పుట్టపర్తి నారాయణాచార్యులు

తెలుగు కవి, బహుభాషావేత్త

పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) ఒక తెలుగు కవి. ఆయన సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం చెప్పుకోదగినది. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

పుట్టపర్తి నారాయణాచార్యులు
జననం
నారాయణాచార్యులు

(1914-03-28)1914 మార్చి 28
అనంతపురం జిల్లా. అనంతపురం మండలంలోని చియ్యేడు
మరణం1990 సెప్టెంబరు 1(1990-09-01) (వయసు 76)
కడప
మరణ కారణంగుండె పోటు
వృత్తితెలుగు అధ్యాపకులు, కవి
పిల్లలు6; 5 కుమార్తెలు; 1 కుమారుడు
తల్లిదండ్రులు
  • శ్రీనివాసాచార్యులు (తండ్రి)
  • లక్ష్మీదేవి (మెండమ్మ) (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అతను తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి (ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. అతను గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.

నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం అతనులో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు.[1]

ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. అర్ధాంగి పేరు పుట్టపర్తి కనకవల్లి. మొదట అతను పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి అతనుతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో అతను ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.

అతను బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. అతనుకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారంప్రకారం అతను చేసిన అనువాదాలు - అవధీ భాషనుండి తులసీదాస్ రామాయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారు. ఉర్దూ లో హంస రాజ్ రహబ్బర్ వ్రాసిన నవలను సంఘర్షణ పేరుతో తెలుగులో అనువదించారు.

హృషీకేశ్ లో అతను పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి అతనుకు సరస్వతీపుత్ర బిరుదు నిచ్చారు. అతనుకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి అతను ఉంచుకున్నారు.

"లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో అతను స్వంత రచనలు. అతను ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. అతనుకు ఆంగ్లం నేర్పిన వి.జే. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఇతను వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.

అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో అతను చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.

అతను చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు అతను్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి అతనుకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "అతను్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, అతను దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.

భారత ప్రభుత్వం అతనుకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే అతను నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, అతనుకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో అతను సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు అతనుకు డి.లిట్. ప్రదానం చేశాయి. అతను కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పనిచేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

1991 లో ప్రొద్దుటూరులో వీరి రాతి విగ్రహము, 2007 లో మరో కాంస్య విగ్రహం, 28 మార్చ్ 2021 న వారి 107 వ జయంతి నాడు అగస్తేశ్వర ఆలయం లో పుట్టపర్తి శివ తాండవం రచించిన చోటే మరొక రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.[2]

రచనలు మార్చు

 
పుట్టపర్తి నారాయణాచార్యులు

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత అతను విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో అతను ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయారు. అతను బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.

తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై అతనును భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.

తెలుగులో అతను వ్రాసిన "శివతాండవం" అతనుకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. అతను గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని అతను స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.[3]

మచ్చుకు :

కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!

పుట్టపర్తివారి శివతాండవము ఆ తాండవాన్ని చూపించే యత్నము, తాండవాన్ని చూచినప్పుడు వారికికలిగిన భావపరంపరను మనకు ఉత్సాహము కలిగించే ప్రయత్నము కాదు. వారిది చదువరులకు శివతాండవ దర్సనము పొందాలి అన్న భావన రూఢి అవుతుంది. అనగా ఇది ఒక కధాకావ్యము.దీని వస్తువు శివుని తాండవమూ పార్వతి లాస్యమున్ను, అతిలోకము. పశ్చిమచాళుక్యరాజులు పట్టదక్కలో తొలిసారి మలిపించినది మొదలు దక్షిణాత్య శిల్ప వీధులన్నిటా ఉజ్జ్వలంగా తీరినదీ శివతాండవ శిల్పము.పట్టదక్కలో జంబులింగ దేవాలయపు గుడిలో స్వామి అష్టభుజుడు, కుడివైపు నంది ఎడమవైపు దేవీ మాత్రమే ఉన్నారు.పాపనాధ దేవాలయ శిల్పంలో స్వాము చతుర్భుజుడు, నందీ అమ్మవారూ కూడా ఉదిక్తులై పాల్గొంటారు, ఎత్తిన పగడలతో పాములూ కదిలి పోతున్నాయి.బాదామిశిల్పి స్వామికి షోడశభుజములూ ఆయుధములూ కాక ప్రక్కన నందీ వినాయకుడు, మార్దింగికూడా ఉంటారు.ఎల్లోరా 14వ గుహలో పృధ్వీ ఆకాశముల నడుమ ప్రభువు తాండవం చేస్తూంటే, వేణుమృదంగాది వాద్యములను వాయించువారు కుడి దిగువునా, చకితురాలైన్ అమ్మవారు ఎడమవైపునా, పైన్ ఇటు అటు దిక్పాలకులు ఉన్నారు. నారాయణాచార్యులు గారు ఈ శిల్పములను ఈ కావ్యములో సమర్దము కూర్చినారు, అదే కాక ఇందులో విష్ణువును ప్రేక్షకునిగా తీర్చినారు. ఇందులో "ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు" అని అభినయానుకూలి అయిన ధ్రువమును చేర్చినారి కవిగారు.అంత్య ప్రాసలు కూడా పాదములను వింగడిస్తూ నర్తకికి వాచక విరామమే కాక అభినయవిరామము కూడా కలిగిస్తాయి.చివ్వర నర్తకి "అడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు" అని ఊపిరి తిప్పుకుంటుంది.

