రైతు వేదిక (తెలంగాణ)

రైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రైతు వేదిక భవనం.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకుగాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ, టిఫిన్లను సైతం అందిస్తున్నారు.

ఏర్పాటు మార్చు

తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఈ రైతు వేదిక ద్వారా సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్‌ గానూ ఈ వేదికలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను నియమించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం, భూమి లభ్యత ఉన్న చోట ఎకరం ప్రభుత్వం కేటాయించింది. రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.[1]

తెలంగాణలో రైతు వేదికలున్న గ్రామాలు మార్చు

ప్రారంభోత్సవం మార్చు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.[4][5]

లక్ష్యాలు, నిర్వహణ మార్చు

  • ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక రైతు వేదిక ఉంటుంది. దానికి వ్యవసాయ మండల విస్తరణ అధికారి (ఏఈవో) బాధ్యులుగా ఉంటారు.
  • రైతువేదికల్లో రైతు సమన్వయ సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి.
  • ఖరీఫ్, రబీల్లో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందో వ్యవసాయశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి.
  • పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, రసాయనాల వాడకం గురించి వివరించాలి.
  • పొలాలకు సంబంధించిన భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించాలి.
  • భసార ఫలితాలకనుగుణంగా రైతులు పంటలు సాగుచేసుకునేలా వ్యవసాయాధికారులు చొరవ చూపాలి.

నిధులు మార్చు

రైతు వేదికల్లో శిక్షణ ద్వారా రైతులను మరింత సుశిక్షితులను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రైతు వేదికల నిర్వహణ, వాటి ద్వారా కర్షకులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఒక్కో రైతు వేదిక నిర్వహణకు 2022 ఏప్రిల్ నెల నుండి నెలకు 9 వేల రూపాయల చొప్పున అందజేసేందుకు నిర్ణయించింది. ఈ నిధులతో రైతు వేదికల కరెంట్‌ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. గతంలోనే ఈ రైతు వేదికల నిర్వహణ కోసం ప్రతినెలా 3 వేల రూపాయలను ఇవ్వడంతోపాటు రైతుల సమావేశాల నిమిత్తం కుర్చీలు, టేబుళ్ళను అందజేసింది.[6]

మూలాలు మార్చు

  1. Eenadu (31 October 2020). "రైతు ఐక్యతకు వేదిక". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  2. Andhrajyothy (6 July 2021). "సంక్షేమానికి మరో భూమిక రైతువేదిక". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  3. Namasthe Telangana (30 May 2021). "రైతు వేదికలు రెడీ". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  4. Zee News Telugu (31 October 2020). "రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  5. HMTV (31 October 2020). "కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  6. telugu, NT News (2022-12-13). "రైతు వేదికలపై పోకస్". www.ntnews.com. Archived from the original on 2022-12-13. Retrieved 2022-12-15.

వెలుపలి లంకెలు మార్చు