పి.ఎన్. భగవతి

భారతదేశం యొక్క 17 వ ప్రధాన న్యాయమూర్తి
(పి.ఎన్.భగవతి నుండి దారిమార్పు చెందింది)

ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్‌ భగవతి (పి.ఎన్‌. భగవతి) ప్రముఖ న్యాయకోవిదుడు. ఇతడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. దేశంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) అనే విధానాన్ని ప్రవేశపెట్టిన న్యాయమూర్తిగా ఇతడు ప్రసిద్ధుడు.

జస్టిస్ పి.ఎన్. భగవతి
పి.ఎన్. భగవతి


పదవీ కాలం
12 జూలై 1985 – 20 డిసెంబర్ 1986
నియమించిన వారు జ్ఞానీ జైల్‌సింగ్
ముందు వై.వి. చంద్రచూడ్
తరువాత ఆర్.ఎస్.పాఠక్

వ్యక్తిగత వివరాలు

జననం (1921-12-21)1921 డిసెంబరు 21
అహ్మదాబాద్, Bombay Presidency, British India
మరణం 2017 జూన్ 15(2017-06-15) (వయసు 95)
న్యూఢిల్లీ
జీవిత భాగస్వామి ప్రభావతి

విశేషాలు మార్చు

ఇతడు గుజరాత్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించాడు. ఇతడు రెండు పర్యాయాలు గుజరాత్ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు. 1973 జూలైలో సుప్రీంకోర్టులో జడ్జిగా చేరారు. సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా 1985 జూలై నుంచి 1986 డిసెంబర్‌ వరకు పనిచేశాడు. సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జిగా ఉన్న సమయంలోనే ఈయన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రవేశపెట్టాడు. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని ఈయన ఓ సందర్భంలో తీర్పునిచ్చాడు. ప్రాథమిక హక్కుల విషయంలో కోర్టు తలుపు తట్టడానికి ఏ వ్యక్తికీ లోకస్‌ స్టాండీ ఉండాల్సిన అవసరం లేదని కూడా ఈయన చెప్పాడు. 1978లో మేనకా గాంధీ పాస్‌పోర్టు అప్పగింత అంశానికి సంబంధించిన కేసులో వెలువరించిన తీర్పు ఇతని ప్రధాన తీర్పుల్లో ఒకటి. ‘జీవించే హక్కు’ అనే భావన విస్తృతార్థాన్ని ఈ తీర్పులో విశదీకరించాడు. వ్యక్తి కదలికలను నియంత్రించజాలమని పేర్కొన్నాడు. పాస్‌పోర్టు కలిగి ఉండేందుకు వ్యక్తికి హక్కు ఉందని స్పష్టంచేశాడు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మినర్వా మిల్స్‌ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంలో 42వ రాజ్యాంగ సవరణను సమర్థించిన ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్‌ భగవతి. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు దీనిని కొట్టివేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భాష్యంపై కోర్టు ఈ కేసులో స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు రాజ్యాంగం పరిమిత అధికారాన్నే ఇచ్చిందని తెలిపింది. ఈ పరిమిత అధికారంతో పార్లమెంటు తనకు తాను అపరిమిత అధికారాన్ని సంక్రమింపజేసుకోలేదని తేల్చిచెప్పింది.

పురస్కారాలు మార్చు

పబ్లిక్ అఫైర్స్ రంగంలో ఇతడు అందించిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం 2007లో ఇతడిని దేశపు రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[1]

మరణం మార్చు

జస్టిస్ పి.ఎన్.భగవతి తన 95 యేట అనారోగ్య కారణంగా 2017, జూన్ 15న న్యూఢిల్లీలో మరణించాడు[2],[3],[4]. ఈయనకు భార్య ప్రభావతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. ఎడిటర్ (25 January 2007). "Padma Awards 2007". Outlook. Retrieved 16 June 2017.
  2. విలేఖరి (16 June 2017). "జస్టిస్‌ భగవతి కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Retrieved 16 June 2017.[permanent dead link]
  3. విలేఖరి (16 June 2017). "ప్రజాహిత వ్యాజ్యం ఆద్యుడు జస్టిస్‌ భగవతి కన్నుమూత". ఈనాడు. Archived from the original on 16 జూన్ 2017. Retrieved 16 June 2017.
  4. విలేఖరి (16 June 2017). "జస్టిస్‌ పీఎన్‌ భగవతి కన్నుమూత". సాక్షి. Retrieved 16 June 2017.