'''బమ్మెర పోతన''' గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి [[వరంగల్ జిల్లా]] లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు{{fact}}. [[శ్రీరాముడు|శ్రీ రాముని]] ఆజ్ఞపై [[శ్రీకృష్ణుడు|శ్రీ కృష్ణుని]] కథ, [[విష్ణువు|విష్ణు]] భక్తుల కథలు ఉన్న [[భాగవతము]]ను తెలుగించినారు. ఈ భాగవతము మొత్తము [[తెలుగుదనం]] ఉట్టిపడుతుంది.
ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయనఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము. ఇతఁడు కడుపేదవాఁడు. కృషివలన జీవించువాఁడు. ఇతఁడు బాల్యమున పశువులను మేపుచు తమ ఊరిచేరువను కల కొండమీఁద సంచరించుచు ఉండి తన పురాకృత సుకృతవిశేషము వలన చిదానందుఁడు అను ఒక యోగీశ్వరుని కనుఁగొని ఆమహాత్మునికి నమస్కరించి స్వామీ మీరెవరో మహాత్ములు అని నాకు తోఁచుచు ఉన్నది ఇట్టి మహిమ పడయుటకు తగిన ఉపాయమును నాకు ఉపదేశించి నన్ను కడతేర్పుఁడు అని ప్రార్థించెను. అదివిని ఆయన ఇతఁడు మిక్కిలి బుద్ధిశాలి అని మెచ్చుకొని తారకమంత్రమును ఉపదేశించి పోయెను. అంతట పోతన గురువు ఉపదేశించిన చొప్పున నియమముతో తారకమంత్రజపముచేసి ఆజపమహిమవలన పరమజ్ఞాన సంపన్నుఁడును మహాకవియును అయి ఆశ్రమములయందెల్ల గృహస్థాశ్రమము మేలు అయినది అని తెలిసి కులశీలవయోరూపముల తనకు తగిన ఒక కన్యకను పరిగ్రహించి సంతానమును పడసి లోకోపకారముగా ఒక పురాణమును తెనిఁగింపఁగోరి ఎల్ల పురాణములయందును భాగవతము ఉత్తమము అని విచారించి దానిని తెనిఁగించుచు ఉండఁగా వేమభూపాలుని ఒద్ద ఆస్థానపండితుఁడును ఇతనికి అనుబంధుఁడును అయిన శ్రీనాథుఁడు ఇతఁడు భాగవతమును తన యేలిన వానికి అంకితముగా చేయింపవలెను అని పల్లకిమీఁద ఎక్కి ఒంటిమిట్ట పొలిమేర చేరరాఁగా అచ్చట దున్నపోతులను కట్టిన అరకను పూని చేను దున్నుచు ఉన్న పోతరాజు కొడుకును ఆచేని గనిమ మీఁద కూర్చుండి భాగవతము వ్రాయుచు ఉన్న పోతరాజును అతనికి కనఁబడిరి. వారిని చూచి తాను సరస్వతీ ఉపాసకుఁడు కనుక తన మహిమ పోతనకు తెలుపవలెను అని ఎంచి పల్లకి మోచుచు ఉన్న బోయీలను పిలిచి మీరు ఒక ప్రక్క పల్లకి కొమ్మును వదలి రండి అని చెప్పెను. వారు అట్లే చేయఁగా దున్నుచు ఉన్న మల్లన ఒక తట్టుమాత్రము బోయీలు మోపఁగా వచ్చుచు ఉన్న పల్లకిని చూచి నాయనా ఇదియేమి వింతగా ఉన్నది అని తండ్రిని అడిగెను. అప్పుడు పోతన అబ్బీ నీవును ఒక తట్టు కట్టిన దున్నపోతును విడిచి దున్నుము అని చెప్ప అతఁడు అట్లుచేసెను. అది చూచి శ్రీనాథుఁడు రెండవ కొమ్మును గూడవదలి పల్లకిని అంతరమున విడువుఁడు అని బోయీలకు ఉత్తరవు చేసెను. అది మల్లన చూచి నాయనా రెండవతట్టును బోయీలులేక పల్లకి ఉత్తబయల నడచి వచ్చుచు ఉన్నది చూచితివా అనెను. అట్ల అయిన నీవును రెండవదున్నను