రాణి కమలాపతి 18వ శతాబ్దపు భారతదేశపు గోండు రాణి, నాయకురాలు. ఆమె భోపాల్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న గిన్నౌర్‌ఘర్‌కు చెందిన గోండు రాజు నిజాం షా భార్య. ఆమె తండ్రి రాజా కిర్పాల్ సింగ్ సిరౌటియా సల్కాన్‌పూర్ రాచరిక రాష్ట్రమైన సెహోర్‌కు రాజు.రాణి కమలాపతి గుర్రపుస్వారీ, మల్లయుద్ధం, విలువిద్య‌లో ఎంతో నైపుణ్యం ఉంది.[1]

జీవిత విశేషాలు మార్చు

18వ శతాబ్దంలో భోపాల్‌ ప్రాంతం గోండు రాజ్యం. నిజాం షా అనే గోండు రాజు సెహోర్‌ జిల్లాలోని గిన్నోర్‌ ఘర్‌ కోట నుంచి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి 7 గురు భార్యలని కాదు ముగ్గురు భార్యలని కథనాలు ఉన్నాయి. వారిలో ఒక భార్య రాణి కమలాపతి. కమలావతికి అపభ్రంశం ఈ పేరు. కమలాపతి అపూర్వ సౌందర్యరాశి. ఆమె సౌందర్యానికి ఆరాధకుడైన నిజాం షా ఆమె కోసం భోపాల్‌లో ఒక 7 అంతస్తుల కోట కట్టించాడని ఒక కథనం. ఆ కోట ఇప్పుడు భోపాల్‌లో ఉంది. 5 అంతస్తులు నీట మునిగి రెండు పైకి కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ కోటలో ఇంకా కమలాపతి ఆత్మ తిరుగాడుతుందని విశ్వసిస్తారు.[2]

రాజభవనంలోని మార్గాలు రాణి గౌరవార్థం తామరపువ్వు ఆకారంలో నిర్మించారు.1989లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని తన రక్షణలోకి తీసుకుంది.సల్కాన్‌పూర్‌కు చెందిన చైన్‌సింగ్‌ రాణి కమలాపతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాణి కమలాపతి గోండు రాజు నిజాం షాను వివాహం చేసుకుంది.ఆ తర్వాత నిజాం షాను హత్య చేసేందుకు చైన్ సింగ్ అనేక ప్రయత్నాలు చేశాడు.

గోండు రాజ్యం మీద, కమలాపతి మీద కన్నేసిన మరిది వరసయ్యే చైన్‌ సింగ్‌ అనే వ్యక్తి నిజాం షాకు విషం పెట్టి చంపుతాడు. అతడు తనను లోబరుచుకుంటాడని భావించిన కమలాపతి పసిబిడ్డైన తన కుమారుడు నావెల్‌ షాను తీసుకొని మారు పేరుతో కోటను విడిచి దేశం పట్టింది. కొన్నాళ్లకు ఆమె గోండులకు విశ్వాస పాత్రుడైన యుద్ధవీరుడు మహమ్మద్‌ ఖాన్‌ను కలిసింది. తన భర్త హంతకుడైన చైన్‌ సింగ్‌ను చంపమని ఆమె కోరిందని, అందుకు వెయ్యి రూపాయల సుపారీ ఇచ్చిందని ఒక కథనం. ఆ సుపారీ ధనంలో కూడా ఒక వంతే చెల్లించి మిగిలిన దానికి భోపాల్‌లోని కొంత భాగం ఇవ్వజూపిందని అంటారు. మరో కథనంలో ఆమెకు సంబంధం లేకుండానే ఆమె బాధను చూసి మహమ్మద్‌ ఖానే స్వయంగా గిన్నోర్‌ఘర్‌ కోట మీద దాడి చేసి చైన్‌ సింగ్‌ను హతమారుస్తాడు. అంతే కాదు, తానే ఇప్పుడు భోపాల్‌లో ఉన్న కమలాపతి మహల్‌ను కట్టించి కమలాపతికి ఇచ్చాడు.

మహమ్మద్‌ ఖాన్‌ కమలాపతిని సొంతం చేసుకోవాలని ఆశించాడు. ఈ విషయం తెలుసుకున్న కమలాపతి కుమారుడు 14 ఏళ్ల నావల్‌ షా ఆగ్రహంతో మహమ్మద్‌ ఖాన్‌ మీద యుద్ధానికి దిగుతాడు. ‘లాల్‌ఘాటీ’ అనే ప్రాంతంలో జరిగిన ఆ యుద్ధంలో అతను మరణిస్తాడు. కమలాపతి వర్గీయులు ఆ వెంటనే లాల్‌ఘాటీ నుంచి నల్లటి పొగను వదులుతారు (గెలిస్తే తెల్ల పొగ).

మహల్‌ నుంచి ఆ పొగను చూసిన కమలాపతి తాము అపజయం పొందినట్టు గ్రహించి మహల్‌ ఒడ్డున ఉన్న సరస్సు గట్టును తెగ్గొట్టించింది. నీళ్లు మహల్‌ను ముంచెత్తాయి. కమలాపతి తన నగలు సర్వస్వం నదిలో వేసి జల సమాధి అయ్యింది. 1722లో ఆమె మరణం తర్వాత అక్కడి గోండు రాజ్యం అంతరించింది. గోండు రాణి కమలాపతి జీవితం సాహసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మబలిదానంతో నిండినది. అందుకనే ఆమెను మధ్యప్రదేశ్‌లోనూ గోండులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో అభిమానంగా తలుస్తారు. ఇప్పుడు ఆమె పేరు ఒక పెద్ద రైల్వే స్టేషన్‌కు పెట్టడం భావితరాలకు ఆమె స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది.

గుర్తింపు మార్చు

నవంబర్ 2021లో, భోపాల్‌లోని 'హబీబ్‌గంజ్' అనే రైల్వే స్టేషన్ పేరు 'రాణి కమలపతి రైల్వే స్టేషన్'గా మార్చబడింది.[3]

మూలాలు మార్చు

  1. NarsimhaMurthy (2022-03-26). "హిందుస్థాన్ చివరి రాణి కమలాపతి ఎంతటి వీరనారి అంటే." TeluguStop.com. Retrieved 2023-04-11.
  2. "ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..?". Sakshi. 2021-11-17. Retrieved 2023-04-11.
  3. PTI (2021-11-15). "PM Modi inaugurates modern Rani Kamalapati railway station in Bhopal". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-11.