పేరి కాశీనాథ శాస్త్రి

పేరి కాశీనాథ శాస్త్రి (1858 -1920) ప్రముఖ పండితుడు, కవి.[1]

వీరు గజపతినగరం తాలూకాలోని పురిటిపెంట అనే గ్రామంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరు చిన్నతనంలోనే తండ్రి వద్ద వ్యాకరణాన్ని, మధ్వశ్రీ భీమాచార్యులు దగ్గర న్యాయాన్ని, కొల్లూరు కామశాస్త్రి వద్ద వేదాంతాలంకార శాస్త్రాలను నేర్చుకొన్నారు. పిదప విజయనగరం మహారాజావారి ఆస్థానంలో పండితులుగా చేరారు. వీరు 1878లో మహారాజా సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయునిగా ప్రవేశించి ప్రఖ్యాతిని పొందారు.

ఆనాడు కవులుగా రాణించిన పండితులలో వీరొకరు. అపర భోజునిగా కీర్తిగాంచిన పూసపాటి ఆనంద గజపతి రాజుకు వీరనిన చాలా గౌరవం ఉండేది. "యథా కాళిదాస స్తథా కాశీనాథ" అని వీరిని గురించిన స్తుతి నేటికీ వినిపిస్తుంది. వివిధములైన కవితలను వెలయిస్తూ నానారాజ సందర్శనం చేస్తూ, కనకాభిషేకాలు పొందుచూ వీరు ఆంధ్రదేశ సంచారం కావించారు.

గోదావరీ లహరి, బ్రహ్మసూత్ర భాష్యాంధ్రానువాదం అనే రెండు గ్రంథాలు వీరివి ముద్రితములయ్యాయి. ఉత్తర శాకుంతలము మొదలైన గ్రంథాలు ఆముద్రితములు. గ్రాంథిక భాషావాదంలో కల్లూరి వేంకట రామశాస్త్రికి వీరు అండగా ఉన్నారు. ఉర్లాము మొదలైన అనేక సంస్థానాలలో వీరు విద్వత్పరీక్షకులుగా నుండి సన్మానం పొందారు.

వీరికు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. సుప్రసిద్ధ మహామహోపాధ్యాయులైన తాతా సుబ్బరాయశాస్త్రి వీరు అల్లుడే.

మూలాలు మార్చు

  1. కాశీనాథ శాస్త్రి, పేరి (1858-1920), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 79.