వదలి దున్నుము అని చెప్పెను. అతఁడు ఆప్రకారముచేసెను. అంతట శ్రీనాథుఁడు పోతన ఉన్నచోటికి దాపుగా వచ్చి హాలికులో అని పరిహసించెను. అది విని పోతన "ఉ. బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్, గూళుల కిచ్చి యప్పడుపు కూడుభుజించుటకన్న మేలుగా, హాలికులైన నేమి మఱి యంతకునున్ వగ లేకయున్నకౌ, దాలికులైననేమి నిజదారసుతాదిక పోషణార్థమై." అని ప్రత్యుత్తరము చెప్పెను. అంతట శ్రీనాథుఁడు పల్లకి దిగివచ్చి పోతనకు నమస్కరించి బావా నీమహిమ నేనెఱుఁగనా బావమఱఁదులము కనుక కొంచెము మేలము చూపితిని అనెను. అందులకు పోతనయు సరే అట్లుకాక ఇప్పుడు ఏమివిరుద్ధ ధర్మములు నడచెను అనుచు కొడుకును దుక్కి నిలిపి ఇంటికి పోయి అక్కతో శ్రీనాథకవి మనయింట విందారగింపఁవచ్చెను వేగవంటచేయమని చెప్పుము అని చెప్పిపంపి తానును అతనిని వెంటఁబెట్టుకొని తన కుటీరమునకు పోయెను. ఇట్లు శ్రీనాథుఁడు పోతన ఇంటికి పోయి మిక్కిలి శిథిలమై సంకుచితమై ఉన్న ఆపూరియింటిని చూచి బావా మహానుభావుఁడవు అగు నీవు ఈగుడిసెలో ఉండి ఈ పేదఱికమును అనుభవింపనేల ఎవరినేని గొప్ప రాజులను ఆశ్రయించి సంపదలు పడయరావా అని పలికెను. ఇంతలో వంట అయినది స్నానమునకు యత్నము చేయుఁడు అని మల్లన వచ్చి చెప్పెను. అంత ఆయిరువురును స్నానముచేసి తమతమ అనుష్ఠానములు జరపుకొని భోజనము చేయ పోయిరి. అప్పుడు మనుష్య స్త్రీరూపము ధరియించి పోతనకు కూఁతురు అను పేర అతనియింట మెలఁగుచు ఉన్న సరస్వతీదేవి పళ్లెరమున అన్నమును కొనివచ్చి విస్తళ్లలో వడ్డించుచు కన్నుల నీళ్లు రాల్చెను. అది చూచి పోతన "ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చెదో, కైటభరాజుమర్దనుని గాదిలికోడల యోమదంబ యో, హాటక గర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్ల కర్ణాటకిరాత కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ" అని చెప్పెను. అది విని ఆమె శోకము మాని సర్వపదార్థములు వడ్డింపఁగా భోజనముచేసి తగనమర్యాదతో పోతరాజు పంపఁగా శ్రీనాథుఁడు తానేమి చెప్పుటకును ఎడములేక తన వచ్చినదారిని పోయెను. ఇట్లు పరమ వైరాగ్యపరుఁడై రామాంకితముగ భాగవతమును సమగ్రముగా తెనిఁగించి ముక్తుఁడు అయ్యెను. ఇదికాక వీరభద్రవిజయము అను దక్షాధ్వర ధ్వంసకథ ఒకటి ఈయన రచించినట్టు తెలియవచ్చుచు ఉన్నది. అది మాత్రము నరాంకితము చేయఁబడి ఉన్నది. అందులకు కారణము తెలిసినది కాదు. ఇతఁడు శాలివాహన శకము వేయిని మున్నూఱు అగుకాలమున జనియించినవాఁడు.
పోతన, [[శ్రీనాథ కవిసార్వభౌముడు]] సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన [[వ్యవసాయము]] చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]] గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.