వరలక్ష్మీ త్రిశతి

వరలక్ష్మీ త్రిశతి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన పద్యరచన. భార్యావియోగ దు:ఖాన్ని వివిధ సందర్భాల్లో వ్రాసుకున్న పద్యాల సంకలనం ఇది.

రచన నేపథ్యం మార్చు

 
రచయిత విశ్వనాథ సత్యనారయణ

విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో అత్యంత దు:ఖభరితమైన సందర్భం, ఆయన సాహిత్యంలో పదే పదే ప్రస్తావనకు వచ్చిన సందర్భం ఆయన మొదటి భార్య వరలక్ష్మి మరణం. ఆమె 1931లో అనారోగ్యకారణాల రీత్యా అకాల మృత్యువాత పడ్డారు. ఆమె మరణించిన వ్యగ్రతలో తన దు:ఖభరితమైన, వేదనాపూరితమైన వివిధ భావాలను, స్మృతులను అక్షరీకరించి రాసుకున్నారు.[1] ఐతే ఆ రచనను దాదాపు ఇరవయ్యేళ్ళ వరకూ ముద్రణలోకి తీసుకురాలేదు. 1952లో ఈ గ్రంథాన్ని ఆయన తొలిగా ప్రచురించారు.

అంశం మార్చు

విశ్వనాథ తన భార్య వరలక్ష్మి అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా తరచుగా పేర్కొన్నారు. వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో పేర్కొన్నారు. ఆమె వాగ్మాధుర్యం, సౌందర్యం, పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమేనని పద్యరూపంగా పేర్కొన్నారు.

వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
.......ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి

నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
       లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు

(విశ్వనాథ సత్యనారాయణ:వరలక్ష్మీ త్రిశతి) వంటి పద్యాల్లో తన సమస్తమైన కవిత్వానికి తన మొదటి భార్య వరలక్ష్మి కారకురాలని, నీరసమైన తన తత్త్వాన్ని మార్చి గొప్ప కవిని చేసిందని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి మరణం విశ్వనాథ సత్యనారాయణను తీవ్రంగా కలచివేసింది. ఆ సందర్భంగా వ్రాసిన పద్యాల సంకలనమిది.
ఇవి మొత్తంగా 300 వందల పద్యాలు. వందేసి పద్యాల చొప్పున మూడు శతకాలయ్యాయి. కర్మ శతకం, స్మృతి శతకం, నిత్య శతకం అనే పేర్లతో వాటిని విభాగించారు. మరణానంతరం ఉండే తీవ్రమైన వ్యగ్రత, భరింపరాని దు:ఖం క్రమక్రమంగా స్మృతిగా మిగిలేవరకూ రాశారు.


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. భరతశర్మ, పేరాల (సెప్టెంబరు 1982). విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం). హైదరాబాదు: విశ్వనాథ స్మారక సమితి.