భవసార క్షత్రియులు

(భవసార క్షత్రియ నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 26వ కులం. భవసారులు గుజరాత్ , మహారాష్ట్ర , రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు. బట్టలకు రంగులు వేయడం, టైలరింగు చేయడం వీరి ప్రధాన వృత్తి గనుక వీరిని రంగ్రేజు రంగరాజ్‌ రంగురాజులు అనికూడా పిలుస్తారు.

పుట్టు పూర్వోత్తరాలు మార్చు

పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకొని హింగులాంబిక అను దేవత గుడిలో తలదాచుకొన్న క్షత్రియులే భవసారులని, కనుక భవసారులు క్షత్రియవర్ణానికి చెందినవారని సిద్ధాంతం ఉంది. సూరత్కు చెందిన భవ సింగ్, సర సింగ్ అను యువరాజులు భవసార సమాజాన్ని నెలకొల్పారని కూడా కథనం ఉంది. చరిత్ర ప్రకారం వీరు సింధు (పాకిస్తాన్ ప్రాంతం) నుండి వచ్చినవారు. అయితే వీరు క్షత్రియ వర్ణానికి చెందినవారని చెప్పుటకు ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు.

రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది భవసార క్షత్రియ కుల స్తులు అన్ని జిల్లాలలో మనకు కనిపిస్తారు. రంగుల అద్ద కంతోపాటు టైలరింగ్‌ పని కూడా వీరి కులవృత్తే. వీరిలో అక్షరాస్యులు 30 శాతంమంది ఉన్నప్పటికీ 70 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. ఇక వీరిలో ప్రజాప్రతినిధుల ఎవ్వరూ లేరు.ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే రంగులు తీసుకొచ్చి బట్టలకు అద్దకాలు వేస్తున్నారు. గతంలో ఎవరికి వారు రంగులను తయారు చేసుకునేవారు. ఈ ప్రక్రియ చాల కష్టంతో కూడుకున్నది. కనుకనే చేనేత వృత్తిదారుల నూలుకు రంగులు అద్దాలంటే వీరిపైనే ఆధారపడేవారు. తగరేసల అనే చెట్టు గింజలను ఉడకబెట్టి పూర్వపు రోజుల్లో రసం తీసేవారు. ఇది నీలి రంగులో ఉంటుంది కనుక నీలం రంగు అద్దాలంటే దీన్ని ఉపయోగించేవారు. వీరు తయారు చేసిన నీలిరంగుకు బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగో రంగు సమపాళ్లలో కలిపి మీటరు లోతున్న కాగుల్లో మగ్గబెట్టేవారు. ఈ మగ్గపెట్టే విధానం కూడా శ్రమ, ఓర్పుతో కూడుకుంది. మేక, గొర్రె పెంటికలను సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెడతారు. ఆ పెంటికలు మొత్తం ఒకే చోట పొగుపడటంతో రసాయన ప్రక్రియ మొదలై వెచ్చటి ఆవిరి వచ్చేది. ఈ ఆవిరితో రెండు రోజులపాటు లోపలున్న ద్రవం మగ్గి నల్లటి రసంగా మారేది. ఈ విధంగా నల్లరంగును ఇతర రంగులను తయారుచేసి నేతన్నలకు అందించేవారు. కాలక్రమంలో అధునాతన రంగులు, లెక్కకు మించిన షేడ్‌‌స మార్కెట్‌లోకి రావటంతో వీరి వృత్తి దెబ్బతింది.స్వాతంత్య్రానికి పూర్వం చేతివృత్తిగా ఆవిర్భవించిన దర్జీపని నేడు పెద్ద ఇండస్ట్రీగా వెలుగొందుతోంది. కాగా అందులో భవసార క్షత్రియులు దినసరి కార్మికులుగా పనిచేయాల్సి వస్తోంది. పెడల్‌ మిషన్‌ స్థానంలో ఎలక్ట్రికల్‌ సూయింగ్‌ మిషన్లు చోటుచేనుకున్న రోజుల్లోనే వీరు రానున్న గడ్డుకాలాన్ని అంచనావేశారు. ఇక `జుకి' మిషన్‌ రంగప్రవేశంతో టైలర్లుగా పనిచేస్తున్న వారు దెబ్బతిన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న బడా వ్యాపారులు రాష్ర్టంలో ఇండస్ట్రీస్‌ ప్రారంభించి లాభాలు ఆర్జిస్తున్నారు. భవసార క్షత్రియ కులస్తులను బిసి-డి నుంచి బిసి- ఏ గ్రూప్‌లోకి మార్చాలని, పోలీస్‌, ఆస్పత్రి యూనిఫారం లు, హాస్టల్‌ విద్యార్థుల డ్రస్‌లు తయారు చేసే అవకాశం తమ కులస్తులకు కల్పించాలని వీరి డిమాండ్లు.

లంకెలు మార్చు