[[దస్త్రం:Puttaparthi Narayanacharyulu.jpg|framed|కుడి|పుట్టపర్తి నారాయణాచార్యులు]]
== రచనలు ==
కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు [[విశ్వనాథ సత్యనారాయణ]] నవల [[ఏకవీర]] ను [[మలయాళం]] లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో '''పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు [[విశ్వనాథ సత్యనారాయణ]] ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు.''' ఇంకొక సారి [[వైజాగ్]] యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల [[పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి]] సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన వ్రాసిన "[[శివతాండవం]]" ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "'''ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి'''" అని భావించేవారు.
<poem>
మచ్చుకు :
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
</poem>
ఆయన 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
|