగ్గరలొని మోగల్లు గ్రామానికి చెందినవారు
- భూపతిరాజు రామకృష్ణంరాజు- విద్యావేత్త, రాజకీయవేత్త, మాజీ ఏ.పి.పి.యస్సీ సభ్యులు
- డా.యల్లాప్రగడ సుబ్బారావు - శాస్త్ర వేత్త
- బి.వి రాజు పద్మభూషణ్
- పెన్మెత్స రాంగొపాల్ వర్మ - సినీ దర్శకుడు
- త్రివిక్రం శ్రీనివాస్ - సిని దర్షకుడు
- ఇందుకూరి సునీల్ వర్మ -సినిహీరో, హాస్య నటుడు
- రాజా రవీంద్ర - టాలీవుడ్ సినీ యాక్టర్
- శివాజీ రాజా - టాలీవుడ్ సినీ యాక్టర్
- రాశి - టాలీవుడ్ కథానాయిక
- ఎం.వి.రఘు
స్వచ్ఛంద సేవా సంస్థలుసవరించు
- మహాత్మాగాంధీ మొమొరియల్ ట్రస్ట్, శ్రీరాంపురం. భీమవరం.
- ఆదరణాలయం సేవాసంస్థ. పాలకొల్లు.
- అవార్డ్ అసోషియేషన్.{ వెల్ఫేర్ రూరల్ డవలప్మెంట్ సెంటర్ } అరుణోదయ మనో వికాసకేంద్రం.ఆర్.పి.ఆశ్రమం.భీమవరం.
- ఛిల్ద్ రురల్ రీలీఫ్ ఆర్గనయ్సెసతిఒన్ (Child Rural Relief Organisation).తాడేపల్లి గూడెం.
- ఎలిషా హొం ఫర్ థీ ఒర్ఫన్, బ్లిన్ద్, హన్దికెప్పెద్ లెపెర్స్ (Elisha Home For the Orphan, Blind, Handicapped Lepers etc.) పాలకొల్లు.
- మెర్సీ అనాథాశ్రమం, చిల్డ్రన్ హోమ్,లంకలకోడేరు. పాలకొల్లు మండలం.
- ముళ్ళపూడి కమలాదేవి అమెరికన్ హాస్పిటల్. వెంకట్రాయపురం. తణుకు.
- ముళ్ళపూడి వెంకట్రాయుడు ఉచిత నేత్ర వైద్య శిభిరం.వెంకట్రాయపురం. తణుకు.
- శ్రుతి వాలంటరీ ఆర్గనైజేషన్ సొసైటీ,అరవవారి వీధి. ఎస్.బి.అయ్.కాలనీ. భీమవరం.
రాజకీయాలుసవరించు
పశ్చిమ గోదావరి జిల్లాలో 07 శాసనసభ నియోజక వర్గా(తణుకు,తాడేపల్లిగూడెం,పాలకొల్లు,నర్సాపురం ఉండి,భీమవరం,ఆచంట)లతో పాటూ ఒక లోక్ సభ (నర్సాపురం) నియోజకవర్గాలు ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు పెనుమార్పులకు పెట్టిందిపేరు. రాజకీయంగా సున్నితమైన ఈ జిల్లా రాజకీయ వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఎక్కువ. జిల్లాలో కాంగ్రెసు పార్టీకి కూడా తిరుగులేని ప్రస్థానం ఉంది.1989 ఎన్నికలలో తప్ప రాష్ట్రములో అధికారములోకి వచ్చిన పార్టీ ఉమ్మడి జిల్లాలో అధిక సంఖ్యలో శాసనసభా స్థానాలను గెలుచుకోవటం పరిపాటే. జిల్లాలో సంఖ్యాపరంగా కాపుల ప్రాబల్యము చాలా ఎక్కువగా ఉన్నాధి. ఇక్కడ సినిమారంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఆంధ్ర సుగర్స్ వ్యవస్థాపకుడైన ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ కు తణుకు, కొవ్వూరు, గోపాలపాలెం, పోలవరం నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయగల పలుకుబడి ఉంది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ముగ్గురు తెలుగుదేశం శాసనసభా సభ్యులకు మద్దతు ఇచ్చినట్టు నివేదికలు వెల్లడించాయి. భీమవరం నుండి పి.వి.నరసింహరాజు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు, అత్తిలి నుండి దండు శివరామరాజు. సినీరంగ ప్రభావములో కేంద్రమంత్రి యు.వి.కృష్ణంరాజు నర్సాపురం లోక్సభ స్థానంలో గెలుపొందాడు. సినీ నిర్మాత .1983లో రాజకీయ జీవితము ప్రారంభించినప్పటినుండి ప్రతి ఎన్నికలలోనూ అజేయంగా నిలిచిన తెలుగుదేశం నాయకులు ముగ్గురు: చింతలపూడి నుండి కోటగిరి విద్యాధరరావు, నర్సాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-07. Retrieved 2007-09-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-09-12.
- ↑ 3.0 3.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2006-04-07. Retrieved 2007-09-17.
- ↑ 4.0 4.1 4.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;irrigation
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-09. Retrieved 2007-09-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-13. Retrieved 2007-09-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-29. Retrieved 2007-09-19.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to West Godavari district. |