అతను 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల అతను రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మతో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

అతను వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.

తెలుగులో స్వతంత్ర రచనలు మార్చు

పద్యకావ్యాలు మార్చు

  • పెనుగొండ లక్ష్మి
  • షాజీ
  • సాక్షాత్కారము
  • గాంధీజీ మహాప్రస్థానము,
  • శ్రీనివాస ప్రబంధం
  • సిపాయి పితూరీ
  • బాష్పతర్పణము
  • పాద్యము
  • ప్రబోధము
  • అస్త సామ్రాజ్యము
  • సుధాకళశము
  • తెనుగుతల్లి
  • వేదనాశతకము
  • చాటువులు

గేయకావ్యాలు మార్చు

  • అగ్నివీణ
  • శివతాండవము
  • పురోగమనము
  • మేఘదూతము
  • జనప్రియ రామాయణము
అష్టాక్షరీ కృతులు 2 భాగాలు (అష్టాక్షరీ ముద్ర తో వ్రాసిన భక్తి కీర్తనలు,)

ద్విపద కావ్యము మార్చు

  • పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)

వచన కావ్యాలు మార్చు

  • ప్రబంధ నాయికలు
  • వ్యాస సౌరభము
  • రాయలనాటి రసికతా జీవనము
  • రామకృష్ణుని రచనా వైఖరి
  • విజయాంధ్రులు
  • భాగవతోపన్యాసాలు
  • విజయతోరణము
  • సమర్థ రామదాసు
  • తెనుగు తీరులు
  • ఆంధ్రమహాకవులు
  • విప్లవ యోగీశ్వరుడు
  • శ్రీసాయిలీలామృతము
  • సరోజినీదేవి
  • నవ్యాంధ్ర వైతాళికులు
  • ఆంధ్రుల చరిత్ర
  • కర్మయోగులు
  • రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.

నవలలు మార్చు

  • అభయప్రదానం[4]
  • ప్రతీకారము
  • హరిదాసి

ఆంగ్లంలో స్వతంత్ర రచనలు మార్చు

  • Leaves in the Wind
  • Vain Glorions
  • The Hero

మలయాళంలో స్వతంత్ర రచనలు మార్చు

  • మలయాళ నిఘంటువు

సంస్కృతంలో స్వతంత్ర రచనలు మార్చు

  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతము
  • అగస్త్యేశ్వర సుప్రభాతం
  • మల్లికార్జున సుప్రభాతం

అనువాదాలు మార్చు

  • హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా (నవల)
  • మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్ (నవల)
  • మలయాళం నుండి:శ్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు (నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ (నాటిక),సెట్రక్కాడు కథలు
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

వ్యక్తిత్వం మార్చు

నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చలేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా." అనేవాడు.

ఒకసారి అతను అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "అతనుకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన అతను మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

ప్రముఖుల అభిప్రాయాలు మార్చు

  • పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
  • శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  • ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  • కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
  • ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి

ఇవి కూడా చదవండి మార్చు

మూలాలు మార్చు

  1. శశిశ్రీ (2012). పుట్టపర్తి నారాయణాచార్య (మోనోగ్రాఫ్) (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 12. ISBN 81-260-4106-4.
  2. "విగ్రహ ప్రతిష్టాపన గురించి ది హిందూలో వ్యాసం". Archived from the original on 2011-11-15. Retrieved 2010-08-08.
  3. పుట్టపర్తి, నారాయణాచార్యులు (1985).   శివతాండవము. రవి ఎకడమిక్ సొసైటీ (రిజిస్టర్డ్). వికీసోర్స్. 
  4. నారాయణాచార్యులు, పుట్టపర్తి. అభయప్రదానం. కర్నూల్: రాజశేఖర బుక్ డిపో. Retrieved 2020-07-12.

బయటి లింకులు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: