బడగనాడు శాఖకు చెందిన [[బ్రాహ్మణ]]కుటుంబంలో [[1896]], [[జూన్ 13]] వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు [[అనంతపురం జిల్లా]], [[హిందూపురం]] తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు [[హిందూపురం]]లోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చదివాడు. తర్వాత [[బెంగళూరు]]లో మిషన్ స్కూలులో కొంతకాలం చదివి [[మైసూరు]]లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మైసూరులో స్వయంకృషితో కన్నడ భాషలో ఛందోవ్యాకరణాలలో నిష్ణాతుడయ్యాడు. ఆ భాషలో కవిత్వం చెప్పనేర్చాడు. మైసూరు సంస్కృత కళాశాలలోని పలువురు విద్వాంసుల సహకారంతో సంస్కృతం నేర్చి వ్యాకరణాది అలంకార సూత్రాలను, [[ఆయుర్వేదము]], [[జ్యోతిశ్శాస్త్రము]], [[సాముద్రికము]], [[వేదాంతము]] మొదలైన వేదాంగాలను నేర్చుకున్నాడు. [[పెనుకొండ]]లోని అసిస్టెంట్ ఇంజనీయరు ఆఫీసులో క్లర్క్గా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తండ్రి మరణంతో వంశపారంపర్యంగా వచ్చిన [[మునసబు]] ఉద్యోగంలో చేరాడు. ఇతనికి 22వ యేడు వివాహమైంది. ఒక కొడుకు ఒక కూతురు జన్మించిన తర్వాత 32వ యేడు భార్య మరణించింది. ఇతడు తన 68వ యేట [[1964]], [[మార్చి 9]] న మరణించాడు.