మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం

మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం, మడికొండ గ్రామానికి చెందిన ఓ పుణ్యక్షేత్రం. హైదరాబాద్‌-హన్మకొండ జాతీయ రహదారి మీద కాజీపేట రైల్వే జంక్షనుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం.[1]

మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం
మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం is located in Telangana
మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం
మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం
తెలంగాణ లో స్థానం
భౌగోళికాంశాలు :18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వరంగల్ జిల్లా
ప్రదేశం:హన్మకొండ మండలం, మడికొండ గ్రామం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 1198-1261 మధ్యకాలం
సృష్టికర్త:కాకతీయులు

ఆలయ చరిత్ర, విశేషాలు మార్చు

ఈ క్షేత్రం శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పుతుంది. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది. సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే రామలింగేశ్వరాలయమన్న పేరు వచ్చింది. ఇక్కడున్న రామాలయమూ అంతే ప్రాచీనమైంది. కాకతీయుల కాలంలో వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. దేవగిరి యాదవరాజుల దండయాత్రలను అరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు గుర్తించారు. అక్కడో కోట కూడా కట్టారు. సా.శ. 1198-1261 మధ్యకాలంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.సిద్ధుల తపస్సుతో...కరవుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ గుట్ట మీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి కూడా పూజలందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వరీ ఉపాసన చేసినట్టు చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని ఓ కథనం. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు.మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందనీ అవే ఈ శిలలనీ ఓ కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని వ్యవహరిస్తారు. గుట్టమీద ఓ జత పాదముద్రలున్నాయి. ఇవి, ద్వాపరయుగంలో ఇక్కడికొచ్చిన భీమసేనుడివేనంటారు. అలా, ముచ్చటగా మూడు యుగాల్లోనూ మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది.

ఉత్సవాలు మార్చు

ఏటా మెట్టుగుట్టపై మహాశివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి జాగరణ, శివపార్వతుల కల్యాణం నేత్రపర్వంగా సాగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో తేరును లాగితే అవివాహితులకు కల్యాణయోగం ప్రాప్తిస్తుందంటారు.

మూలాలు మార్చు

  1. "దక్షిణకాశీ.. హరిహర క్షేత్రం మెట్టుగుట్ట". www.navatelangana.com. 2021-03-11. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.

ఇతర లింకులు మార్చు