బృహత్ కిన్నెర (వాయిద్యం)

బృహత్ కిన్నెరనే  ‘ఆదివాసీ కిన్నెర లేదా కర్నట్ కిన్నెర’ అని  అంటారు. ఈ కిన్నెర  గిరిజన జాతుల కిన్నెరగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని గోండి, చెంచు గిరిజనులు దీనిని వాడతారు. ఐతే చెంచు సమాజంలో ఇప్పుడు కిన్నెర లభ్యం కావడం లేదు. ఈ ఆదివాసి కిన్నెరను వాయించే కళాకారులలో  కుట్ర లింగు ఒక్కడు మాత్రమే మిగిలాడు.[1]

తయారీ మార్చు

ప్రాచీన, మధ్య యుగాల్లో కిన్నెర అత్యంత ప్రచారంలో గల తంత్రీవాద్యం. దీనిని గుండెల (వక్షస్థలం) మీద పెట్టుకుని (breast instrument) వాయిస్తారు. దీనికి  రెండు నుండి నాలుగు ఆనపకాయ బుర్రలు (resonators) అమరుస్తారు. వీటి కింద కొంత భాగం కోసి ఉంటుంది. కిన్నెరలో రెండు తీగలు ఉంటాయి. ఒకటి ఆధార శ్రుతి, మరో తీగ శబ్దం పలికిస్తుంది. కుడి చేత్తో మీటుతూ, ఎడం చేత్తో మెట్ల మీద వేళ్ళతో తంత్రులు మీటుతారు.

చారిత్రక విశేషాలు మార్చు

గోండ్ కిన్నెర వాద్యం వాయిస్తూ పహండికూపలింగాల్ అనే భక్తుడు 18. పాటలను 18 గతులలో వాయించాడట. తనకెదురుగా ఉన్న తాడిచెట్టు విపరీతంగా ఊగిపోతూ కనిపించింది, సుర్పుర్యాది గుహలో గోండి దేవతలు సంతోషించారట.

చాలాకాలం కిందట ఒక చెంచువాడు కిన్నెర వాయిస్తుంటే అతని భార్య కూరగాయలు తరుగుతూ ఆ సంగీత మైకంలో పక్కనే ఉన్న శిశువుని కూడా తరిగి పడేసింది. అప్పటి నుండి అంత శక్తివంతమైన కిన్నెరని వాయించకూడదనే ఆంక్ష విధింపబడిందని ఒక ఉదంతం ఉంది.

ఈ కిన్నెర గురించి అయిదో శతాబ్దానికి చెందిన మాతంగుని 'బృహద్దేశి' గ్రంథంలో, అబుల్ ఫజల్ రాసిన 'అయిని అక్బర్' గ్రంథంలో ప్రసక్తించబడింది. మనదేశంలో వివిధ ప్రాంతాలలో గల అనేక శిల్పాలలో ఈ వాద్యం కనిపిస్తూ ఉంటుంది. మెట్ల కిన్నెర అనేక జిథర్ వాద్యాలకు తల్లి వంటిది. ఆ తరువాత ఎన్నో వాద్యాలకు మాతృక.[2]

ముగింపు మార్చు

కిన్నెర తయారీని బట్టి, రకాన్ని బట్టి, అటవీ ప్రాంత, మైదాన ప్రాంత కిన్నెరలుగా పిలవబడ్డాయి. పన్నెండు మెట్ల చెంచుల కిన్నెర అదృశ్యం కాగా, గోండుల కిన్నెర అంతరించి పోవడానికి సిద్ధంగా ఉంది.

మూలాలు మార్చు

  1. మూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణ. "తెలుగువారి జానపద కళారూపాలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-03-25.
  2. జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).