చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.

భువనేశ్వర్ వద్ద ఉన్న ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా
ఖారవేలుని హాతిగుంఫా శాసనము

కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.

అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత సా.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.

ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హాథీగుంఫా శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.

ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంథాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.callinga

వనరులు మార్చు

  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్